విగ్రహాన్ని ఆవిష్కరించి.. గురుభక్తిని చాటుకున్న లోకనాయకుడు
ఓనమాలు దిద్దించిన గురువును ఏ శిష్యుడూ మరిచిపోడు. అలాంటిది నటనలో ఓనమాలు దిద్దించి.. ప్రపంచనాకి పరిచయం చేసిన గురువును లోక నాయకుడు కమల్ హాసన్ఎలా మరిచిపోతాడు. తన అరవై యేళ్ల సినీ ప్రయాణానికి నాంది వేసిన కే బాలచందర్ విగ్రహాన్ని తన ఆఫీస్లోనే ఆవిష్కరించి గురుభక్తిని చాటుకున్నాడు. కమల్ హాసన్ తన 65వ పుట్టినరోజు వేడుకుల్లో భాగంగా అనేక కార్యక్రమాలను చేపట్టాడు.
నిన్న (నవంబర్ 7) లోకనాయకుడు కమల్ హాసన్ తన 65వ పుట్టినరోజు జరుపుకున్నాడు. అయితే ఈ ఏడాదికి మరో విశిష్టత ఉంది. నటుడిగా తెరంగేట్రం చేసి 60ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు. నాలుగేళ్ళ ప్రాయంలోనే వెండి తెరపై కనిపించిన కమల్ హాసన్ మొదటి చిత్రం కాలాతూర్ కన్నమ్మ చిత్రంలో నటనకు గాను రాష్ట్రపతి అవార్డు గెలుచుకున్నాడు. కాగా తమిళ లెజెండరీ దర్శకుడు కె బాలచందర్ కమల్ హాసన్ ను మొదటిసారి హీరోగా పరిచయం చేశారు.

వీరి కాంబినేషన్లో అపూర్వ రాగంగళ్, మరో చరిత్ర, అందమైన అనుభవం, ఆకలి రాజ్యం, అంతులేని కథ వంటి క్లాసికల్ హిట్స్ వచ్చాయి. వీరి కాంబినేషన్ లో వచ్చిన చివరి చిత్రం పరవశం. కాగా తన పుట్టినరోజుని పురస్కరించుకొని కమల్ తన గురువైన స్వర్గీయ బాలచందర్ గౌరవార్థం ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించారు.
కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ అయిన రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ నూతన భవనం ఎదురుగా బాలచందర్ విగ్రహం ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రజినీ కాంత్ కూడా పాల్గొన్నారు. అలాగే గాంధీజీ 150వ జయంతి సందర్భంగా కమల్ హాసన్ నటించిన హే రామ్ మూవీ ప్రదర్శించారు. ఇక కమల్ హాసన్ ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న భారతీయుడు 2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











