పవన్ కళ్యాణ్తో అనుకునే లోపే కేసు వేసారు!
చెన్నై: తమిళ స్టార్ విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘కత్తి' విడుదల ముందు అనేక కష్టాలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం దీపావళికి విడుదలై సూపర్ హిట్ టాక్ తో సూపర్ కలెక్షన్లు సాధిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి కోర్టు కష్టాలు మొదలయ్యాయి.
సినిమాలో 2జి స్ప్రెక్ట్రమ్ స్కాం ప్రస్తావన ఉండటంతో మధురైకి చెందిన లాయర్ రామసుబ్రహ్మణ్యం కేసు వేసారు. 2జి స్ప్రెక్ట్రమ్ కేసు ఇంకా విచారణ దశలో ఉండగా సినిమాలో ఆ అంశాన్ని లేవనెత్తడంపై అభ్యంతరం వ్యక్తం చేసారు. ఈ మేరకు హీరో విజయ్, దర్శకుడు మురుగదాస్, సినీ నిర్మాణ సంస్థలపై కేసు వేసారు.
‘కత్తి' చిత్రం సందేశాత్మకంగా ఉండటంతో తెలుగులో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని ఆయన ఫ్యాన్స్ ఆశ పడుతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానుల ఆసక్తిని గమనించిన నిర్మాత ఠాగూర్ మధు ఈ విషయాన్ని పవర్ స్టార్ దృష్టికి తీసుకెళ్లాడు. పవన్ కళ్యాణ్ సినిమా చూసి తన నిర్ణయం చెబుతానని చెప్పడంతో ఈ రోజు (అక్టోబర్ 28) స్పెషల్ షో ఏర్పాటు చేసారు. సినిమా చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ తన నిర్ణయం చెప్పనున్నారు. పవన్ ఏ నిర్ణయం చెబుతారనే దానిపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

విజయ్ నటించిన 'కత్తి' చిత్రం ఒకే రోజున రూ.15.50 కోట్లు వసూలు చేసి రికార్డుకెక్కింది. తమిళ సినీ పరిశ్రమలో ఇదో రికార్డు. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకొన్నారు. మొదట్లో ఈ చిత్రం విడుదలకు కొన్ని తమిళ సంఘాల నుంచి నిరసన వ్యక్తమైంది. చిత్రం విడుదలను అడ్డుకుంటామని కొన్ని సంఘాలు ప్రకటించారు. చివరికి నిరసన కారులతో చిత్ర బృందం చర్చలు జరిపి సమస్యను పరిష్కరించింది.
గతంలో విజయ్ హీరోగా చేసిన ‘ఖుషీ' సినిమాని పవన్ తెలుగులో రీమేక్ చేసి బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు.‘కత్తి' సినిమా విషయానికి వస్తే ఇది సెజ్, రైతులకు మధ్య జరిగే పోరాటానికి సంబంధించిన సినిమా. రైతులు తమ భూములను ఎలా కోల్పోతున్నారు. ఎందుకు రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వ్యవసాయానికి నీరు ఎంత అవసరం. అటువంటి నీటివనరుని ఆక్రమించి బీరు ఫ్యాక్టరీ కట్టాలనుకునే ఓ మల్టీనేషనల్ కంపెనీని ఓ గ్రామానికి చెందిన యువకుడు ఎలా ఎదుర్కొన్నాడు. రైతులతో ప్రజల్లో ఎలాంటి చైతన్యాన్ని తీసుకువచ్చాడనేదే ప్రధానాంశంగా సినిమా సాగుతుంది.


Click it and Unblock the Notifications











