బ్రేకింగ్: Veera Simha Reddy ప్రీరిలీజ్ ఈవెంట్కు ఏపీ సర్కార్ షాక్.. అనుమతి లేదంటూ ఆంక్షలు.. వేదిక మార్పుపై!
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాకు ఏపీలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ షాకిచ్చింది. జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఆంధ్రాలో నిర్వహించేందుకు మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఏర్పాట్లు చేసింది. అయితే చివరి నిమిషంలో ప్రతిపాదిత ప్రాంతంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించేందుకు అనుమతి లేదని అధికారులు ఆంక్షలు విధించారు. దాంతో వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ నిర్వహిస్తారనే విషయం వివాదాస్పదంగా మారింది. ఈ వివాదం వివరాల్లోకి వెళితే..

ఒంగోలు ఏబీయం గ్రౌండ్లో
ఇప్పటికే అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న వీరసింహారెడ్డి సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ను ఒంగోలు పట్టణంలోని ఏబీయం గ్రౌండ్లో నిర్వహించాలని మైత్రీ మూవీ మేకర్స్ ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకను అట్టహాసంగా నిర్వహించాలని శ్రీయాస్ మీడియా భారీగా గ్రౌండ్ చదును చేసే కార్యక్రమాన్ని రెండు రోజుల క్రితం మొదలుపెట్టింది.

భారీ ఏర్పాట్లు.. ఇప్పటికే ఆహ్వానాలు
వీరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీ క్రేజ్ ఉండటంతో వేలాది మంది అభిమానుల కోసం గ్రౌండ్ను సిద్దం చేస్తున్నారు. అంతేకాకుండా పాసులను కూడా భారీగా ప్రింట్ చేయించి పంపిణీ చేశారు. ఇప్పటికే అతిథులకు, సినిమా యూనిట్ సభ్యులు, నటీనటులకు ఆహ్వానాలు పంపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏబీయం గ్రౌండ్లో వేడుకకు అనుమతులు లేవని అధికారులు అభ్యంతరం తెలిపారు.

పలు జిల్లాల నుంచి అభిమానుల రాకతో
వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం పలు జిల్లాల నుంచి బాలకృష్ణ అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. అభిమానుల తాకిడి వల్ల స్థానికంగా శాంతిభద్రతలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి వేదిక మార్చుకోవాలని పోలీసులు సూచించినట్టు సమాచారం. దాంతో ఒక్కసారిగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్వాహకులు తలపట్టుకొన్నంత పనైంది.

ట్రాఫిక్ సమస్యలు ఏర్పడే అవకాశం అంటూ
వీరసింహారెడ్డి ప్రీరీలీజ్ ఈవెంట్ కారణంగా ఒంగోలు నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తి ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. అందుకే వేడుక నిర్వహణకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఒంగోలు నగరం బయట మరో ప్రదేశంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించుకోవాలని పోలీసులు సూచించారు అని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.

వేదిక మార్పుపై సందిగ్ధంలో మైత్రీ మూవీస్
అయితే చివరి నిమిషంలో ఏపీ సర్కారు తీసుకొన్న నిర్ణయంతో వీరసింహారెడ్డి నిర్మాతలు సందిగ్దంలో పడ్డారు. తమ యూనిట్ సభ్యులను, స్థానికుల సహాయంతో మరో వేదికను చూసేందుకు పురమాయించారు. అయితే ఒంగోలులో నిర్వహించలేని పరిస్థితిలో ఏపీలోని మరో చోట గానీ, లేదా హైదరాబాద్లో నిర్వహించే విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పరిశీలిస్తున్నట్టు సమాచారం.

వాల్తేరు వీరయ్య వేదిక మార్పు
ఇదిలా ఉండగా, చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహణపై వైజాగ్ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ నెల 8వ తేదీన వైజాగ్లో వాల్తేర్ వీరయ్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ క్రమంలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక కూడా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











