నరకం అనుభవించిన నిర్మాత, శింబు మీద రెడ్ కార్డ్... స్పందించిన హీరో!
తమిళ సినిమా పరిశ్రమలో హీరో శింబు నటించిన 'అన్బనవన్ అసరధవన్ అదంగధవన్'(ఏఏఏ) సినిమా విషయంలో ఓ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. సినిమా నిర్మాణ సమయంలో శింబు తనకు నరకం చూపాడని, అతడి వల్ల తాను చాలా నష్టపోయాను అంటూ నిర్మాత మైఖేల్ రాయప్పన్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
షూటింగుకు హాజరు కాకపోవడం, తరచూ లొకేషన్లు మార్చడం, సమయానికి షూటింగుకు రాకపోవడం లాంటి చర్యలతో శింబు తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడని, అతడి వల్ల తీవ్రంగా నష్టపోయాను అని రాయప్పన్ మీడియాకు తెలిపారు.

శింబు మీద బ్యాన్
నిర్మాతను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన శింబు మీద రెడ్ కార్డ్ ప్రవేశ పెట్టాలని నిర్మాతల మండలి యోచిస్తోందనే వార్తలు తమిళ మీడియాలో వినిపిస్తున్నాయి. రెడ్ కార్డ్ ప్రవేశ పెడితే ఆ నిర్మాతతో వివాదం పరిష్కారం అయ్యే వరకు మరో సినిమాలో నటించకుండా బ్యాన్ అమలులోకి వస్తుంది. ఈ నేపథ్యంలో శింబు స్పందించారు.

ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు
‘నేను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు. తమిళ ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి నాకెలాంటి రెడ్కార్డ్ నోటీసు రాలేదని, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు. నిర్మాత రాయప్పన్ ఇంకా నాకు చెల్లించాల్సిన సొమ్ము చాలా ఉంది. దీనిపై నడిఘర్ సంఘంలో ఇప్పటికే ఫిర్యాదు చేశాను' అని తెలిపారు.

బాత్రూంలో డబ్బింగ్ చెప్పాడు
షూటింగుకు రాకుండా ఇబ్బంది పెట్టడంతో పాటు శింబు తన ఇంట్లోని బాత్రూంలో డబ్బింగ్ చెప్పి పంపాడని, అతడి మూలంగా తాను కెరీర్లో ఎన్నడూ లేనంతగా ఇబ్బంది పడ్డానని, చాలా డబ్బు నష్టపోయానని రాయప్పన్ చెప్పిన విషయాలు తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

మణిరత్నం సినిమాపై ఎఫెక్ట్
రాయప్పన్ ఫిర్యాదే మేరకు శింబు మీద రెడ్ కార్డ్ జారీ అయితే ప్రస్తుతం ‘శింబు' చేస్తున్న మణిరత్నం సినిమాపై ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











