తాగుబోతుల్ని అసెంబ్లీకి రానిస్తారా... బాలకృష్ణపై వైఎస్ జగన్ షాకింగ్ కామెంట్స్
గత నెలలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మెగాస్టార్ చిరంజీవిలను ఉద్దేశించి సినీనటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. తమ సమస్యలు చెప్పుకునేందుకు నాడు తాడేపల్లి ప్యాలెస్ వద్దకు వచ్చిన సినీ ప్రముఖులను జగన్ అవమానించారంటూ వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో చిరంజీవి ఆ రోజు గట్టిగా అడిగారంటూ బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీలో బాలయ్య షాకింగ్ కామెంట్స్
ఆ సైకోగాడిని కలవడానికి నేను వెళ్లలేదని, చిరంజీవితో పాటు ఎవరూ జగన్ను గట్టిగా అడగలేదని బాలయ్య వ్యాఖ్యానించారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా ఓ సమావేశానికి సంబంధించి తన పేరును ఎక్కడో 9వ నెంబర్లో వేశారని బాలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి కందుల దుర్గేష్ని కూడా అడిగానని బాలకృష్ణ తెలిపారు. తమ అధినేతను అసెంబ్లీలో కించపరిచేలా మాట్లాడిన బాలయ్యపై వైసీపీ కేడర్ భగ్గుమంది. అయితే ఈ వివాదంలో చిరంజీవిపైనా నటసింహాం ఫైర్ అవ్వడం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్గా మారింది. ఆ కాసేపటికే బాలయ్య వ్యాఖ్యలను ఖండిస్తూ చిరంజీవి లేఖ విడుదల చేశారు.

బాలయ్య వ్యాఖ్యల్ని ఖండించిన చిరు
జగన్ తనతో పాటు ఏ సినీ ప్రముఖుడిని అవమానించలేదని, తమ సమస్యలను పరిష్కరించేలా ముఖ్యమంత్రిగా చొరవ చూపారని చిరంజీవి తెలిపారు. తాను చెప్పడం వల్లే ఆ ఏడాది సంక్రాంతికి విడుదలైనప వీరసింహారెడ్డి, వాల్తేర్ వీరయ్య సినిమాలకు టికెట్ రేట్లు పెరిగాయని చిరంజీవి గుర్తుచేశారు. దాంతో వైసీపీ కేడర్.. బాలయ్యను టార్గెట్ చేసింది. కూటమి ప్రభుత్వంలోనూ బాలయ్య వ్యాఖ్యలు కలకలం రేపాయి. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంపై మౌనం వహించారు.
చిరంజీవిని జగన్ అవమానించలేదన్న నారాయణ మూర్తి
ఈ క్రమంలో నాడు జగన్ వద్దకు వెళ్లిన సినీ ప్రముఖుల్లో ఒకరైన సీనియర్ నటుడు ఆర్ నారాయణ మూర్తి ఈ వ్యవహారంపై స్పందించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం సినీ ప్రముఖులను కానీ, చిరంజీవి గారిని కానీ అవమానించేలా ప్రవర్తించలేదన్నారు. మా సమస్యలు విన్న సీఎం.. వీటిపై తగిన చర్యలు చేపట్టాలని నాటి సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నానికి ఆదేశాలు జారీ చేశారని నారాయణ మూర్తి అన్నారు. చిరంజీవి గారు ఓ ఇండస్ట్రీ పెద్దగా నన్ను కూడా జగన్మోహన్ రెడ్డి వద్దకు తీసుకెళ్లేందుకు ఆహ్వానించారని ఆయన తెలిపారు. సినీ, రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారడంతో తన మాటలను రికార్డుల నుంచి తొలగించాలని కామినేని శ్రీనివాస్.. స్వయంగా స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. దాంతో ఈ వ్యవహారం సద్దుమణిగినట్లేనని భావించారు. తాజాగా వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు.
బాలకృష్ణ ఓ తాగుబోతు
విశాఖలో ఏర్పాటు కానున్న గూగుల్ డేటా సెంటర్, రాష్ట్ర రాజకీయాలపై గురువారం జగన్మోహన్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో చిరంజీవిపై బాలకృష్ణ వ్యాఖ్యలపై ఓ విలేకరి ప్రశ్నించడంతో జగన్మోహన్ రెడ్డి స్పందించారు. పనిపాటా లేని కన్వర్జేషన్ని బాలకృష్ణ అనే వ్యక్తి అసెంబ్లీకి తీసుకొచ్చాడు. అసలు ఆయన అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏందీ? ఆయన తాగి మాట్లాడింది ఏంటీ? అసలు తాగినోడిని అసెంబ్లీకి తీసుకొచ్చి.. మాట్లాడేందుకు అనుమతించారంటే స్పీకర్కు బుద్ధి లేనట్లు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన్ను ఆయనే క్వశ్చన్ చేసుకోవాలి అని వైఎస్ జగన్ అన్నారు. ప్రస్తుతం వైసీపీ అధినేత వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. మరి దీనిపై బాలయ్య, టీడీపీ శ్రేణులు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











