అప్పుడు పవన్ , ఇప్పుడు చిరు పిలిచి ఆఫర్
హైదరాబాద్: సత్తా ఉన్నవాడికి ప్రపంచం సలాం చేస్తుంది అన్న మాటలు...మాటలు రచయిత సాయి మాధవ్ బుర్రాకు వర్తిస్తాయి. తన కలం బలంతో దూసుకుపోతున్న ఆయన్ని పవన్ కళ్యాణ్ తన గోపాల గోపాల చిత్రం కోసం పిలిచి స్పెషల్ గా మాటలు రాయించుకున్నారు. ఇప్పుడు చిరంజీవి సైతం తన 150 వ చిత్రం కోసం పిలిచి డైలాగులు రాయిస్తున్నట్లు సమాచారం.
రానా హీరోగా వచ్చిన కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రంతో డైలాగ్ రైటర్ గా తన పెన్ పవర్ ఏంటో చూపించాడు బుర్రా సాయిమాధవ్. ఆ తర్వాత గోపాల గోపాల, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, కంచె... ఇలా వరస సినిమాలతో వరుసగా అద్బుతమైన డైలాగ్స్ రాసి బ్లాక్ బస్టర్ రచయితగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన మరోసారి చిరంజీవి కోసం నిలిచిపోయే డైలాగులు రాయటానికి సిద్దమవుతోంది.

ఇప్పటికే భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు తెర వెనుక పనిచేసే వారి విషయంలో దర్సకుడు వివి వినాయిక్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాధారణంగా వినాయక్ సినిమా అంటే సాధారణంగా ఆకుల శివ రచయితగా వ్యవహరిస్తాడు. కానీ ఇది చిరంజీవి 150వ సినిమా కాబట్టి అభిమానులు చిరంజీవి పోలిటికల్ ఇమేజ్ కు తగ్గట్టుగా సందేశాత్మకమైన మాటలను కూడా ఆశిస్తారు.
అందుకే ఆలోటు తీర్చేందుకు సాయి మాధవ్ ను రంగంలోకి దించినట్లు చెప్తున్నారు. సాయి మాధవ్ డైలాగుల్లో సామాజిక అంశాలతో పాటు, సందేశాలు కూడా వినిపిస్తుండటంతో చిరు పిలిచి మరి అవకాశం ఇచ్చారని తెలుస్తోంది.
ఈ సినిమాలో అత్యంత కీలకమైన సన్నివేశాల్ని అతడి చేత రాయించేందుకు చిరు ప్లాన్ చేసి సాయిమాధవ్ ని పిలిపించారుట. ఆ ఆరేడు సీన్స్ సినిమాని నిలబెట్టే కీ సీన్స్ అని తెలుస్తోంది. ఈ చిత్రానికి పరుచూరి సోదరులు రచయితలుగా పనిచేస్తున్నారు.


Click it and Unblock the Notifications











