సినిమా పరిశ్రమకు గుడ్న్యూస్.. ఓటీటీ రిలీజ్పై దేశవ్యాప్తంగా ఆంక్షలు.. స్ట్రీమింగ్కు ఎన్నివారాలంటే?
కోవిడ్ పరిస్థితుల తర్వాత సినిమా చూసే తీరులో ప్రేక్షకుల అభిరుచుల్లో భారీగా మార్పులు సంభవించాయి. ఓటీటీలో సినిమాలను వీక్షించడానికి ప్రేక్షకులు మొగ్గు చూపుతుండటంతో సినిమా పరిశ్రమ, ముఖ్యంగా బాక్సాఫీస్ నంబర్లు దారుణంగా పడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసే విషయంపై ఆంక్షలు విధించేందుకు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఈ వివరాల్లోకి వెళితే..

ఓటీటీకి ఎనిమిది వారాల గడువు
కోవిడ్కు ముందు హిందీ, హాలీవుడ్ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఎనిమిది వారాల గడువు ఉండేది. అయితే ఆ విధానాన్ని కొనసాగించాలనే డిమాండ్ పెరగడంతో ఆగస్టు 1వ తేదీ తర్వాత రిలీజ్ అయ్యే సినిమాలకు ఎనిమిది వారాల గడువు విధించేందుకు సిద్ధమవుతున్నాం అని పీవీఆర్ మల్టీప్లెక్స్ సంస్థ ప్రతినిధి తెలిపారు. పీవీఆర్ మల్టీప్లెక్స్లోనే దాదాపు 75 వాతం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. తమిళ, తెలుగు డబ్బింగ్ సినిమాలకు ఎనిమిది వారాల గడువు విధించే విషయాన్ని పరిగణనలోకి తీసుకొంటున్నామని పేర్కొన్నారు.

కరోనా పరిస్థితుల్లో నాలుగు వారాల్లోనే
కరోనావైరస్ పరిస్థితుల కారణంగా సినిమాల థియేట్రికల్ రిలీజ్, ఓటీటీ స్ట్రీమింగ్ మధ్య గ్యాప్ తగ్గించారు. థియేట్రికల్ రిలీజ్ తర్వాత నాలుగు వారాల్లోనే సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఒకవేళ సినిమా థియేటర్లలో ఆడకపోతే ఇది బాగానే ఉంటుంది. థియేటర్లో ఆడుతున్నప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తుండటం వల్ల సినిమా కలెక్షన్లపై భారీగా దెబ్బ పడుతున్నది అని మిరాజ్ సినిమాస్ సీఈవో కమల్ గియాన్చందానీ అభిప్రాయపడ్డారు.

డిజిటిల్ రైట్స్ 100 శాతం
కరోనావైరస్ కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడటం నిర్మాతలకు తీరని నష్టాలను తెచ్చిపెట్టింది. దాంతో ఓటీటీలో రిలీజ్ చేసి మంచి రెవెన్యూను సంపాదించే మార్గాన్ని నిర్మాతలు ఎంచుకొంటున్నారు. దాంతో గత రెండు సంవత్సరాల్లో సినిమాల డిజిటిల్ రైట్స్ 100 శాతం మేరకు పెరిగాయి. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. థియేట్రికల్ రిలీజులు అవుతున్నాయి. ఇదే సమయంలో నాలుగు వారాల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కావడం ఎగ్జిబిటర్లు, డిస్టిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

టికెట్ల రేట్ల పెంపు వల్ల
కోవిడ్కు ముందు.. ఆ తర్వాత పరిస్థితి బేరిజు వేస్తే..టికెట్ ధరల పెంపు కారణంగా 20 శాతం మేరకు రెవెన్యూ పెరిగింది. 2019లో ఇండియన్ బాక్సాఫీస్ కలెక్షన్ల విలువ 5153 కోట్లుగా నమోదైంది. అయితే 2022 సంవత్సరంలోని ఆరు నెలల్లో ఈ కలెక్షన్ల విలువ 5565 కోట్లకు చేరడం సినిమా పరిశ్రమకు ఆశాజనకంగా మారింది. అయితే హిందీ సినిమాల కలెక్షన్లు దారుణంగా పడిపోవడం బాలీవుడ్ వర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నది.

ఓటీటీ సంస్థల అనూహ్య నిర్ణయం
ఇదిలా ఉండగా, ఒకవేళ ఓటీటీ రిలీజ్ గడువు 8 వారాలకు పెంచితే.. మా విధానాల్లో కూడా అనేక మార్పులు చేస్తాం. ఓటీటీ స్ట్రీమింగ్ కోసం చెల్లించే మొత్తాన్ని గణనీయంగా తగ్గించడానికి ప్రయత్నిస్తాం. ఎనిమిది వారాల తర్వాత అంటే.. సినిమాలపై ప్రేక్షకులకు అంత క్రేజ్ ఉండే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి డిజిటల్ రైట్స్ గతంలో కంటే భారీగా తగ్గించాలనే ఆలోచనలో ఉన్నాం అని తెలిపారు.

అమీర్, రణ్బీర్ సినిమాలు ఎనిమిది వారాల తర్వాతే
ఆగస్టు 1వ తేదీ తర్వాత రిలీజ్ అయ్యే బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలకు 8 వారాల గడువు విధిస్తున్నాం. అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా, అక్షయ్ కుమార్ నటించిన రక్షా బంధన్, రణ్బీర్ కపూర్ నటించిన బ్రహ్మస్త్ర చిత్రాలను 8 వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు చర్యలు తీసుకొంటాం అని డిస్ట్రిబ్యూషన్ సంస్థలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











