‘టైగర్ జిందా హై’మూవీ రివ్యూ: సల్మాన్ ఖాన్ నుండి మరో బ్లాక్ బస్టర్
Recommended Video

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ కాంబినేషన్లో 2012లో వచ్చిన 'ఏక్ థా టైగర్' చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో ఇండియన్ గూడచార సంస్థ 'రా' ఏజెంటుగా సల్మాన్ ఖాన్, పాకిస్థాన్ గూడచార సంస్థ 'ఐఎస్ఐ' ఏజెంటుగా కత్రినా కైఫ్ నటించారు. 'ఏక్ థా టైగర్' చిత్రానికి సీక్వెల్గా తాజాగా 'టైగర్ జిందా హై' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సీక్వెల్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? అనేది రివ్యూలో చూద్దాం.

టైగర్ జిందా హై
8 ఏళ్ల క్రితం క్యూబాలో జరిగిన సీక్రెట్ మిషన్లో టైగర్ (సల్మాన్ ఖాన్) మరణించినట్లు అంతా భావిస్తారు. కానీ అతడు తన ప్రియురాలు, పాకిస్థాన్ ఏజెంట్ జోయా(కత్రినా)ను పెళ్లాడి అజ్ఞాత జీవితం గడుపుతున్న విషయం ‘రా' చీఫ్ (గిరీష్ కర్నాడ్)కు మాత్రమే తెలుసు. ఓ ముఖ్యమైన ఆపరేషన్ నిర్వహించడానికి ‘రా'కు మళ్లీ టైగర్ అవసరం అవుతాడు. గవర్నమెంటుతో మాట్లాడి టైగర్ నేతృత్వంలో సిరియాలోని ఐఎస్ఐఎస్ మీద ఓ ఆపరేషన్ ప్లాన్ చేస్తారు.

కథేమిటంటే...
సిరియాలో కొంత ప్రాంతాన్ని ఐఎస్ఐఎస్ ఆక్రమించుకుంటుంది. అమెరికా సైన్యంతో కలిసి అక్కడి ప్రభుత్వం ఐఎస్ఐఎస్ మీద యుద్ధం చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఓ సారి జరిగిన ఎటాక్లో ఐఎస్ఐఎస్ చీఫ్ అబు ఉస్మాన్ తీవ్రంగా గాయపడతారు. అతడిని బ్రతికించేందుకు ఆసుపత్రికి తీసుకెళతారు. అక్కడ 25 మంది భారతీయ నర్సులు, 15 మంది పాకిస్థాన్ నర్సులు పని చేస్తుంటారు. తమ వృత్తి ధర్మంలో భాగంగా నర్సులు అతడిని కాపాడతారు. అత్యంత క్రూరుడైన అబు ఉస్మాన్ నర్సులందరినీ బంధీలుగా చేసి ఆసుపత్రి స్థావరంగా చేసుకుని తన తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తుంటాడు. ఆ నర్సులను అతడి చెర నుండి కాపాడటం అనే ప్రధాన ఇతివృత్తంతో సినిమా స్టోరీ సాగుతుంది.

ఇండియన్ నర్సుల కోసం రంగంలోకి టైగర్
అబు ఉస్మాన్ ఆసుపత్రిని స్థావరంగా చేసుకున్న విషయం తెలిసిన అమెరికా.... ఎయిర్ స్ట్రైక్ ద్వారా ఆసుపత్రిపై బాంబులు వేసి వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన అతడిని అంతం చేయాలని ప్లాన్ చేస్తుంది. అలా చేస్తే అందులో బంధీలుగా ఉన్న 25 మంది భారతీయ నర్సులు కూడా చనిపోతారని, తమకు కొంత సమయం ఇస్తే సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి వారిని బయటకు తీసుకొస్తామని, ఆ తర్వాత ఎయిర్ స్టైక్ చేయాలని భారత్ కోరడంతో..... 7 రోజుల సమయం ఇస్తుంది అమెరికా. ‘రా' కోరిక మేరకు రంగంలోకి దిగిన టైగర్ 7 రోజుల్లో వారిని ఎలా కాపాడాడు అనేది తెరపై చూడాల్సిందే.

ఇండియా-పాకిస్థాన్ అంటే శతృత్వమే, కానీ ఇందులో....
భారత దేశ నర్సులను కాపాడేందుకు టైగర్ రంగంలోకి దిగితే.... తన మాతృదేశం పాకిస్థాన్ నర్సులను కాపాడేందుకు జోయా ఎంటరవుతుంది. ఇద్దరూ ఎవరికీ వారే తమ తమ దేశాలకు చెందిన మాజీ ఏజెంట్లతో స్పెషల్ టీం ఏర్పాటు చేసుకుని రంగంలోకి దిగుతారు. సాధారణంగా ఇండియా, పాకిస్థాన్ అంటే...ఏ విషయంలో అయినా బద్ద శతృత్వం ఉంటుంది. అయితే ఈ ఆపరేషన్ విషయంలో మాత్రం రెండు దేశాల ఏజెంట్లు కలిసి ఐఎస్ఐఎస్ మీద పోరాటం చేయడం సినిమాలో ఆసక్తికర విషయం.

సల్మాన్ ఖాన్ అదరగొట్టాడు
సల్మాన్ ఖాన్ మరోసారి తన యాక్షన్ విశ్వరూపం చూపించాడు. ఈ సినిమాలో సల్మాన్ చేసిన యాక్షన్ స్టంట్స్ అభిమానులతో విజిల్స్ వేయిస్తాయి. పెర్ఫార్మెన్స్ పరంగా సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

కత్రినా మైండ్ బ్లోయింగ్
అందం విషయంలో కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా వర్ణించాల్సిన అవసరం లేదు. అయితే ఈ చిత్రంలో ఆమె చేసిన యాక్షన్ స్టంట్స్ మైండ్ బ్లోయింగ్ అనేలా ఉన్నాయి. సల్మాన్-కత్రినా మధ్య రొమాంటిక్ సీన్లు ప్రేక్షకులను ఎంటర్టెన్ చేస్తాయి.

ఇతర నటీనటులు
ఐఎస్ఐఎస్ చీఫ్ అబు ఉస్మాన్ పాత్రలో సజ్జద్ డెల్ర్పో జ్ సహజంగా నటించాడు. ‘రా' చీఫ్ పాత్రలో గిరీష్ కర్నాడ్, సిరియాలోని ఆయిల్ రిపైనరీలకు వర్కర్స్ను సప్లై చేసే బ్రోకర్ పాత్రలో పరేష్ రావల్ తమ నటనతో ఆకట్టుకున్నారు. పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ జహీర్ పాత్రలో సుదీప్, టైగర్ టీమ్ మెంబర్ పాత్రలో కుముద్ మిశ్రా, నర్సుల పాత్రలో అంజలీ గుప్తా, నేహా హింగే తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ విభాగాలు
టెక్నికల్ అంశాల పరంగ చూస్తే..... ఈ చిత్రానికి మార్కిన్ లక్సవిక్ అందించి సినిమాటోగ్రఫీ, విశాల్-శేఖర్ అందించిన సంగీతం, జులిస్ పాకియమ్ బ్యాగ్రౌండ్ స్కోర్..... సినిమాను మరో లెవల్కి తీసుకెళ్లాయి. బాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ వారు నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీపడలేదు. హాలీవుడ్ యాక్షన్ సినిమాల స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా చిత్ర నిర్మాణం ఉంది.

దర్శకుడి పని తీరు
ఈ చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు. ఇంతకు ముందు సల్మాన్తో ‘సుల్తాన్' సినిమా తీసిన ఈ డైరెక్టర్ సల్మాన్ అభిమానుల నాడి పసిగట్టినట్లున్నాడు. ఫ్యాన్స్ మెచ్చే విధంగా సీన్లు, సన్నివేశాలను స్క్రీప్లేలో జోడించి సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా ముందుకు నడిపించారు.

కథలో గొప్పదనం లేక పోయినా.... ఇండియా-పాక్ సెంటిమెంటుతో
ఈ సినిమా కథ పరంగా చూస్తే కొత్తగా ఏమీ అనిపించదు. దాయాది దేశాలు, బద్దశత్రువులైన ఇండియా-పాకిస్థాన్ సెంటిమెంటుకు మానవతా ధృక్పథం జోడించి కథను ముందుకు నడిపించిన తీరు ప్రతి ఒక్కరినీ సంతృప్తి పరిచే విధంగా ఉంది.

ఫస్టాఫ్ ఎలా ఉందంటే...
సినిమా ఫస్టాఫ్ మొత్తం టైగర్ కోసం ‘రా' సంస్థ వెతకడం, అతడిని ఒప్పించడం, టైగర్ తన టీంతో సిరియాలో ఎంటరవ్వడం లాంటి సన్నీవేశాలతో సాగుతుంది.
సెకండాఫ్ సీరియస్ యాక్షన్
సెకండాఫ్లో ఐఎస్ఐఎస్ చీఫ్ అబు ఉస్మాన్ ను అంతం చేసి, ఇండియా, పాకిస్థాన్ నర్సులను కాపాడటం లాంటి సన్నివేశాలతో సీరియస్ యాక్షన్తో సినిమా సాగుతుంది.

ప్లస్ పాయింట్స్
సల్మాన్ ఖాన్ యాక్షన్
కత్రినా కైఫ్ పెర్ఫార్మెన్స్
సినిమాటోగ్రఫీ
సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్
ఇండియా-పాకిస్థాన్ జాయింట్ ఆపరేషన్
మైనస్ పాయింట్స్
కథలో కొత్తదనం లేక పోవడం

చివరగా సినిమా గురించి...
కథ పరంగా చూస్తే ‘టైగర్ జిందా హై' సినిమా అంత గొప్పగా ఏమీ అనిపించదు. అయితే సల్మాన్ ఖాన్, కత్రినా పెర్ఫార్మెన్స్, హాలీవుడ్ స్థాయిలో ఉండే యాక్షన్ సీన్లు ప్రేక్షకులను బాగా ఎంటర్టెన్ చేస్తాయి. పాకిస్థాన్ మనకు శత్రుదేశమే అయినా..... మానవతా ధృక్పథంతో ఇండియన్-పాక్ ఏజెంట్లు కలిసి పని చేయడం ప్రేక్షకులు కన్విన్స్ అయ్యేలా ఉంది. ఓవరాల్గా ‘టైగర్ జిందా హై' చిత్రం సల్మాన్ అభిమానులను మెప్పించే చిత్రం అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

నటీనటులు
సల్మాన్ ఖాన్
కత్రినా కైఫ్
సజ్జద్ డెల్ఫోజ్
సుదీప్
అంగద్ బేడీ
కుముద్ మిశ్రా
గిరీష్ కర్నాడ్
అంజలీ గుప్తా
నేహా హింగే
ఇవన్ రోడ్రిగ్యుస్
నవాబ్ షా

తెర వెనక
దర్శకత్వం: అలీ అబ్బాస్ జఫర్
నిర్మాణ సంస్థ: యశ్ రాజ్ ఫిలింస్
నిర్మాత : ఆదిత్య చోప్రా
కథ, స్క్రీన్ ప్లే: అలీ అబ్బాస్ జఫర్, నీలేష్ మిశ్రా
సంగీతం: విశాల్-శేఖర్
బ్యాగ్రౌండ్ స్కోర్: జులిస్ పాకియమ్
సినిమాటోగ్రఫీ: మార్కిన్ లక్సవిక్
ఎడిటింగ్: రామేశ్వర్ ఎస్.భగత్
విడుదల తేడీ: డిసెంబర్ 22, 2017


Click it and Unblock the Notifications











