Don't Miss!
- Sports CSK vs LSG: కొంపముంచిన ముస్తాఫిజుర్.. లక్నోను గెలిపించిన స్టోయినిస్!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
Panchatantra Kathalu review గుండెను పిండేసే భావోద్వేగం, ఫీల్గుడ్గా పంచతంత్ర కథలు
Rating: 3/5
ఓటీటీ ఫ్లాట్ఫామ్స్కు విశేష ఆదరణ పొందుతున్న నేపథ్యంలో సృజనాత్మకత, భావోద్వేగం, ప్రస్తుత జనరేషన్ అభిరుచికి తగినట్టగా ఉండే సినిమాలే కాకుండా.. వెబ్ సిరీస్, వెబ్ మూవీస్ ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి. ఇటీవల వెబ్ సిరీస్గా వచ్చిన ఎన్నో తెలుగు కథలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ సిరీస్ పంచతంత్ర కథలు. ఐదు కథల సంపుటిగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచిందంటే..
అడ్డ కత్తెర కథ, విశ్లేషణ
పంచతంత్ర కథలు అంథాలజీలో మొదటి ఎపిసోడ్గా అడ్డ కత్తెర. కుల వైషమ్యాల కథా నేపథ్యంతో ఈ కథను తెరకెక్కించారు. కథ విషయానికి వస్తే.. క్షవరం పనిచేసే నాయీ బ్రాహ్మణుడు కృష్ణ (నిహాల్) తాను ఉంటున్న ప్రాంతంలోనే ఉండే సత్య (సాదియ అన్వర్)తో ప్రేమలో పడుతాడు. కులం వారి ప్రేమకు అడ్డుగా నిలుస్తుంది. అయితే పెద్దల నుంచి ఎదురైన సమస్యలు, ఆటంకాలను ఎలా ఎదురించారు? పెద్దల మనసులను ఎలా గెలుచుకొన్నారు. వారి ప్రేమకు శుభం కార్డు ఎలా పడిందనే ప్రశ్నకు సమాధానం అడ్డ కత్తెర కథ.
కృష్ణగా నిహాల్, సత్యగా సదియ అన్వర్ చక్కగా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. నిహాల్ హుషారుగా నటిస్తే.. సదియ అన్వర్ భావోద్వేగంతో ఆకట్టుకొన్నది. రామ్ మిరియాల పాడిన నేనేమో మోతెవరి ఈ ఎపిసోడ్కు హైలెట్ మాత్రమే కాకుండా అనుభూతిని కలిగిస్తుంది. అజార్ షేక్ కథ, సంభాషణలు స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచాయి. సమాజంలో కుల జాడ్యం ఎలా ఎంత లోతుగా పాతుకుపోయిందనే విషయాన్ని చాలా సున్నితంగా, సుతిమెత్తగా తెర మీద అజార్ షేక్ ఆవిష్కరించాడు. దర్శకత్వం, సినిమాటోగ్రఫి బాధ్యతలను గంగనమోనీ శేఖర్ ఎమోషనల్, ఫీల్గుడ్ అంశాలను దట్టించి చక్కగా తెర మీద ఆవిష్కరించారు. విజయ్ భాస్కర్ సద్దాల కెమెరామెన్గా సహకారం అందించారు.
అహల్య కథ, విశ్లేషణ
పంచతంత్ర కథల్లో అత్యంత భావోద్వేగంగా, గుండెను పిండేసే కథతో తెరకెక్కిన ఎపిసోడ్ అహల్య. నిరుపేద మహిళ రేవతి (ప్రణీత పట్నాయక్) ఓ గ్రామంలో తన కుమారుడితో నివసిస్తుంటుంది. జీవితాన్ని ముందుకు లాగేందుకు వేశ్యవృత్తిని నమ్ముకుంటుంది. అలా జీవితం కొనసాగుతున్న సమయంలో పెయింటర్, ట్రావెలర్ అయోధ్య (బిగ్బాస్ ఓటీటీ ఫేమ్ అజయ్) పరిచయం అవుతాడు. వేశ్య రేవతి, పెయింటర్ అయోధ్య మధ్య ఎలాంటి రిలేషన్ కొనసాగింది. వేశ్య జీవితంలో కొడుకు పాత్ర ఏమిటి? చివరకు రేవతి జీవితానికి ఎలాంటి పరిష్కారం లభించింది అనేది అహల్య కథకు ముగింపు.
రేవతిగా ప్రణీత పట్నాయక్ అద్భుతంగా నటించింది. అభినయం, హావభావాలు, సహజ నటనను తెర మీద రేవతి పాత్రను ఎస్టాబ్లిష్ చేయడంలో ప్రణీత పట్నాయక్ అసమాన ప్రతిభను చాటింది. పంచతంత్ర కథలు చిత్రంలో తన నటనతో మనసును వెంటాడుతుంది. రేవతి పాత్రను తీర్చిదిద్దిన తీరు శేఖర్ దర్శక ప్రతిభకు అద్దం పట్టింది. ఈ కథలోని పాత్రలకు డైలాగ్స్ రాసిన అజార్ షేక్ తన మరోసారి ఆకట్టుకొన్నాడు. సున్నితమైన సంభాషణలు భావోద్వేగానికి గురిచేస్తాయి.
హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కథ, విశ్లేషణ
పంచతంత్ర కథల్లో మూడో కథ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. పేదరికం నింపిన చేదు అనుభవాల కారణంగా కీర్తిక (నందినిరాయ్) తనను ప్రాణంగా ప్రేమించిన ప్రియుడు ప్రశాంత్ (నోయల్ సీన్)ను వదిలేసి సంపన్నుడైన వ్యక్తి (ఆర్జే హేమంత్)ను వివాహం చేసుకొంటుంది. అయితే ప్రేమించిన వాడిని కాదని.. డబ్బున్న వ్యక్తిని భర్తగా చేసుకొన్న తర్వాత ఎదురైన అనుభవాలు, జీవితంలో సరిద్దిద్దుకోలేని తప్పు కారణంగా ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నది. తన జీవితంలో చేసిన తప్పును సరిద్దిద్దుకొన్నదా? అనే ప్రశ్నలకు సమాధానం హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కథ.
డబ్బు, విలాసవంతమైన జీవితం కోసం పాకులాడే కీర్తికగా నందినీరాయ్, భగ్న ప్రేమికుడిగా నోయల్ సీన్, వెకిలితనం, ఒకరకమైన పిచ్చితో బిహేవ్ చేసే భర్తగా ఆర్జే హేమంత్ నటించారు. నందినీరాయ్ పలు రకాల వేరియేషన్ ఉన్న కీర్తిక పాత్రలో ఒదిగిపోయింది. ప్రశాంత్గా నోయల్ సీన్ ఎమోషనల్గా మెచ్యురిటీతో కూడిన పెర్ఫార్మెన్స్ను చూపించాడు. విజయ్ భాస్కర్ సద్దాలతో కలిసి దర్శకుడు శేఖర్ అందించిన సినిమాటోగ్రఫి ఆకట్టుకొన్నది. సమకాలీన సమాజంలో యువత పోకడలు, వైవాహిక జీవిత విధానాన్ని కళ్లకు కట్టినట్టు శేఖర్ చూపించాడు.
నర్తనశాల కథ, విశ్లేషణ
పంచతంత్ర కథల్లో నాలుగో కథ నర్తనశాల. రూపం ఏమిటో తెలియకుండా మొబైల్లో శిరీష (శశికళ) అనే అమ్మాయితో డ్యాన్స్ మాస్టర్ (సాయి రోనక్) ప్రేమలో పడుతాడు. మొబైల్లో కొంతకాలం ప్రేమ ప్రయాణం సాగుతుంది. అయితే దూరంగా ఉంటూనే విడదీయలేనంత ప్రేమ వారి మధ్య పెరుగుతుంది. అయితే చివరకు ఓ బీచ్లో కలుసుకోవాలనుకొంటారు. తొలి కలయిక వారి ప్రేమకు, జీవితానికి ఎలాంటి దిశానిర్దేశం చేసిందనే ఆసక్తికరమైన పాయింటే నర్తనశాల.
సమాజంలో రకరకాల ప్రేమలు కనిపిస్తుంటాయి. అయితే నర్తనశాలలో తెరకెక్కిన ప్రేమకథ విభిన్నమైనది. శేఖర్ ఎంచుకొన్న స్క్రీన్ ప్లే కథను వెరైటీగా, ఫీల్గుడ్ మార్చేస్తుంది. చివర్లలో వచ్చే ట్విస్టు కాస్త థ్రిల్లింగ్గా మార్చేస్తుంది. సాయి రోనక్, శశికళ, మరో నటుడు అద్భుతంగా నటించడమే కాకుండా తమ పాత్రలకు నూటికి నూరుశాతం న్యాయం చేశారు. అజార్ షేక్ రాసిన డైలాగ్స్ హృదయాన్ని టచ్ చేస్తాయి.
----------------------------
అనగనగా కథ, విశ్లేషణ
పంచతంత్ర కథలు వెబ్ సిరీస్లో నాలుగు కథ అనగనగా.. భర్త మరణంతో ఒంటరిగా మారిన కమలక్కకు ఇద్దరు కుమారులు. క్యాలెండర్లో నెలల్ని పంచుకొని తల్లిని పోషిస్తుంటారు. తన భర్తతో కలిసి కమలక్క జీవించిన విధానం ఆమెను వెంటాడుతుంటుంది. గ్రామంలో పరిపూర్ణమైన జీవితాన్ని ఆస్వాదించిన కమలక్క కాంక్రీట్ జంగిల్లో ఎలాంటి అనుభవాలను చవిచూసింది. తన మనవడితో ఆమె ప్రయాణం ఎలా సాగిందనే కోణంలో గుండెను పిండేసే కథ అనగనగా..
ఫిదా సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన గీతా భాస్కర్ మరోసారి కమలక్క పాత్రతో ఆకట్టుకొన్నారు. వృద్దాప్యంలో ఎదురయ్యే ఒంటరితనం, చేదు అనుభావాల ఆధారంగా డిజైన్ చేసిన పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. జోర్దార్ సుజాత, తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ప్రస్తుతం కాలంలో మానవ సంబంధాలు, యాంత్రిక జీవితం లాంటి అంశాలను దర్శకుడు శేఖర్ అద్భుతంగా తెరకెక్కించాడు. ఇలాంటి కథతో చాలా సినిమాలు వచ్చినప్పటికీ.. విభిన్నంగా తెరెక్కించి తన మార్కును వదిలేశాడు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, ఆర్ట్స్ విభాగాలు పనితీరు ఈ ఎపిసోడ్కు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్. టైమ్ ట్రావెల్ను గ్రాఫిక్స్ రూపంలో చక్కగా చూపించారు.
ఫైనల్గా ఎలా ఉందంటే?
పంచతంత్ర కథలు అంథాలజీ గురించి ఫైనల్గా చెప్పాలంటే.. మానవ సంబంధాలు, జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భావోద్వేగం, ఫీల్గుడ్ అంశాలను జోడించి తెరక్కించిన అద్బుతమైన వెండితర కథా సంకలనం. నిర్మాతగా మారిన వ్యాపారవేత్త డీ మధు తన సన్నిహితుల కోసం, యువ టాలెంట్ను ప్రోత్సాహించేందుకు పంచతంత్ర కథలు తెరకెక్కించినప్పటికీ.. అతడికి సినిమాపై ఉన్న అభిరుచి తెలియజెప్పింది. సయ్యద్ కమ్రాన్ అందించిన సంగీతం చాలా బాగుంది. వివిధ ఫ్లేవర్స్తో ఉండే కథకు పలు రకాల వేరియేషన్స్తో ఉన్న మ్యాజిక్ను అందించడంలో సయ్యద్ సక్సెస్ అయ్యాడు. విజయ్ భాస్కర్ సినిమాటోగ్రాఫర్గా, ఎడిటర్గా వరగంటి శ్రీనివాస్ తమ బాధ్యతలను చక్కగా నిర్వర్తించారు. అన్ని విభాగాలను సమన్వయం చేయడంతోపాటు దర్శకత్వం బాధ్యతలను చక్కగా శేఖర్ నిర్వహించాడు.అజార్ షేక్ కొత్తవాడైనప్పటికీ.. ఎంతో అనుభవం ఉన్న రచయితగా డైలాగ్స్ అందించారు. గుండె తలుపును తట్టిలా భావోద్వేగాన్ని నింపడంలో అజర్ సఫలమయ్యాడు. నటీనటుల ఫెర్ఫార్మెన్స్, అద్భుతమైన సాంకేతిక విలువలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. భావోద్వేగతంతో సాగే ఈ కథలు.. మీ జీవితంలోని చాలా సంఘటనలు, అనుభూతులు ఎక్కడో ఒకచోట ఈ సినిమాలో ఎదురుపడుతాయి. గుండెను పిండేసేలా చేయడమే కాకుండా మీ ఇంటి వరకు వెంటాడుతాయి. చక్కటి ఉన్నత విలువలు ఉన్న పంచతంత్ర కథలను మిస్ చేసుకోకండి.
నటీనటులు, సాంకేతిక నిపుణులు
నటీనటులు: నోయల్ సీన్, నందినీ రాయ్, సాయి రోనక్, ప్రణీత పట్నాయక్, నిహాల్ కోదాటి, సదియా, అజయ్ కథుర్వార్, గీతా భాస్కర్, జోర్దార్ సుజాత, శశికళ తదితరులు
రచన, దర్శకత్వం: గంగనమోని శేఖర్
మ్యూజిక్: సయ్యద్ కమ్రాన్
బ్యానర్: మధు క్రియేషన్స్
నిర్మాత: డీ మధు
సహ నిర్మాత: డీ రవిందర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పాలకూరి సాయికుమార్
డైలాగ్స్, లైన్ ప్రొడ్యూసర్: అజార్ షేక్
కో డైరెక్టర్: రమేశ్ నాయుడు డీ
సౌండ్ డిజైనర్: నాగార్జున తల్లపల్లి
పీఆర్వో: శ్రీను దుద్ది, సిద్దూ