అంత ఖర్చు పెడుతున్నారు మార్కెట్ ఉందా?
చెన్నై : సినిమా బడ్జెట్ ని బట్టే రిలీజ్ అయ్యాక వచ్చే లాభ,నష్టాలు ఆధారపడి ఉంటాయి. అలాగే ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసాం ,ఎక్కువ రేటు చెప్తాం అంటే డిస్ట్రిబ్యూటర్స్ వెనక్కి వెళ్లిపోతారు. కాబట్టి నిర్మాతలు హీరోకు ఉన్న మార్కెట్ ని బట్టే ఖర్చు పెడుతూంటారు. అలాగే అంతకు ముందు ఆ హీరో రిలీజైన చిత్రం కలెక్టు చేసినదాన్ని బట్టి మార్కెట్ అంచనా వేస్తూంటారు. ఈ మధ్య కాలంలో అర్జున్ సినిమాలు భాక్సాఫీస్ వర్కవుట్ కావటం లేదు. కానీ ఆయన పట్టువదలని విక్రమార్కుడులా ప్రయత్నాలు మానటం లేదు.
ఇప్పుడు అర్జున్ 'జైహింద్ 2' అంటూ వస్తున్నారు. ఈ చిత్రానికి సైతం బడ్జెట్ ఎక్కువ పెడుతున్నారని సమాచారం. అయితే ఎంతవరకూ రికవరీ అవుతుంది, మార్కెట్ చూసుకోకుండా అర్జున్ సాహసం చేస్తున్నాడా అనే సందేహాలు ట్రేడ్ లో కలుగుతున్నాయి. మరో ప్రక్క అర్జున్ మాత్రం చాలా ఉత్సాహంగా ఈ చిత్రం ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని, 'జైహింద్ ' ని దాటుతుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు.

యాక్షన్కింగ్ అర్జున్ స్వీయదర్శకత్వంలో తెరకెక్కుతున్న సీక్వెల్ చిత్రం 'జైహింద్ 2'. శ్రీరామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానరుపై రూపొందుతున్న ఈ సినిమాలో సుర్విన్ చావ్లా, సిమ్రన్కపూర్ హీరోయిన్స్. రాహుల్దేవ్, బ్రహ్మానందం, రవి, మయిల్స్వామి, మనోబాలా, బేబి యునితా తదితరులు నటిస్తున్నారు. వైరముత్తు పాటలు రాశారు. ప్రస్తుతం 95శాతం పూర్తయింది. త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో అర్జున్ మాట్లాడారు.
అర్జున్ మాట్లాడుతూ.. ''దేశం అభివృద్ధి సాధించాలంటే ధనబలం, దళ బలానికన్నా మరో ముఖ్యమైన బలం విద్య. ఆ విషయాన్నే సినిమాలో ప్రస్తావించాం. విద్య ఉంటే దేశం ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుందో ఈ సినిమాను చూస్తే అర్థమవుతుంది. ప్రతి ఒక్క విద్యార్థి, తల్లిదండ్రులు చూడదగ్గ చిత్రమిది. ప్రస్తుతం ఈ సినిమాను ఐరోపాలో చిత్రీకరిస్తున్నాం. పలు ఛేజింగ్ సన్నివేశాలు తెరకెక్కుతున్నాయి. ఇటీవలే సింగపూర్లో కొంత చిత్రీకరణ జరిపాం. ''అని తెలిపారు.


Click it and Unblock the Notifications











