twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అరడజను గెంతులు, డజను పేలుళ్లు ఆజాద్‌

    By Staff
    |

    Azad
    నటీనటులు: నాగార్జున, సౌందర్య, శిల్పాశెట్టి, ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం..
    సంగీతం: మణిశర్మ
    నిర్మాత: అశ్వీనీదత్
    దర్శకత్వం: తిరుపతిస్వామి.

    ఆజాద్‌ సినిమా మీద వైజయంతీ మూవీస్‌ చాలా ఆశలు పెట్టుకుంది. మాస్‌ అప్పీల్‌ కోసం తాపత్రయపడిన తీరు ఆజాద్‌ సినిమా ప్రతి ఫ్రేమ్‌లోనూ కనబడుతుంది. కాశ్మీర్‌ తీవ్రవాదం మీద, పాకిస్థాన్‌ దానికి వూతం ఇస్తున్న వైనం మీద ఇంతకు ముందు రోజా, సర్ఫరోష్‌ సినిమాలు వచ్చాయి. కాశ్మీరీ తీవ్రవాదులపై పోరు సల్పడం, తద్వారా దేశభక్తిని ప్రదర్శించడం అనే ట్రెండ్‌ బహుశా రోజా సినిమాతోనే ప్రారంభమైంది. ఇదే ఇతివృత్తంతో కాస్తా భిన్నంగా తీయడానికి చేసిన ప్రయత్నమే ఆజాద్‌. మసాలాను జోడించి, దేశభక్తి సినిమాను తీయడానికి చేసిన యత్నంలో ఇది అరడజను పాటల, డజను బాంబు పేలుళ్ల సినిమాగా తయారైంది. కాకుంటే, రాష్ట్రంలో జరిగిన బాంబు పేలుడు సంఘటనలను దృష్టిలో పెట్టుకొని నాగార్జున ఇమేజ్‌కు విఘాతం కలుగకుండా కథను అల్లుకున్నారు.

    టూకీగా కథ ఇది- అంజలి (సౌందర్య) అనే జర్నలిస్టు, తన తండ్రి (నూతన్‌ప్రసాద్‌) బస్సులో ప్రయాణిస్తుంటారు. ఆ బస్సులో అందరూ పిల్లలే. ఈ బస్సును పాకిస్థానీ టెర్రరిస్టు దేవా (రఘువరన్‌) పేల్చి వేయిస్తాడు. ప్రమాదం నుంచి బయటపడిన ఒక వ్యక్తిని దేవా మనషులు ఖూనీ చేస్తున్న ఫొటోలు తీసిన అంజలి ఒక వార్త రాసి ప్రచురణ కోసం ఇస్తున్న సమయంలో దేవా తన అనుచరులతో వచ్చి అంజలిని అవమానించి ఎడిటర్‌ను బెదిరంచి వెళ్తాడు. దీంతో ఈ వార్త అచ్చు కాదు.

    దీంతో దేవా మనుషులను చంపడానికి 'ఆజాద్‌' అనే పేరును వాడుకుంటూ వుంటుంది. తెల్ల పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన అమరవీరుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ను స్ఫూర్తిగా తీసుకున్న అంజలి 'ఆజాద్‌' అంటే స్వేచ్ఛ కాబట్టి ఆ పేరు మీద దేవా మనుషుల అంతు చూస్తూ వుంటుంది. దీంతో ఎవరికీ కనిపించకుండా దుష్టశక్తుల అంతు చూస్తున్న ఆజాద్‌ అంటే హైదరాబాద్‌ ప్రజలకు ఎనలేని అభిమానం నిండిపోతుంది. ఇక్కడి నుంచి నాగార్జునతో కథంతా నడుస్తుంది. రాజమండ్రి నివాసి చంద్రశేఖర ఆజాద్‌ (నాగార్జున) చెల్లి పెళ్లి కోసం చిట్‌ డబ్బులు తీసుకోవడానికి హైదరాబాద్‌ వస్తాడు. చిల్లర దొంగతనాలు చేసే బ్రహ్మానందం ప్రతిసారీ దేవా మనుషులు బాంబులు పెట్టిన సూట్‌కేసులనే దొంగిలిస్తుంటాడు.

    హైదరాబాద్‌లో ఆజాద్‌ దిగగానే బ్రహ్మానందంతో పరిచయం అవుతుంది. దేవా మనుషులు బాంబులు పెట్టిన ప్రతిచోటా బ్రహ్మానందం, నాగార్జున ప్రత్యక్షమవుతుంటారు. వాటిల్లో బాంబులున్నాయనే విషయం అందరికీ తెలియదు. కానీ, వీరి వల్ల ఆ బాంబు పేలుళ్ల టార్గెట్లు మిస్సవుతూ వుంటాయి. అంజలి పరిచయం కూడా అవుతుంది. అంజలి కోరిక మేరకు ఆజాద్‌గా చెలామణి అవుతూ దేవా మనుషులను మట్టుబెడతుంటాడు నాగార్జున. తన చెల్లె ప్రాణాలు దేవా వల్లనే పోతాయి. దేవా (కొంత సినిమా నడిచాక తను దేవాను కానని పాకిస్థానీ ముస్లిం టెర్రరిస్టునని అతనే ప్రకటించుకుంటాడు) రైలును అపహరించి జైల్లో వున్న తమ అనుచరులను వదిలిపెట్టాలని డిమాండ్‌ చేస్తాడు.

    దేవాను బంధించి ప్రయాణికులను కాపాడ్డానికి సలీం అనే పోలీసు ఆఫీసరు దేవా చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. ఆజాద్‌ రంగంలోకి దిగి దేవా అంతు చూడడమే కాకుండా ప్రయాణికులను కాపాడుతాడు. ఈ సినిమాలో రాజమండ్రి ఆజాద్‌ మరదలు కనకమహాలక్ష్మి పాత్రను శిల్పాశెట్టి పోషించింది. ఈ పాత్ర లేకున్నా కథకు వచ్చే నష్టమేమీ లేదు. పైగా, కనక మహాలక్ష్మి పాత్రకు శిల్పాసెట్టి ఏ మాత్రం నప్పలేదు. తెలుగమ్మాయి కాదనే విషయం ఆ పాత్ర కనిపించిన ప్రతిసారీ కొట్టొచ్చినట్లు అర్థమవుతూనే వుంటుంది. అందాలను ఆరబోసి ప్రేక్షకుల మనస్సులను దోచేయాలనే ప్రయత్నంలో భాగంగానే శిల్పాశెట్టి పాత్రను సృష్టించినట్లు అనిపిస్తుంది.

    అట్లాగే పోలీసాఫీసరు సలీం పాత్ర. ఒక ముస్లిం చేత దేశభక్తి ప్రకటింపజేయడానికి మాత్రమే బలవంతంగా జొప్పించినట్లు అనిపిస్తుంది. 'సర్ఫరోష్‌'లో ఒక ముస్లిం పోలీసాఫీసరు పాత్ర ఎంతగా రక్తమాంసాలతో రూపు దిద్దుకుందో తెలిసి వుంటే సలీం (ప్రకాష్‌రాజ్‌) పాత్ర ఎంత నిర్జీవమైందో అర్థమవుతుంది. కథ మొత్తం కొన్ని సంఘటనలను ఎంపిక చేసి అతికించినట్లు వుంది.

    మాస్‌కు, క్లాస్‌కు మధ్య సంధి కుదర్చలేని అసహాయత వల్ల ఈ సినిమా ఎవరికీ కాకుండా పోయే ప్రమాదం లేకపోలేదు. మాస్‌ను ఆకట్టుకోవడానికి మూడు పాటలు, శిల్పాశెట్టి ఆరబోసిన అందాలు మాస్‌ను అకట్టుకోవచ్చు. నాగార్జున దేవా సమక్షంలో దేశభక్తిని చాటుకోవడానికి వల్లించిన కొన్ని డైలాగులకు కొంత రెస్పాన్స్‌ లభించవచ్చు. మొత్తం మీద, ఆశించిన విజయాన్ని 'ఆజాద్‌' అందివ్వకపోవచ్చు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X