Super Star Krishna.. రాజకీయాల్లో చురుకుగా.. ఎంపీగా లోక్సభకు.. టీడీపీ కార్యకర్తల రాళ్లదాడి!
సూపర్ స్టార్, నట శేఖర కృష్ణ ఆకస్మిక మరణం అభిమానులకు, సినీ ప్రముఖులకు తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. ఇటీవల ఆయన కుటుబంలో జరిగిన వరుస విషాదాలను తట్టుకొని ఆరోగ్యంగా కనిపించారు. అయితే అనూహ్యంగా ఆదివారం రాత్రి గుండెపోటుకు గురైన కృష్ణను ఆయన కుటుంబ సభ్యులు ప్రముఖ హాస్పిటల్కు తరలించారు. ఆయనను బతికించేందుకు ఎనిమిది మందితో కూడిన వైద్య బృందం తీవ్రంగా శ్రమించారు. అయితే మృత్యువుతో పోరాటం చేస్తూ ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. సూపర్ స్టార్ కృష్ణ జీవిత విశేషాల విషయాల్లోకి వెళితే..

ఎన్టీఆర్తో నువ్వా? నేనా?
కృష్ణ తన కెరీర్లో అగ్ర నటులతో ధీటుగా రాణించారు. అప్పటికే స్టార్ హీరోలుగా ఇండస్ట్రీని శాసిస్తున్న నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు లాంటి అగ్రనటులతో కలిసి నటించడమే కాకుండా వారితో సమానంగా స్టార్ స్టేటస్ను సాధించారు. అప్పట్లో సీనియర్ హీరోలతో సానుకూలమైన వాతావరణంలో పోటీని ఉండేలా కృష్ణ చూసుకొనే వారని సినీ వర్గాలు వెల్లడిస్తారు.

కాంగ్రెస్ పార్టీ తరఫున రాజకీయాల్లోకి
అయితే రాజకీయ రంగంలో కూడా ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోను ధీటుగా ఎదుర్కొన్నారు. ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ స్థాపించి ప్రభంజనం కొనసాగిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన అహర్నిశలు కృషి చేశారు. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. తెలుగు దేశం పార్టీకి వ్యతిరేకంగా కొన్ని సినిమాలు కూడా తీయడం తెలిసిందే.

ఏలూరు ఎంపీగా కృష్ణ ప్రయాణం
కాంగ్రెస్ పార్టీలో చురుకుగా వ్యవహరించిన సూపర్ స్టార్ కృష్ణ.. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 1969లో టీడీపీ అభ్యర్థిపై భారీ మెజారిటీ సాధించారు. అయితే 1989 నుంచి 1991 వరకు మాత్రమే ఆయన ఎంపీగా ఉన్నారు. 1991 వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో ఆయన తన సమీప ప్రత్యర్థి బోళ్ల బుల్లిరామయ్య చేతిలో ఓటమి చెందారు.

లోక్సభ పార్లమెంట్ కమిటీల్లో
ఎంపీగా సేవలు అందించే సమయంలో సూపర్ స్టార్ కృష్ణ పార్లమెంట్ కమిటీల్లో చురుకుగా పాల్గొన్నారు. కన్సల్టెటివ్ కమిటిలోను, అలాగే కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిత్వ శాఖకు సంబంధించిన కమిటీలో కూడా విశేష సేవలు అందించారు. భారతీయ సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఆయన ఎనలేని సేవలు అందించారు. చివరి వరకు కాంగ్రెస్ పార్టీతో అనుబంధాన్ని కొనసాగించారు.

క్రీయాశీలక రాజకీయాలకు దూరంగా
ఎంపీగా ఓటమి పాలైన తర్వాత కృష్ణ క్రీయాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తున్న సమయంలో ఏలూరు నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల సభలో తెలుగుదేశం అభిమానులు ఆయనపై రాళ్లదాడి చేశారు. ఆ సమయంలో కృష్ణ కంటికి గాయమైంది. ఆ సమయంలో భారీ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకొన్నారు.

గుంటూరు రాజకీయాల్లో చక్రం తిప్పి..
సూపర్ స్టార్ కృష్ణ క్రియాశీలక రాజకీయాలకు దూరమైనప్పటీకి.. పరోక్షంగా తన పాపులారిటిని ఉపయోగించారు. రాజకీయాల్లో ఉండే తన అభిమానులకు అండగా నిలిచి గెలిపించడంలోను చర్యలు తీసుకొనే వారు. పలువురు రాజకీయ నేతలు కృష్ణ సపోర్ట్ కోరుకొనే వారు. ఆయన అల్లుడు గల్లా జయదేవ్ను గుంటూరు ఎంపీగా గెలిపించడంలోను తనదైన శైలిలో వ్యూహాలు పన్నారని సినీ, రాజకీయ వర్గాలు పేర్కొంటాయి.


Click it and Unblock the Notifications











