అనవసరంగా తిట్టాను: సారి చెప్పిన సోనాక్షి
ముంబైః ఆ మధ్య ఢిల్లీలో ఓ సంఘటన గుర్తుందా? సరబ్జిత్ సింగ్ అనే వ్యక్తి తనను వేధిస్తున్నట్లుగా జస్లీన్ కౌర్ అనే యువతి.. అతని ఫొటోని సోషల్ మీడియాలో పెట్టింది. సోషల్ మీడియా ద్వారా వైరల్లా వ్యాపించిన ఆమె పోస్టు చివరకు అతన్ని అరెస్టు చేసే వరకు వెళ్లింది. పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆ యువతికి మద్దతుగా నిలించారు. సరబ్జిత్పై విమర్శల వర్షం కురిపించారు.

బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా కూడా ట్విట్టర్ ద్వారా విమర్శల వర్షం కురిపించింది. అయితే ఆ యువతి కావాలనే సరబ్జిత్ సింగ్పై తప్పుడు ఆరోపణలు చేసినట్లుగా ప్రత్యక్ష సాక్షి ఒకరు మీడియాలో వెల్లడించారు. దీంతో సోనాక్షి సిన్హా ఆలోచనలో పడింది. ట్విట్టర్ ద్వారా సర బ్ జిత్ సింగ్పై అనుచితంగా వ్యాఖ్యానించినందుకు చింతిస్తున్నట్లుగా ఆమె పేర్కొంది. అతనికి క్షమాపణలు కూడా చెప్పింది.
ఇలా క్షమాపణలు చెప్పడం చిన్నతనం కాదనీ, హుందాతనమని సోనాక్షి పేర్కొనడం గమనార్హం.
సోనాక్షి సిన్హా సినిమాల విషయానికొస్తే...
ఆల్ ఈజ్ వెల్ చిత్రంలో అతిథి పాత్రలో నటించిన ఆమె మురుగదాస్ దర్శకత్వంలో ‘అకీరా' అనే చిత్రంలో నటిస్తోంది. తమిళంలో సూపర్ హిట్టయిన ‘మౌన గురు' చిత్రాన్ని హిందీలో ‘అకీరా' పేరుతో రీమేక్ చేస్తున్నారు. అకిరా అనగానే విఖ్యాత జపాన్ దర్శకుడు అకిరా కురోసావానే అందరికీ గుర్తుకు వస్తాడు. అకిరా కురోసావా అంటే దేశవిదేశాల్లో ఎందరికో అభిమానం. జపాన్ భాషలో 'అకిరా' అంటే మేధావి అనే అర్థం ఉంది. అందుకు తగ్గట్టుగానే 'అకిరా'లో సోనాక్షి సిన్హా పాత్రను తీర్చిదిద్దుతున్నాడట మురుగదాస్.


Click it and Unblock the Notifications











