Bigg Boss Telugu 7th Week Elimination: ఓటింగ్ తారుమారు.. డేంజర్ జోన్లో టాప్ 5 కంటెస్టెంట్స్.. ఎలిమినేట్ ఎవరు?
Bigg Boss Telugu: స్టార్ మా ప్రసారమవుతున్న ప్రముఖ రియాలిటీ షో బిగ్బాస్ తెలుగు సీజన్ 9 ప్రస్తుతం ఉత్కంఠభరిత దశలో కొనసాగుతోంది. ఆరంభంలో నత్తనడకగా సాగిన ఈ రియాలిటీ గేమ్ షో, వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో గేమ్ స్వరూపమే మారిపోయింది. ఏడో వారంలోకి అడుగుపెట్టిన బిగ్బాస్ హౌస్లో, కంటెస్టెంట్ల మధ్య విభేదాలు, వ్యూహాలు, స్నేహాలు, ప్రేమలు, అహంకారం అన్నీ కలగలసి నిజమైన రియాలిటీ రణరంగంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో 7వ వారం ఎవరెవరు నామినేషన్స్లో ఉన్నారు? ఈ వారం ఓటింగ్ ఎలా జరుగుతోంది? ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు? ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు? ఈ వివరాల్లోకి వెళితే..
ఇప్పటి వరకు బిగ్బాస్ హౌస్ నుంచి మొత్తం ఏడుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారం శ్రష్టి వర్మ, రెండో వారం మర్యాద మనీష్, మూడో వారం ప్రియా శెట్టి, నాలుగో వారం హరిత హరీష్, ఐదో వారం ఆశా షైనీ, శ్రీజ దమ్ము, ఆరో వారం భరణి శంకర్ హౌస్ను వీడారు. ఇందులో ముఖ్యంగా భరణి శంకర్ ఎలిమినేషన్ అభిమానులకు పెద్ద షాక్గా మారింది. గేమ్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్గా నిలిచిన భరణి వెళ్లిపోవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.

వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్లో కొత్త జోష్
ఆరో వారం నుంచి హౌస్లోకి వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు ఆయేషా జీనత్, రీతూ చౌదరి, సంజన గల్రానీ, రమ్య మోక్ష, గౌరవ్ గుప్తా, సాయి శ్రీనివాస్, నిఖిల్ నాయర్, దివ్వెల మాధురి లు హౌస్లో కొత్త జోష్ ను తీసుకవచ్చారు. ముఖ్యంగా ఆయేషా, రీతూ చౌదరి, దివ్వెల మాధురి మధ్య వాగ్వాదాలు హౌస్ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి.
నామినేషన్ లో ఉన్నదెవరు?
ఏడో వారంలో బిగ్బాస్ ఇచ్చిన నామినేషన్ టాస్క్ పూర్తి ఉత్కంఠభరితంగా సాగింది. ఈసారి కంటెస్టెంట్లు ముఖానికి ఫోమ్ పూసి ఒకరిని ఒకరు నామినేట్ చేయాలి అనే టాస్క్ ఇచ్చారు. నామినేషన్ సందర్భంగా మాటల తూటాలు ఎగురుతూ, హౌస్లో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. ఆయేషాకు బిగ్బాస్ ఇచ్చిన ప్రత్యేక పవర్తో ఆమె రీతూ చౌదరిని నామినేట్ చేయడంతో పెద్ద వాగ్వాదం చెలరేగింది. దాంతో కంటెస్టెంట్ల మధ్య విభేదాలు పెరిగి, గేమ్ మరింత హీట్ అయ్యింది. దివ్య తన నామినేషన్లలో అయేషా, సాయి శ్రీనివాస్ పేర్లు ప్రకటించగా, రీతూ చౌదరి తన రెండో నామినేషన్గా రాము రాథోడ్ను ఎంచుకుంది. చివరికి ఈ వారం నామినేషన్స్లో కళ్యాణ్, సంజన, దివ్య, రాము, రీతూ, తనూజ, రమ్య, సాయి, అయేషా మొత్తం తొమ్మిది మంది నిలిచారు. అయితే కెప్టెన్ గౌరవ్ గుప్తా తనకు లభించిన "సేవ్ సమ్ వన్" పవర్ను ఉపయోగించి అయేషాను నామినేషన్ నుంచి రక్షించాడు.
ఓటింగ్ రేస్లో ఉత్కంఠ
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓటింగ్ జోరుగా సాగుతోంది. అభిమానులు తమ ఫేవరెట్ కంటెస్టెంట్లకు మద్దతుగా హాష్ట్యాగ్ క్యాంపెయిన్లు, వీడియో క్లిప్లు, పోల్స్ చేస్తున్నారు. అనధికారిక సర్వేలు, ఆన్లైన్ ట్రెండింగ్ రిపోర్టుల ప్రకారం ఈ వారం ఓటింగ్ ర్యాంకింగ్స్ ఇలా ఉన్నాయి. టాస్క్ల్లో దుమ్మురేపుతున్న తనూజ మరోసారి టాప్ ప్లేస్లోకి రాగా.. ఈ రేస్లో కళ్యాణ్ వెనుకబడ్డారు. తనూజ కు 38.07 శాతం ఓట్లు రాగా, పవన్ కళ్యాణ్కు20.42 శాతం ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత సంజన గల్రానీ 9.44 శాతం, దివ్య 8.78 శాతం, రీతూ చౌదరికి 8.75 శాతం ఓట్లతో సేఫ్ జోన్ ఉన్నట్టు తెలుస్తోంది.
డేంజర్ జోన్లో ముగ్గురు కంటెస్టెంట్లు
అయితే రమ్య మోక్షకు 6.99 శాతం, రాము రాథోడ్కు 6.33 శాతం, సాయి శ్రీనివాస్కు 5.91 శాతం ఓటింగ్ మాత్రమే లభించింది. దాంతో ప్రస్తుతానికి రమ్య మోక్ష, రాము రాథోడ్, సాయి శ్రీనివాస్లు డేంజర్ జోన్లో నిలిచారు. అయితే ఓటింగ్ ముగియడానికి ఇంకా సమయం ఉండటంతో ర్యాంకింగ్స్ మారే అవకాశం ఉందని అంటున్నారు. వీరు ముగ్గురికి కొన్ని పాయింట్ల తేడాతో ఓకే రేటింగ్ రావడంతో వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. ఈ ఓటింగ్ బట్టి సాయి శ్రీనివాస్ గానీ, రాము రాథోడ్ గానీ ఎలిమినేట్ అయ్యే అవకాశముంది.
ఆయేషా గేమ్ ఓవర్
అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశాలు ఉన్నాయని చాలా మంది భావిస్తున్నారు. కానీ, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో ఊహించని ఘటన జరిగింది. వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇచ్చిన ఆయేషా జీనత్ (Ayesha Zeenath) అనారోగ్య కారణాలతో వాలంటరీ ఎలిమినేటర్గా హౌస్ నుంచి బయటకు వెళ్లింది. ఆయేషా గతంలో తమిళ బిగ్ బాస్లో కూడా వివాదాస్పద కంటెస్టెంట్గా నిలిచింది. తెలుగు బిగ్ బాస్లో కూడా అదే ఆత్మవిశ్వాసంతో, ఓవర్ యాటిట్యూడ్తో ఆడినా, ఆ ఆట ఎక్కువ కాలం సాగలేదు. ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే ఆమెకు ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. హౌస్లో ఉన్నప్పుడే ఆమెకు ఫీవర్, ఒళ్లు నొప్పులు ఎక్కువయ్యాయి. మెడికల్ టెస్ట్లు చేయగా టైఫాయిడ్, డెంగ్యూ పాజిటివ్ అని తేలింది. అందుకే బిగ్ బాస్ టీమ్ ఆమెను బయటకు పంపే నిర్ణయం తీసుకుంది.
ఎపిసోడ్లో డాక్టర్ ఈ విషయం చెప్పడంతో ఆయేషా కన్నీళ్లు పెట్టుకుంది. "నా లైఫ్లో ఏదీ ఈజీగా రాలేదు, బిగ్ బాస్ సెకండ్ ఛాన్స్ ఇచ్చారు, కానీ బ్యాడ్లక్ వెంటాడుతోంది" అంటూ తన బాధను వ్యక్తం చేసింది. బిగ్ బాస్ కూడా ఆమెకు "మీ ఆరోగ్యానికి, ఇతర కంటెస్టెంట్ల భద్రతకీ మీరు హౌస్ నుంచి బయటకు రావాలి" అని తెలిపారు. అందరితో వీడ్కోలు చెప్పి "ఫినాలే వీక్లో కలుద్దాం" అంటూ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయింది ఆయేషా.
ఆమె ఎగ్జిట్తో హౌస్లోని అందరూ బాధపడ్డారు, అయితే రీతూ మాత్రం సంతోషం దాచుకోలేక పాటలు పాడింది. వెళ్తూ తనూజాకి "ఫేక్ లవ్ ట్రాక్లలో పడొద్దు" అని సూచిస్తూ వెళ్లిపోయింది ఆయేషా. మొత్తానికి ఈ వారం బిగ్ బాస్ హౌస్లో ఆయేషా గేమ్కి ఎండ్ కార్డ్ పడిపోయింది. ఇక వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున ఏ కంటెస్టెంట్ను హౌస్ నుంచి పంపిస్తారోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బిగ్బాస్ హౌస్లో ఇంకా ఎన్నో మలుపులు చోటుచేసుకుంటాయో.. వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











