పంతం నెగ్గించుకున్న తెలుగు సినీ కార్మికులు.. జీతాల పెంపు.. ఎంత పెరిగాయంటే?
టాలీవుడ్ సినీ కార్మికుల వేతనాలు చెల్లించాలనే డిమాండ్ తో సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. తమకు వేతనాలు పంచేవరకు షూటింగ్స్కు హాజరు కాబోమని బుధవారం సినీ కార్మికులందరూ సమ్మెకు దిగడంతో తెలుగు సహా హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న కొన్ని సినిమాల షూటింగులు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే ఎట్టకేలకు వారి డిమాండ్స్ కి నిర్మాతలు ఒప్పుకున్నారు.

ఆత్మహత్యాయత్నం
నిజానికి వేతనాలు పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే ముందస్తు సమాచారం లేకుండా ఆకస్మికంగా ఇలా సమ్మె చేపట్టడం సరైనది కాదని షూటింగులకు బేషరతుగా రాకపోతే మేమే షూటింగ్స్ ఆపేస్తామని కూడా హెచ్చరించారు తెలుగు చిత్ర నిర్మాతలు. ఫెడరేషన్ భవనం వద్ద పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలోనే పోలీసులు మొహరించారు. ఒకరిద్దరు ఆత్మహత్యాయత్నం కూడా చేయడంతో చర్చనీయాంశంగా మారింది.

షూటింగ్ లు ప్రారంభం
ఈ క్రమంలోనే ఇరువర్గాలు ఎవరికి వారే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో భేటీ కూడా అయ్యి తమ తమ వెర్షన్స్ వినిపించారు. ఈ విషయంలో తలసాని జోక్యం చేసుకోవడంతో జరుగుతున్న చర్చలు అన్నీ సఫలం అయ్యాయి. ఈ క్రమంలో రేపటి నుంచి సినిమా షూటింగ్ లు ప్రారంభం కానున్నాయి.

దిల్ రాజు అధ్యక్షతన
నిర్మాతల తరపున సీ కళ్యాణ్ మాట్లాడుతూ మంత్రి తలసాని జోక్యంతో ఈ రోజు మీటింగ్ పెట్టుకున్నామని, రేపటి నుంచి యధావిధిగా షూటింగ్స్ జరుగుతాయని పేర్కొన్నారు. రేపు కో ఆర్డినేషన్ కమిటీ డిసైడ్ చేసిన తర్వాత జీతాల పై క్లారిటీ వస్తుందని అన్నారు. ఇక మీదట ఫిల్మ్ ఛాంబర్ , ఫిల్మ్ ఫెడరేషన్ ద్వారా.. సాలరీస్ ఇస్తామని ఆయన అన్నారు. రేపు ఛాంబర్, ఫెడరేషన్ దిల్ రాజు అధ్యక్షతన సమావేశం అవుతుందని పేర్కొన్నారు.

విధి విధానాలపై కూడా
మరోపక ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని మాట్లాడుతూ.. వేతనాల సమస్యపై మీటింగ్ పెట్టుకున్నామని, వేతనాలు పెంచడానికి ఛాంబర్ సభ్యులు ఒప్పుకున్నారని ప్రకటించారు. అలాగే పెంచిన వేతనాలు రేపటి నుంచి అమలులోకి వస్తాయని, రేపు కమిటీ వేతనాలు డిసైడ్ చేస్తాయని చెప్పుకొచ్చారు. అయితే రేపటి నుంచి షూటింగ్స్ మాత్రం యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు. జూన్ 24న దిల్ రాజు అధ్యక్షతన కోఆర్డినేషన్ కమిటీ సమావేశం కానుందన్న ఆయన, ఈ సమావేశంలో విధి విధానాలపై కూడా నిర్ణయం తీసుకోనున్నారని అన్నారు.

ఎలాంటి ఇబ్బంది ఉండదని
ఇక కార్మికులు సమ్మెకు దిగడంతో పెద్ద సినిమాల షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. ప్రభాస్ హీరోగా ప్రాజెక్టు K షూటింగ్, చిరంజీవి భోళా శంకర్ సినిమా, విజయ్ దేవరకొండ ఖుషీ సినిమా షూటింగ్, రవితేజ రావణాసుర సినిమా షూటింగ్, సాయి ధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు సినిమా షూటింగ్, ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి సినిమా, అల్లరి నరేష్ ఇట్లు మారేడు మిల్లీ ప్రజానీకం సినిమా షూటింగ్స్ రద్దయ్యాయి. ఇక హైదరాబాద్ లో షూట్ జరుగుతున్న సల్మాన్ ఖాన్ కభి ఈద్ ఖభి దివాలి సినిమా షూటింగ్, అజయ్ దేవగన్ సినిమా, శివ కార్తికేయన్ -అనుదీప్ కేవీ సినిమా షూటింగ్స్ అన్నీ నిలిచిపోయాయి. ఇక ప్రాబ్లం క్లియర్ కావడంతో ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











