Don't Miss!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
జై సింహా సినిమా రివ్యూ: పక్కా బాలయ్య మార్కు సినిమా!
నయనతారతో మూడోసారి జత కట్టిన బాలయ్య జనవరి 12న ప్రేక్షకుల ముందుకువచ్చాడు. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ రేంజ్లో ఆకట్టుకొన్నదో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
Recommended Video
తన నటజీవితంలో 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమాల వేగం పెంచాడు. 101 చిత్రం పైసా వసూల్ తర్వాత జై సింహా చిత్రం కోసం ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్తో బాలయ్య జతకట్టాడు. యాక్షన్, సెంటిమెంట్కు పెద్ద పీట వేసే ఈ చిత్రాన్ని సుమారు 70 రోజుల్లోనే పూర్తి చేశారు. నయనతారతో మూడోసారి జత కట్టిన బాలయ్య జనవరి 12న ప్రేక్షకుల ముందుకువచ్చాడు. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ రేంజ్లో ఆకట్టుకొన్నదో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
జై సింహా కథ ఇదే
నరసింహా (బాలకృష్ణ) వైజాగ్లో మెకానిక్. అన్యాయాన్ని, అక్రమాలను సహించడు. నరసింహా, గౌరీ (నయనతార) గాఢంగా ప్రేమించుకొంటారు. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకొంటాడు. పరిస్థితుల కారణంగా తాను ప్రాణంగా ప్రేమించిన గౌరీ మనసులో ప్రేమకు బదులు ద్వేషాన్ని పెంచాలనుకొంటాడు. అందుకోసం తన వద్ద పనిచేసే మంగ (హరిప్రియ)ను పెళ్లి చేసుకొని గౌరీకి షాకిస్తాడు. తనను మోసగించడాన్ని కారణంతో నరసింహాపై గౌరీ ద్వేషాన్ని పెంచుకొంటుంది. మంగ కవల పిల్లలకు జన్మనిచ్చి కన్నుమూస్తుంది. తన కవల పిల్లల్లో ఒకరిని గౌరీ వద్దకు చేర్చి తాను తమిళనాడులోని కుంభకోణానికి వెళ్లిపోతాడు.
కథకు ముగింపు ఇలా..
తాను ఇష్టంగా ప్రేమించిన గౌరీకి నరసింహా ఎందుకు దూరమయ్యాడు? గౌరీ మనసులో ప్రేమను తుంచి ద్వేషాన్ని ఎందుకు రగిలించాడు? మంగ ఎందుకు చనిపోయింది? కుంభకోణానికి వెళ్లిన నరసింహాం జీవితంలో ఎలాంటి సంఘటనలు చేటుచోసుకొన్నాయి? రౌడీలు (అశుతోష్ రాణా, బాహుబలి ప్రభాకర్)తో నరసింహాకు ఉన్న వైరం ఏమిటి? గౌరీ, నరసింహం మళ్లీ కలుసుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే జై సింహా చిత్రం
ఫస్టాఫ్ ఎలా ఉందంటే.
నయనతారకు దూరం కావాలన్న ఏకైక కారణంతో బాలకృష్ణ కుంభకోణం వెళ్లే సీన్తో సినిమా ప్రారంభమవుతుంది. కుంభకోణంలో ఎన్నో అవమానాలు దిగమింగుతూ.. ఎవరెన్నీ దాడులు చేసినా సాధువులా జీవితాన్ని గడుపుతుంటాడు. తన మనసులో ఉండే బాధను దిగమింగుకుంటూ తన కుమారుడి కోసం జీవితం సాగిస్తుంటాడు. ఓ అనూహ్యమైన సంఘటన వల్ల బాలకృష్ణ ఫ్లాష్బ్యాక్ గురించి చెప్పే సీన్తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది.
సెకండాఫ్ ఎలా ఉందంటే..
రెండో భాగంలో నయనతార, బాలకృష్ణ ప్రేమ ఎపిసోడ్స్, మెకానిక్ షాపులో హరిప్రియతో అల్లరి ఎపిసోడ్స్తో కథ రొటీన్గా సాగిపోతుంది. ఇక నయనతారకు షాకిచ్చి హరిప్రియను పెళ్లి చేసుకోవడం, రౌడీలు అశుతోష్ రాణా, బాహుబలి ప్రభాకర్ను హతమార్చడం, ఆ తర్వాత ఓ సెంటిమెంట్ సీన్తో సినిమా ముతకగా ముగుస్తుంది.
కథ, స్క్రీన్ ప్లే విశ్లేషణ
ప్రేమ, పగ, ప్రతీకారం లాంటి అంశాలతో 80వ దశకం నాటి కథకు ఏమాత్రం తీసిపోని స్టోరీయే జై సింహా. 30 ఏళ్ల క్రితం కూడా చాలా పక్కాగా, మంచి స్క్రీన్ ప్లేతో ఇలాంటి సినిమాలు చక్కగా తెరకెక్కించిన దాఖలాలు ఎన్నో కనిపిస్తాయి. జనరేషన్లు మారిన మూలకున్న కథను వెతికి, తవ్వి తెచ్చిపెట్టి మళ్లీ కొత్తగా గొడకు సున్నం వేసిన విధంగా జై సింహాను రూపొందించారు. చివరకు సినిమాను మొత్తం చూస్తే పది సినిమాల్లోని సీన్లు, ఎపిసోడ్స్ కలిపి అతుకుల బొందగా జై సింహాను తీర్చి దిద్దారు.
దర్శకుడు కేఎస్ రవికుమార్కు ప్రతిభ
రజనీకాంత్తో నరసింహా లాంటి బ్లాక్ బస్టర్ అందించిన ఘనత కేఎస్ రవికుమార్కు ఉంది. అలాంటి ధైర్యంతోనే జై సింహాను రూపొందించారా అనే భావనకు ఎలాంటి అనుమానాలు లేకుండా దర్శకుడు అరిగిపోయిన కథను ప్రేక్షకులపై రుద్దేందుకు ప్రయత్నించాడని చెప్పవచ్చు. పాత కథలకు కొత్తగా రంగేసి అందంగా చెప్పిన చిత్రాలను ఈ మధ్యలో చూశాం. అలాంటి ప్రయత్నం చేసినట్టు ఏ సన్నివేశంలోనూ కనిపించదు. కథ, స్క్రీన్ ప్లే, కామెడీ అన్ని విషయాల్లోనూ కేఎస్ రవికుమార్ దారుణంగా విఫలమయ్యాడని చెప్పవచ్చు.
బాలకృష్ణ గురించి
నరసింహానాయుడు, సమరసింహారెడ్డి, సింహా లాంటి గొప్ప చిత్రాల్లో నటించిన బాలకృష్ణకు జై సింహా లాంటి సినిమా ఎడమచేత్తో ఆడుకునేది కనిపిస్తుంది. కానీ ఏ మాత్రం సరిపోని భగ్న ప్రేమికుడి కథను బాలకృష్ణపై రుద్దడం సామాన్య ప్రేక్షకుడికి మింగుడు పడని విషయం. భగ్న ప్రేమికుడిగా, అన్యాయాన్ని సంహించని ఓ వ్యక్తిగా, ఎదుటి మనిషి సంతోషం కోసం ఎంతకైనా తెగించే పాత్రలో బాలకృష్ణ ఒదిగిపోయాడు. కథలో విషయం లేకపోవడం, పాత్రలో దమ్ము లేకపోవడంతో బాలకృష్ణ ఓ పరిధిలోనే ఇరుక్కుపోయాడనిపిస్తుంది. తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించాడు.
నయనతార గురించి
ఇప్పుడు ఒంటిచేత్తో సినిమా భారాన్ని మోస్తున్న నయనతారకు ఈ సినిమాలో ఆ స్థాయి పాత్ర దక్కలేదు. అతిథి పాత్రకు కొంచెం ఎక్కువగా అనిపించే పాత్రలో నటించారు. గౌరీ పాత్రలో కనిపించిన నయనతార గురించి పెద్దగా చెప్పుకొనే అవకాశమే లేకపోయింది. తమిళంలో సోలో హీరోయిన్గా రాణిస్తున్న నయనతారకు జై సింహా పెద్దగా పేరు తెచ్చే అవకాశం లేదనే చెప్పవచ్చు.
హీరోయిన్ల గురించి
ఇక నటషా దోషి తనకు లభించిన నాలుగైదు సీన్లలో అందాల ఆరబోసింది. హరిప్రియ క్యారెక్టర్లో ఇంటెన్సిటీ ఉన్నప్పటికీ ఆ పాత్రకు కామెడీ ముద్ర వేసి తప్పుదారి పట్టించారు. నటషా, హరిప్రియలిద్దరూ ఆటపాటలకే పరిమితయ్యారు.
మిగితా నటీనటులు
కేంద్ర మంత్రిగా జయప్రకాశ్రెడ్డి, కుంభకోణంలో ఊరికి పెద్దగా మురళీ మోహన్, ఇంట్లో పని మనుషులుగా బ్రహ్మనందం, భద్ర పాత్రలు కనిపిస్తాయి. జయప్రకాశ్రెడ్డి పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రలో కనిపించాడని చెప్పవచ్చు. బ్రహానందానికి భార్యగా ప్రియ నటించింది. వీరిద్దరి ఎపిసోడ్ చంద్రముఖి చిత్రంలోని కాపీగా కనిపిస్తుంది. అశుతోష్ రాణా అప్పుడప్పుడు వచ్చిపోయే విలన్గా కనిపించాడు.
చిరంతన్ భట్ మ్యూజిక్
చిరంతన్ భట్ రీరికార్డింగ్ చాలా బాగున్నది. ఇక పాటల్లో అమ్మకుట్టి, ప్రియం జగమే కొంత వినసొంపుగా ఉన్నాయి. కానీ తెరమీద అంతగా ఆకట్టుకునే విధంగా ఉండవు. కీలక సన్నివేశాల్లో చిరంతన్ భట్ సంగీతం ఆకట్టుకునేలా ఉంది. ప్రీ క్లైమాక్స్కు ముందు కొన్ని సీన్లకు చిరంతన్ తన సంగీతంతో జీవం పోశాడా అనే భావన కలుగుతుంది.
రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ
రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపించే స్థాయిలో ఉంది. ఎందుకంటే కథలో కొన్నిపరిమితులు ఆయన ప్రతిభకు అడ్డుగా నిలిచినట్టు అనిపిస్తాయి. తన పరిధి మేరకు సినిమాను అందంగా చూపించేందుకు ప్రయత్నించాడు. ముఖ్యంగా సెకండాఫ్లో నయనతార, బాలకృష్ణ ఎపిసోడ్స్ తెర మీద ఆకట్టుకునేలా ఉంటాయి.
మెప్పించలేకపోయిన రత్నం
గత బాలయ్య చిత్రాల్లో రత్నం మాటలు తూటాల్లా పేలాయి. జై సింహా చిత్రంలో అప్పుడప్పుడు తప్పా బాలయ్య డైలాగ్స్లో పసే కనిపించలేదు. ట్రైలర్లో కనిపించే నాలుగైదు డైలాగ్స్ తప్పా గొప్పగా చెప్పుకొనే మాటలే వినిపించవు.
సీ కల్యాణ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్
సీకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సీ కల్యాణ్ భారీ స్థాయిలోనే జై సింహకు ఖర్చు పెట్టారు. భారీ సంఖ్యలో నటీనటులకు సినిమాలో స్థానం కల్పించారు. యాక్షన్ సీన్లలో ఖర్చుకు వెనుకాడలేదు. కథపై కొంత దృష్టిపెట్టి కసరత్తు చేసి ఉంటే మరింత మెరుగైన ఫలితాలు వచ్చి ఉండేవి.
ఫైనల్గా
బాలకృష్ణ ఇమేజ్ ఏ మాత్రం తగ్గని కథ జై సింహా. కానీ కథ, కథనం, సన్నివేశాల రూపకల్పనలో దారుణంగా విఫలయ్యారనే వాదన వినిపిస్తున్నది. 80వ దశకంలో ఇంత నాసిరకంగా సినిమా తీసి ఉండరనే మాటలు వినిపించాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలయ్య చేయాల్సిన సినిమా కాదనే మరో మాట వినిపిస్తున్నది. సంక్రాంతి రేసులో ఫ్యాన్స్ కొంత సంతోషం కలిగినా.. సగటు ప్రేక్షకుడికి మాత్రం కొంత నిరాశే అని చెప్పవచ్చు.
బలం, బలహీనతలు
ప్లస్ పాయింట్స్
బాలకృష్ణ, నయనతార
నటాషా గ్లామర్
చిరంతన్ భట్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్
కేఎస్ రవికుమార్ డైరెక్షన్
కథ, కథనం
కామెడీ
తెర ముందు, తెర వెనుక
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, నయనతార, నటాషా దోషి, హరిప్రియ, ప్రకాశ్ రాజ్, అశుతోష్ రాణా, బ్రహ్మనందం, మురళీమోహన్, జయప్రకాశ్రెడ్డి, ప్రభాకర్, శివ పార్వతి
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కేఎస్ రవికుమార్
నిర్మాత: సీ కల్యాణ్
స్టోరీ, డైలాగ్స్: ఎం రత్నం
సంగీతం: చిరంతన్ భట్
సినిమాటోగ్రఫీ: సీ రాంప్రసాద్
రిలీజ్ డేట్: 2018 జనవరి 12