ముంబై చేరిన శ్రీదేవి మృతదేహం, అంతిమయాత్రకు ఏర్పాట్లు!
Recommended Video

దుబాయ్లో అనుమానాస్పదంగా మృత్యువాతపడ్డ శ్రీదేవి భౌతికకాయం ప్రత్యేక విమానంలో మంగళవారం రాత్రి ముంబై చేరుకుంది. అక్కడి నుండి నేరుగా ముంబై లోఖండ్ వాలా ప్రాంతంలోని గ్రీన్ ఏకర్స్ లో ఉన్న నివాసానికి తరలించారు. బుధవారం ఉదయం శ్రీదేవి భౌతికకాయాన్ని సెలబ్రేషన్స్ క్లబ్ కు తరలించారు. ఈ నేపథ్యంలో అక్కడకి ఆమె అభిమానులు పోటెత్తారు.

బుధవారం మధ్యాహ్నం అంత్యక్రియలు
శ్రీదేవి అంత్యక్రియలు బుధవారం నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియలకు సంబంధించి షెడ్యూల్ కూడా విడుదలైంది. ఆ షెడ్యూల్ ప్రకారం అభిమానులు, ప్రముఖులు శ్రీదేవి ఆఖరి చూపుకోసం తరలి వస్తున్నారు. ఇప్పటికే కొందరు ముంబై చేరుకున్నారు.

అభిమానుల సందర్శనార్ధం
శ్రీదేవి భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం ముంబైలోని సెలబ్రేషన్స్ స్పోర్ట్స్ క్లబ్లో బుధవారం ఉదయం 9.30 నుంచి 12.30 వరకు ఉంచుతారని తెలుస్తోంది.

అంతిమయాత్ర
బుధవారం మధ్నాహ్నం 2 గంటలకు సెలబ్రేషన్స్ స్పోర్ట్స్ క్లబ్ నుండి శ్రీదేవి అంతిమయాత్ర మొదలు కాబోతోంది. ఈ అంతిమయాత్రలో వేలాది మంది అభిమానులు పాల్గొననున్నారు. ఈ మేరకు ముంబైలో అంతిమయాత్ర జరిగే దారిలో ట్రాఫిక్ నిబంధనలు విధించడంతో పాటు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

3.30 గంటలకు అంత్యక్రియలు
బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు విలే పార్లే హిందూ శ్మశాన వాటికలో శ్రీదేవి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. శ్మశాన వాటిక వద్ద భారీగా అభిమానులు తరలిరానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

అంతిమయాత్రలో తెలుగు సినీ ప్రముఖులు
శ్రీదేవి అంతిమయాత్రలో పలువురు తెలుగు సినీ ప్రముఖులు పాల్గొనబోతున్నారు. ఇప్పటికే వెంకటేష్ తదితరులు ముంబై వెళ్లారు. ఇతర దక్షిణాది తారలు కూడా శ్రీదేవి భౌతిక కాయాన్ని రేపు సందర్శించనున్నారు.


Click it and Unblock the Notifications











