రజనీ,కమల్ ఒకే రోజు తేడాలో .....
చెన్నై: రజనీకాంత్, కమల్హాసన్ కొత్త చిత్రాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. తన చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వంలో సూపర్స్టార్ నటించిన చిత్రం 'కోచ్చడయాన్'(తెలుగులో విక్రమ్ సింహా). విశ్వనటుడు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కలల ప్రాజెక్ట్ 'విశ్వరూపం'. ఈ రెండు సినిమాల ప్రకటనలు దాదాపు ఏకకాలంలో బయటికొచ్చాయి. చిత్రీకరణలు కూడా కాస్త అటుఇటుగా మొదలయ్యాయి. 'విశ్వరూపం' ఆగస్టులోనే విడుదలవుతున్నట్లు ప్రకటించారు. అప్పటికి 'కోచ్చడయాన్' పూర్తి కాలేదు. ఇదిలా ఉండగా సాంకేతికపనుల్లో భాగంగా 'విశ్వరూపం' విడుదల వాయిదా పడింది. దీపావళి సీజన్లో ఇవి రెండూ తెరపైకి వస్తాయని అందరూ ఎదురు చూశారు.
అయితే రజనీకాంత్ 'శివాజీ' 3డీ హంగులు అద్దుకుని వెలుగుల పండుగ రేసులోకి దూసుకురావటంతో 'కోచ్చడయాన్'ను రజనీ పుట్టినరోజైన డిసెంబర్ 12వ తేదీకి వాయిదా వేశారు. అయితే 'విశ్వరూపం' సాంకేతిక పనులు పూర్తి కాలేదని, విడుదల జనవరిలో ఉంటుందని ప్రకటించారు. ఇక 'కోచ్చడయాన్' కూడా డిసెంబరులో కాదని పొంగల్ కానుకగా వస్తుందని ఇటీవల ప్రకటించారు. అటుఇటు తిరిగి ఇవిరెండు ఒకట్రెండు రోజుల వ్యవధిలో థియేటర్లలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ రెండింటి కోసం అభిమానులతో పాటు, కోలీవుడ్ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రజనీకాంత్ 'చంద్రముఖి', కమల్హాసన్ 'ముంబయి ఎక్స్ప్రెస్' చిత్రాలు 2005లో ఒకేరోజు విడుదలయ్యాయి.
కమల్హాసన్ దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న చిత్రం 'విశ్వరూపం'. రాజ్కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, పి.వి.పి. సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మరోసారి రిలీజ్ వాయిదా పడింది. జనవరి 2013 లో ఈ చిత్రం విడుదల అయ్యే అవకాసం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రం లేటు అవటానికి కారణం..ఈ చిత్రంలో విప్లవాత్మకమైన ఆరో 3D ని ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లు సమాచారం. ఈ టెక్నాలిజీతో సినిమాని మిక్సింగ్ చేయటానికి మరింత సమయం పడుతుంది. అందుకే లేటు అని చెన్నై వర్గాల సమాచారం. ప్రస్తుతం చెన్నైలో ఈ కన్వర్షన్ వర్క్ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకీ తీవ్రవాద కార్యకలాపాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న వైనాన్ని చర్చిస్తూనే... వారి పని తీరుని, ఆలోచనల్న. తన చిత్రంలో చూపించబోతున్నట్లు సమాచారం. తీవ్రవాదం గురించి కమల్ చిత్రంలో ఏం చర్చించారనే విషయాన్ని గోప్యంగా ఉంచారు. తెరపై ఆయన తీవ్రవాదిగా కనిపించబోతున్నారు.
'విక్రమ్ సింహా' చిత్రంలో రజనీకాంత్..రణధీరన్ అనే రాజు పాత్రలో కనిపించనున్నారు. పల్లవుల కాలంలో చోటు చేసుకొన్న కొన్ని సంఘటనల ఆధారంగా అల్లుకొన్న కథ. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్ మీనన్ కెమెరా వర్క్ అందిస్తున్నారు. ఈచిత్రంలో రజనీకాంత్ లాంగ్ హెయిర్ తో శివున్ని పోలి ఉంటాడని, కత్తులతో పోరాటం చేసే యోధుడిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. దీపికా పదుకొనే ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న విషయం విదితమే. భారతదేశంలోనే తొలిసారిగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతోన్న చిత్రం ఇదే కావడం గమనార్హం. ఏఆర్ రెహమాన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











