చెన్నైవరదలు..సినీ పరిశ్రమ నష్టం ఎంత?
చెన్నై:వరదల ప్రభావంతో కోలీవుడ్ పెనుసవాళ్లను ఎదుర్కొంటోంది. ఇటీవల విడుదలైన చిత్రాల పరిస్థితి దారుణంగా తయారైంది. వర్షాల ప్రభావంతో నగరంలోని అన్ని థియేటర్లు బోసిపోయాయి. దాదాపు నెలరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా థియేటర్లకు జనం రావడం లేదు. మేఘావృతంగా ఉన్నా కూడా నగర ప్రజలు థియేటర్లకు వెళ్లే సాహసం చేయరు. దాంతో ఈ వారంలో పాతిక లక్షలు దాకా నష్టం వచ్చినట్లు ప్రాధమిక అంచనా.
అజిత్ హీరోగా నటించిన 'వేదాలం' సినిమాకు కూడా వరద దెబ్బ తగిలింది. అసలు నగరంలో ఏ సినిమాలు ఆడుతున్నాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. పోస్టర్లు, ప్రచారాలు ఏమాత్రం కనిపించడం లేదు. దీంతో బుధవారం నుంచి కొత్తగా పోస్టర్లు వెలిశాయి.

దీంతో భారీ వర్షాలు లేని రోజుల్లో కూడా థియేటర్లకు జనం రాలేదు. గత నెల 23వ తేదీ నుంచి కురుస్తున్న వర్షాలతో నగరంలోని అన్ని థియేటర్లకు సమస్యలు తప్పలేదు. ఈక్కాట్టుతాంగల్లోని కాశి థియేటర్ వర్షపునీటిలో సగం వరకు మునిగిపోయింది. అడయారు నది పక్కనే ఈ థియేటర్ ఉండటంతో వరదనీరు ముంచెత్తింది. ఈ థియేటర్లో తెర, కుర్చీలు ధ్వంసమయ్యాయి.
అశోకస్తంభం సమీపంలోని ఉదయం కాంప్లెక్స్, మోక్షం, కమల థియేటర్లు కూడా వరదనీటిలో ధ్వంసమయ్యాయి. గత కొన్ని రోజులుగా నగరంలోని 20కి పైచిలుకు థియేటర్లలో ప్రదర్శనలు కూడా ఆపేశారు. ఇక వడపళనిలోని విజయామాల్లో కొత్తగా ఆరంభించిన మల్టీప్లెక్స్ థియేటర్లో కూడా జనం కనిపించలేదు.


Click it and Unblock the Notifications











