Varasudu Postpone: వారసుడు వాయిదా.. మేటర్ లీక్ చేసిన దిల్ రాజు.. చిరంజీవి, బాలయ్యపై కామెంట్
తెలుగు సినిమాలకు సంక్రాంతి సీజన్ ఎంతో ముఖ్యమైనది అన్న విషయం తెలిసిందే. ఈ సీజన్లోనే భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. అలా వచ్చిన సినిమాకు అదిరిపోయే స్పందన దక్కడంతో బాక్సాఫీస్ గళగళలాడుతూ ఉంటుంది. అందుకే సంక్రాంతికి తమ చిత్రాలను విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు పోటీ పడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సీజన్కు భారీ చిత్రాలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇళయదళపతి విజయ్ హీరోగా నటించిన 'వారసుడు' మూవీని వాయిదా వేస్తున్నట్లు దిల్ రాజు ప్రకటించారు. ఆ వివరాలు మీకోసం!

వారసుడుగా మారిన విజయ్
తమిళ స్టార్ విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రమే 'వారసుడు' (తమిళంలో వారిసు). వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా చేసింది. దీన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఇందులో శరత్కుమార్, ప్రభు, ప్రకాశ్ రాజ్, కుస్భూ, జయసుధ తదితరులు నటించారు. దీనికి థమన్ సంగీతాన్ని ఇచ్చాడు.

అలాంటి కథ.. అంచనాలు
అనుకోని కష్టాలను ఎదుర్కొంటోన్న ఓ కార్పోరేట్ దిగ్గజం తరపున వారసుడు ఎంట్రీ ఇచ్చి ప్రత్యర్థుల ఆగడాలను ఎలా ఆటకట్టించారు అన్న కథాంశంతో 'వారసుడు' మూవీ రూపొందింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన అన్ని ప్రచార చిత్రాలకు భారీ రెస్పాన్స్ వచ్చింది. అలాగే, పాటలూ అదరగొట్టేశాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో నెలకొన్నాయి.

రిలీజ్ డేట్పై వివాదాలతో
'వారసుడు' మూవీని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు నిర్మాత దిల్ రాజు ఎప్పుడో ప్రకటించారు. ఆ తర్వాత పలు చిత్రాలు కూడా పండగ రేసులో నిలిచాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల ఇష్యూ కారణంగా వివాదం చెలరేగింది. అలాగే, తమిళంలోనూ కొన్ని ఇబ్బందులు వచ్చాయి. దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్ మారుతుందని ప్రచారం జరుగుతోంది.

వారసుడు మూవీ వాయిదా
థియేటర్ల సమస్య కారణంగా తెలుగులో 'వారసుడు' మూవీ విడుదల వాయిదా పడుతోందన్న నేపథ్యంలో తాజాగా నిర్మాత దిల్ రాజు, శ్రీకాంత్తో కలిసి ప్రెస్మీట్ నిర్వహించారు. ఇందులో ఈ సినిమాను జనవరి 14వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తమిళంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 'వారిసు' మాత్రం జనవరి 11వ తేదీనే రాబోతుందని కూడా తెలిపారు.

వాళ్లు చెప్పారు.. తేడా లేదు
తర్వాత దిల్ రాజు మాట్లాడుతూ.. 'వారసుడు మూవీని వాయిదా వేయడానికి ముందు నేను చాలా మంది పెద్దలతో మాట్లాడాను. ఆ తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నా. వారిసు 11న వచ్చి.. వారసుడు 14న వస్తే నష్టం ఉంటుందని మీరు అనొచ్చు. కానీ, మంచి కంటెంట్తో వచ్చే సినిమా కచ్చితంగా ఆడుతుందని నమ్మకం. అందుకే దీన్ని సంక్రాంతి వారసుడిని చేశాం' అన్నారు.

నన్ను టార్గెట్ చేస్తున్నారు
అనంతరం దిల్ రాజు కొనసాగిస్తూ.. 'వారిసును 11నే విడుదల చేసినా.. వారసుడు మూవీని మాత్రం తెలుగులో వాయిదా వేయడానికి కారణం.. ఇండస్ట్రీలో థియేటర్ల ఇష్యూకు దిల్ రాజు కారణం అంటూ టార్గెట్ చేస్తున్నారు. రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు. వాటికి నేను ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉన్నాను. అయినా ఈ ప్రచారం మాత్రం ఆగడం లేదు' అని చెప్పుకొచ్చారు.

వాళ్లే సినిమాలే చూడాలి
దిల్ రాజు కంటిన్యూ చేస్తూ.. 'జనవరి 12న బాలకృష్ణ గారి సినిమా, 13న చిరంజీవి గారి సినిమా వస్తున్నాయి. కాబట్టి ప్రతి థియేటర్లలో ముందుగా వాళ్ల సినిమాలే పడాలి. మన ఇండస్ట్రీలో పెద్ద స్టార్లు కాబట్టి వాళ్లకు ప్రతి ఏరియాలోనూ థియేటర్లు ఎక్కువగా దొరకాలి. తర్వాతే నా సినిమా ఉండాలని అనుకున్నా. ఆ సినిమాలకు నా వారసుడు అసలు పోటీనే కాదు' అని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











