ఆ లేఖ కంటతడి పెట్టించింది.. అప్పుడే బతకాలని అనిపించింది.. రజనీకాంత్
ప్రపంచవ్యాప్తంగా ప్రాంతం, భాషకు అతీతంగా అత్యంత ప్రజాదరణ ఉన్న నటుల్లో సూపర్స్టార్ రజనీకాంత్ ఒకరు. రజనీ సినీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. వాటికి బెదరలేదు.. కుంగిపోలేదు. పొంగిపోలేదు. అయితే ఇటీవల అనారోగ్యం పాలైన సమయంలో ఓ అభిమాని రాసిన లేఖ నన్ను కదలించింది.. బతకాలనే ఆశ కలిగించింది అని ఇటీవల అభిమానులతో జరిగిన భేటీలో రజనీ స్వయంగా చెప్పడం గమనార్హం. ఇంతకీ అభిమాని రాసిన లేఖలో ఉన్న విషయం రజనీ చెప్పిన ప్రకారం..

ఆరోగ్యం క్షీణించిన సమయంలో
నా ఆరోగ్యం దారుణంగా క్షీణించింది. చాలా నెలలపాటు సింగపూర్ హాస్పిటల్లో మంచానికే పరిమితమయ్యాను. నేను బతుకుతానో లేదో అనే భయం కలిగింది. అయితే అలాంటి పరిస్థితి నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావడానికి కారణం అభిమానులే.

అభిమాని లేఖ కదిలించింది
నాకు ఎదురైన ప్రతికూల పరిస్థితుల్లో అభిమానులు చూపిన ప్రేమ. స్వార్ధం లేకుండా అందించిన అభిమానం, చేసిన ప్రార్థనలు ఫలించాయి. ఒకటా రెండా అనేది మాటల్లో చెప్పలేను. కానీ ఓ అభిమాని రాసిన లేఖ నన్ను కదిలించింది.

అలా తిరిగి వస్తే చాలూ..
ఆరోగ్యం క్షీణించి దారుణమైన స్థితిలో ఉన్న సమయంలో ఓ అభిమాని రాసిన లేఖ చదివాను. అందులో ఏమున్నదంటే.. తలైవా నీవు సినిమాల్లో నటించడానికో లేదా రాజకీయాల్లోకి రావడానికో కాకుండా.. నీవు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తే అది మాకు చాలు అని ఉంది. ఆ ఉత్తరాన్ని నేను ఇప్పటికీ మరిచిపోలేను.

కళ్లలో నీళ్లు గిర్రున తిరిగాయి
ఆ అభిమాని రాసిన లేఖ చదివిన తర్వాత కళ్లలో నీళ్లు గిర్రున తిరిగాయి. భగవంతుడి కృప, అభిమానుల ప్రేమతో మళ్లీ మామూలు మనిషిగా మారాను. నా జీవితంలో అత్యంత దారుణమైన పరిస్థితుల నుంచి ఊహాకు అందనంత డబ్బు, కీర్తి, ప్రేమను ఈ జీవితం ఇచ్చింది అని రజనీ ఉద్వేగంగా మాట్లాడారు

ఏప్రిల్ 14న రోబో2.0 రిలీజ్
రజనీకాంత్ నటించిన తాజా చిత్రం రోబో2.0 చిత్రం ఏప్రిల్ 14న రిలీజ్ కానున్నది. తొలుత ఏప్రిల్ 27న రిలీజ్ చేయాలని నిర్ణయించినప్పటికీ.. మహేష్ బాబు నటించిన భరత్ అను నేను, అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య చిత్రాలు విడుదల కానునుండటంతో రొబో2 రిలీజ్ను ముందుకు జరపడం గమనార్హం.


Click it and Unblock the Notifications











