తెలుగు సినిమా షూటింగుల నిలిపివేత వద్దు.. కీలక ప్రకటన చేసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్!
తెలుగు సినీ పరిశ్రమలో సినీ నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోతుంది. ఒక్కో హీరోకి రెమ్యూనరేషన్ ఇచ్చే డబ్బులతో ఇతర భాషల్లో సినిమా మొత్తం తీసేయొచ్చు అంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఈ నేపథ్యంలోనే హీరోలకు హీరోయిన్లకు ఇతర నటీనట్లకు భారీ ఎత్తున రెమ్యూనరేషన్ లు కురిపిస్తుంటే సినీ కార్మికులు సైతం తాము ఏమి అన్యాయం చేశాము అంటూ తమకు కూడా వేతనాలు పెంచమని పెద్ద ఎత్తున డిమాండ్లు చేస్తున్నారు. వేతనాలు పెంచకపోతే షూటింగులకు వచ్చేది లేదంటూ ఏకంగా రెండు రోజుల పాటు షూటింగులు కూడా నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడడంతో నిర్మాతలు అప్పటికప్పుడు మధ్య మార్గంగా ఒక నిర్ణయం తీసుకున్నారు.
కానీ ఆ రేట్లతో భారీ రెమ్యూనరేషన్లతో సినిమాలు నిర్మించాలంటే వర్కౌట్ అయ్యే విషయం కాదని అంటున్నారు. ఈ విషయంలో ఏదో ఒక నిర్ణయానికి వచ్చే వరకు సినిమా షూటింగులు సైతం నిలిపివేయడానికి సిద్ధమైన నేపథ్యంలో తెలుగు సినిమా నిర్మాతల మండలి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు సినిమా నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, స్టూడియోలలో వారితో జూలై 26వ తేదీన ఒక సమావేశం నిర్వహించాలని ఆ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుని దాని మేరకు ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. అయితే అప్పటివరకు మీడియాలో కానీ ఇతర పుకార్లు కానీ నమ్మవద్దని 26వ తేదీ ఏం జరిగిందనే విషయాన్ని తామే స్వయంగా వెల్లడిస్తామని వెల్లడించారు.

అప్పటివరకు సినిమా షూటింగులు కానీ ఇతర నిర్మాణ కార్యకలాపాలు కానీ యధావిధిగా కొనసాగించాలని కోరుతూ ఒక తెలుగు సినిమా నిర్మాతల మండలి గౌరవ కార్యదర్శులు మోహన్ వడ్లపట్ల, ప్రసన్నకుమార్ ఇద్దరూ కలిసి సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఎలాంటి అప్డేట్ ఉన్నా తాము మీడియా ముఖంగా వెల్లడిస్తాం కానీ అప్పటివరకు ఎలాంటి నిర్ణయానికి రావద్దని సినిమా షూటింగులు యధాతరంగా జరిపేలా నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. ఇక ఇప్పటికే సినిమా నిర్మాతలు సైతం ఒక నిర్ణయానికి వచ్చారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో షూటింగులు ప్రస్తుతానికి ఆగే పరిస్థితి లేదని అంటున్నారు. మరి 26వ తేదీన జరిగే సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు టాలీవుడ్ వర్గాలలో ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











