ఆ తెలుగు క్లాసికల్ హిట్ ని మరోసారి బాలీవుడ్ లో రీమేక్ చేస్తారట
దక్షిణాది దిగ్గజ దర్శకుల జాబితాలో ముందు వరుసలో ఉండే పేరు బాలచందర్. కమల్ హాసన్, సరిత హీరో హీరోయిన్లుగా 1978లో ఆయన తెరకెక్కించిన చిత్రం "మరో చరిత్ర". అప్పటికే రంగుల చిత్రాలు విరివిగా వస్తున్న సమయంలో నలుపు-తెలుపులో విడుదలైన మరో చరిత్ర సినిమా సంచలన విజయం సాధించింది. అలనాటి క్లాసికల్ చిత్రాల్లో ఒకటి గా ఈ విషాదాంత ప్రేమకథ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. బాలు-స్వప్న లు గా కమల్ హసన్, సరిత లు అత్యద్బుత నటనతో "మరో చరిత్ర" ని క్లాసికల్ గా నిలబెట్టాయి.
1981లో ఇదే సినిమాను ఎల్.వి.ప్రసాద్ హిందీలో "ఏక్ దూజె కే లియె" అన్న పేరుతో పునర్నిర్మించాడు. హిందీలో కమల్ హాసన్, రతి అగ్నిహోత్రి నటించారు. హిందీలో పాటలు కూడా బాలు పాడాడు. హిందీ పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఈ తెలుగు సినిమా డబ్బింగ్ లేకుండా తమిళనాడులో విడుదలయ్యి మద్రాసు (చెన్నై) లో సంవత్సరంపాటు ఆడింది.

అలాంటి సినిమాని ఇప్పుడు రీరీమేక్ చేయడానికి "ఏక్ దుజే కే లియే"లోనే హీరోయిన్గా నటించిన రతి అగ్నిహోత్రి ప్రయత్నిస్తున్నారు. హీరోగా ఎవరో కాదు ఆమె కుమారుడు తనూజ్ విర్వాణి ని పరిచయం చేస్తూ ఈ క్లాసిక్ని పునర్నిర్మించాలని అగ్నిహోత్రి అనుకుంటున్నారట. ఇప్పటికే "మరోచరిత్ర" నిర్మాతలైన ప్రసాద్ పొడ్రక్షన్స్ నుండి హక్కులను తీసుకుని స్క్రిప్ట్ను కూడా ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టు మార్పులు చేయిస్తున్నారట. ఆమె సొంత నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చే యేడాది ఆరంభంలో సెట్స్ మీదికి వెళ్ళనుంది.


Click it and Unblock the Notifications











