వామ్మో... తినేస్తోంది ('టైగర్' రివ్యూ)
తెలుగు సినిమాలు ప్రస్తుత పరిస్దితి ఎలా తయారైందంటే.. ...కమర్షియల్ పేరు చెప్పి...ఎన్నో సార్లు నలిగిపోయిన పరమ రొటీన్ కథని తెరకెక్కించటం లేదా...విభిన్నత పేరు చెప్పి...మరీ నేల విడిచి సాము చేసే కథలు మన ముందు పెట్టడం జరుగుతోంది. దాంతో... రొటీన్ కథలను భరించలేక తిట్టుకోవాలో.. లేక విభిన్నత అంటూ ప్యాసివ్ పాత్రలను, బోరింగ్ కథలను మన ముందు ఆవిష్కరిస్తున్నారని ఆందోళన పడాలో అర్దం కాని పరిస్ధితి నెలకొంది. మినిమం ఓపినింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయిన ఈ 'టైగర్' చిత్రం విజువల్స్ పరంగా, దర్శకత్వ పరంగానూ మంచి మార్కులే వేయించుకుంది.
అయితే...కథ,కథనం పరమ ప్రెడిక్టుబుల్ గా ఉండటం , ఎంటర్టైన్మెంట్ పాళ్లు చాలా చాలా తక్కువగా ఉండటం జరిగింది. అలాగే సందీప్ కిషన్ సైతం తన పైన పాటలు పెట్టాలి, హీరోయిన్ పెట్టాలి అని పట్టుపట్టకుండా చేయటం కూడా గొప్ప విషయమే. ఈ తరం యంగ్ హీరోల్లో ఇలాంటి యాటిట్యూడ్ ఉండటం అరుదైన సంగతే. ఇందుకు అతన్ని అభినందించాలి. పరువు హత్యలు చుట్టూ సాగిన ఈ చిత్రం ఎంతవరకూ సందీప్ కిషన్ పరువు నిలబెడుతుందో చూడాలి.
విష్ణు (రాహుల్ రవీంద్ర), జై అలియాస్ టైగర్(సందీప్ కిషన్) ఇద్దరూ అనాధలు..అలాగే బెస్ట్ ఫ్రెండ్స్. టైగర్ కు ఆర్య-2 లో అల్లు అర్జున్ కి నవదీప్ మీద స్నేహతో కూడిన ప్రేమ ఉన్నట్లు..విపరీతమైన ప్రేమ. కానీ విష్ణు మాత్రం...అందులో నవదీప్ లాగే...టైగర్ ని..ఓ తలనొప్పిలా ఫీలవుతూంటాడు. ఇలా ఇద్దరూ ఎవరి అభిప్రాయాలతో పెరిగి పెద్దైన తర్వాత...విష్ణు...ఓ సుముహుర్తాన గంగ (సీరత్ కపూర్) తో ప్రేమలో పడతాడు. ఆమె కాశీ కి సంభందించిన అమ్మాయి.
అక్కడ కులం కట్టుబాట్లు ఎక్కువగా ఉంటాయి. తమ కులం అమ్మాయి ...వేరే వారితో ప్రేమలో పడితే పరువు హత్యలు చేసేస్తూంటారు. అందులో భాగంగా.....విష్ణు నికూడా చంపేయటానికి ఎటాక్ చేస్తారు. ఆ విషయం తెలుసుకున్న టైగర్...తన ఫ్రెండ్ తనని తలనొప్పిగా భావించినా సరే...తనకు ఆప్తమిత్రుడు, ప్రాణం కాబట్టి అతన్ని సేవ్ చేయటానికి కాశీ వస్తాడు. అక్కడ పరువు హత్యలను ఎలా ఎదిరిస్తాడు.. వాళ్లిద్దరినీ ఎలా కలుపుతాడు అనేది మిగతా కథ.
పరువు హత్యలమీద సినిమాలు మనకు తక్కువే. ఆ మధ్యన అల్లు శిరీష్ హీరోగా 'గౌరవం' వచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు ఇదిగో ఈ టైగర్ రంగంలోకి దిగింది. అయితే ఉత్తరప్రదేశ్ లో జరిగే పరువు హత్యలను మన తెలుగు కుర్రాడు వెళ్లి ఆపే లైన్ వినటానికి బాగానే ఉంటుంది. కానీ అదే సింగిల్ పాయింట్ ఎజెండా గా సినిమాకు సరపడ కథ వస్తుందా లేదా అని దర్శకుడు చూసుకోవాల్సింది. దానికి తోడు ఈ చిత్రం సందీప్ కిషన్ హీరో అని ఫిక్సై వెళతాం...అయితే రాహుల్ రవీంద్ర లవ్ స్టోరీ తో ఫస్టాఫ్ ని రన్ చేసి మనని డైలమోలో పడేస్తాడు. అతని ప్రేమకథకు సహాయపడే పాత్ర...సందీప్ కిషన్ ది అని అర్దమవుతుంది. సెకండాఫ్ మొత్తం సందీప్ కిషన్..వంటిచేత్తో..కాశీలోని విలన్స్ తో పోరాడుతూంటాడు. అయితే అతనికి ఎక్కడా బలమైన ప్రత్యర్దులు తగలరు. దాంతో సందీప్ కిషన్ పాత్ర చాలా పాసివ్ గా నడుస్తుంది. ఎప్పుడైనా, ఎక్కడైనా పాసివ్ పాత్రలు పరమ బోర్ కదా.
అప్పుడెప్పుడో 'సింధూరపు పువ్వు' అనే చిత్రం వచ్చి తెలుగులోనూ పెద్ద హిట్టైంది. అందులో విజయ్ కాంత్ ...ఓ ప్రేమ జంటను కలపటానికి చేసే ప్రయత్నాలతో కథ,కథనం నడుస్తుంది. అలాంటి కథలు తర్వాత కాలంలో చాలా తక్కువే వచ్చాయి. ఓ ప్రేమ జంట..వారి ప్రేమ ని నిలబెట్టడానికి ప్రాణం పెట్టే హీరో...అంటే కష్టమని దర్శకులు,రచయితలు మానేసారు. హీరోలు ఎంతసేపూ తమ ప్రేమ కథలనే తెరపైకి ఆవిష్కరించటానికి ఇష్టపడటం జరుగుతూ వస్తోంది. దానికి తోడూ ప్రేక్షకులు కూడా హీరో కాకుండా వేరే వాళ్ల లవ్ స్టోరీ ని చూసి...దాన్ని హీరో వచ్చి సక్సెస్ చేయాలని ఎదురుచూడటం లేదు. ప్రేమించినా, పోరాడినా హీరోనే చేయాలనే కాన్సెప్టుతో ఉంటున్నారు.

దాంతోనే ఇబ్బంది
దర్శకుడు ఈ చిత్రం కోసం ఎన్నుకున్న కథ చాలా థిన్ గా ఉండటమే ఇబ్బది పెట్టింది. దాంతో ట్రీట్ మెంట్ చేయటం చాలా కష్టంగా మారి..ప్రెడిక్టుబుల్ కథనంతో సాగింది. అలాగే ధ్రిల్లర్ అంటూ పబ్లిసిటీ చేసిన ఈ చిత్రంలో అంత థ్రిల్ కలిగించే విషయాలు ఏమీ ఉండవు.

డైలాగులు బాగున్నాయి
"ఇప్పటిదాకా కులం కోసం చంపి చూసావు ...ఇప్పుడు మనిషి లాగ బ్రతికి చూడు", వంటి అబ్బూరి రవి రాసిన డైలాగులు బాగున్నాయి

వృధా
హీరోయిన్ గా ఈ చిత్రంలో సీరత్ కపూర్ చేసింది. కానీ ఆమె హీరోయిన్ లాగ కనపడదు. సహాయ పాత్రలాగ ఉంటుంది. దాంతో కథలో రొమాంటిక్ ఏంగిల్ మిస్సైంది.

హైలెట్స్
ఈ చిత్రంలో హైలెట్స్ లో కెమెరా వర్క్ ని మొదటి స్ధానంలో చెప్పుకోవచ్చు. ఛోటా కె నాయుడు...ఓ పెద్ద సినిమాగా ఈ సినిమాను చూపించారు. చాలా రిచ్ గా ఉన్నాయి ఫ్రేమ్ లు.

మరో హైలెట్
థమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. కథలో.. సందీప్ కిషన్ పాత్రలోని హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సన్నివేశాల్లో థమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. పాటులు ఓకే అనిపిస్తాయి.

రకుల్ ప్రీతి సింగ్
ఈ సినిమాలో రకుల్ ప్రీతి సింగ్ ..క్లైమాక్స్ లో కనపించి అలా మాయమవుతుంది. ఆమె వచ్చినప్పుడు మాత్రం థియోటర్లో విజిల్స్ పడ్డాయి.

సందీప్ కిషన్ షో
సినిమా ప్రారంభమైన అరగంటవరకూ సందీప్ కిషన్ కనపడదు. అసలు అలా రాను అని తెలిసినా ఒప్పుకున్నందుతు సగటు తెలుగు హీరో కు ఉండే రూల్స్ అతిక్రమించినందుకు అతన్ని అభినందిచాలి.

ఎవరెవరు
బ్యానర్ :ఎన్వీఆర్
నటీనటులు :సందీప్ కిషన్, సీరత్కపూర్, రాహుల్ రవీంద్రన్ , తనికెళ్ల భరణి, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, పృథ్వీరాజ్. సుప్రీత్, ప్రవీణ్ తదితరులు
మాటలు: అబ్బూరి రవి,
కెమెరా: ఛోటా కె. నాయుడు,
ఎడిటింగ్: ఛోటా కె. ప్రసాద్,
ఫైట్స్: వెంకట్,
ఆర్ట్: రాము,
ఆఫీస్ ఇన్ చార్జ్: భగ్గా రామ్,
కో-డైరెక్టర్: పుల్లారావు కొప్పినీడి,
లైన్ ప్రొడ్యూసర్: జి. నాగేశ్వరరావు.
కథ,స్క్రీన్ ప్లే, దర్సకత్వం : వి.ఐ. ఆనంద్
నిర్మాతలు: ఠాగూర్ మధు, మెగాసూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఎన్వీ ప్రసాద్
విడుదల తేది: 26, జూన్ 2015.
ఫైనల్ గా... పవన్ కళ్యాణ్ ..'బంగారం' చిత్రాన్ని గుర్తు చేసే ఈ సినిమా ఆ సినిమా తరహా చిత్రాలు నచ్చేవారికి నచ్చుతుంది.
(గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)


Click it and Unblock the Notifications











