రజనీకాంత్ తో చిత్రం చేయట్లేదని ప్రకటన
చెన్నై : సౌతిండియా సూపర్స్టార్ రజనీకాంత్ కొత్త చిత్రాన్ని తాను తెరకెక్కించడం లేదంటున్నారు సీనియర్ దర్శకుడు కేఎస్ రవికుమార్. సూపర్స్టార్తో పలు హిట్ చిత్రాలు చేసిన ఆయన... ఇటీవల 'రాణా' రూపొందించేందుకు సన్నాహాలు చేశారు. రజనీ అస్వస్థతకు గురికావటంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. రజనీ ప్రస్తుతం తన చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వంలో 'కోచ్చడయాన్'లో నటిస్తుండగా, రవికుమార్ దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యత తీసుకున్నారు.
రవికుమార్, కేవీ ఆనంద్లలో ఒకరు రజనీ తర్వాతి చిత్రానికి దర్శకత్వం వహించనున్నారనే వార్త కోలీవుడ్లో జోరుగా వినిపిస్తోంది. వీటిని కేఎస్ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ.. ''రజనీకాంత్ కొత్త చిత్రానికి నేను దర్శకత్వం వహించనున్నట్లు పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ విషయాన్ని పలుమార్లు ఖండించాను. నా కొత్త చిత్రాన్ని సుదీప్తో తెరకెక్కించనున్నా. పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తాను''అని పేర్కొన్నారు.

ఇక రజనీకాంత్ హీరోగా నటించిన 'కోచ్చడయాన్' (తెలుగులో 'విక్రమసింహా') సినిమా విడుదల మరింత ఆలస్యమవుతున్నట్లు సమాచారం. ఆయన కుమార్తె సౌందర్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆడియో వేడుక నిజానికి రజనీకాంత్ జన్మదినం సందర్భంగా గురువారం (డిసెంబర్ 12) జరగాల్సి ఉంది. కానీ ఆ వేడుకను కూడా జనవరి మొదటి వారానికి వాయిదా వేశారు. ఈ సంగతిని తమిళ ఫిల్మ్ ట్రేడ్ విశ్లేషకుడు శ్రీధర్ పిళ్లై ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. శ్రీధర్ పిళ్లై ట్వీట్ లో ... "ఈ సినిమా విడుదల 2014 ఏప్రిల్కు మారింది'' అని చెప్పారు.
దీపికా పడుకోనే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో శరత్కుమార్, జాకీ ష్రాఫ్, ఆది పినిశెట్టి, శోభన, నాజర్ వంటి పేరుపొందిన తారలు నటిస్తున్నారు. ఈ సినిమాని 'అవతార్' తరహాలో మోషన్ కాప్చర్ 3డి టెక్నాలజీని ఉపయోగించి చిత్రీకరించారు. కె.ఎస్. రవికుమార్ రచన చేయగా, ఎ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి రాజీవ్ మీనన్ సినిమాటోగ్రాఫర్. తెలుగులో లక్ష్మీగణపతి ఫిలిమ్స్ విడుదల చేస్తున్న ఈ సినిమాని హిందీ, మలయాళం, ఇంగ్లీష్, జపనీస్ భాషల్లోనూ అనువదిస్తున్నారు.
'రోబో' తర్వాత రజనీకాంత్ హీరోగా 'రాణా' చిత్రం తెరకెక్కాల్సింది. ఆయన అనారోగ్యానికి గురికావటంతో అది ఆగిపోయింది. తన చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వంలో 'కోచ్చడయాన్'కు పచ్చజెండా వూపి అభిమానులను ఖుషీ చేశారు సూపర్స్టార్. సీనియర్ దర్శకుడు కేయస్ రవికుమార్ పర్యవేక్షణలో అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిందీ చిత్రం. ఇందులో రాణా, కోచ్చడయాన్గా రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేశారు. ఇప్పటికే ట్రైలర్ విడుదల చేశారు.


Click it and Unblock the Notifications











