హిట్టా..ప్లాపా? : చిరంజీవి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’షో...టీఆర్పిలు షాకిచ్చాయా?
చిరంజీవి హోస్ట్ గా మొదలైన షో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’టీఆర్పీలు షాకిచ్చాయి.
హైదరాబాద్: హిందీలో పాపులర్ అయిన 'కౌన్ బనేగా కరోడ్పతి' కార్యక్రమాన్ని తెలుగులో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' పేరుతో ప్రారంభించిన సంగతి తెలిసిందే. నాగార్జున హోస్ట్ గా ప్రసారమైన తొలి మూడు సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా ప్రసారం అవుతున్న నాలుగో సీజన్ ను మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
'ఖైదీ నెంబర్ 150'తో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఎంఈకే షోకు రెస్పాన్స్ అదిరిపోతుందని టీవి ఛానెల్ వాళ్లే కాకుండా సామాన్య ప్రేక్షకులు కూడా భావించారు. దానికి తోడు ..ఈ షో ఆరంభంలోనే నాగార్జున గెస్ట్ గా విచ్చేశాడు. ఒక పార్టిసిపెంట్ కోటి రూపాయల ప్రశ్న వరకు వెళ్లాడు. అయినా ఈ ప్రోగ్రాంకు ఆశించిన స్థాయిలో రేటింగ్స్ రాలేదనే విషయం ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది.

ఈ షో ప్రసారమైన వారంలో టీఆర్పీ రేటింగ్స్ లిస్టులోనూ 'ఎంఈకే'కు టాప్ ప్లేస్ లో ఉంటుందనుకుంటే అలాంటిదేమీ దక్కలేదు. అసలు టాప్-5లోనే ఎంఈకే లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమైంది. బార్క్ రేటింగ్స్ ప్రకారం గత వారం 'జనతా గ్యారేజ్' ప్రిమియర్ షో అగ్రస్థానంలో ఉంటే.. తర్వాతి నాలుగు స్థానాల్ని టీవీ సీరియల్స్ దక్కించుకుని అందరికీ షాక్ ఇచ్చాయి.

ఏడాదిన్నర కిందట నాగార్జున హోస్ట్ గా మొదలుపెట్టిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రోగ్రాం పెద్ద సంచలనం సృష్టించింది. తెలుగు టీవి హిస్టరీ లోనే మరే కార్యక్రమానికి రాని స్థాయిలో ఊహించిన టీఆర్పీ రేటింగ్స్ తెచ్చుకుంది ఈ కార్యక్రమం. ఐతే తొలి సీజన్ తో పోలిస్తే తర్వాతి రెండు సీజన్లలో రేటింగ్స్ తగ్గుతూ వెళ్లడంతో నాలుగో సీజన్ కు నాగ్ స్థానంలో మెగాస్టార్ చిరంజీవిని తీసుకొచ్చింది మాటీవీ యాజమాన్యం. దాంతో ఈ ఫెయిల్యూర్ ని చిరంజీవి కి కట్టబెట్టడం పద్దతి కాదంటున్నారు.

అంతేకాదు ఈ షో మీద ముందు నుండి సోషల్ మీడియాలో కొంత వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నప్పటి నుండే దీనిపై నెగెటివ్ ప్రచారం మొదలైంది. తాజాగా చిరంజీవి హోస్ట్ గా షో మొదలయ్యాక వాట్సాఫ్ లో ఈ షో మీద నెగెటివ్ ప్రచారం మరింత ఎక్కువైంది.
షో చూసే వారు కూడా ఓ ప్రశ్నకు ఎస్ఎంఎస్ ద్వారా సరైన జవాబులు పంపిన వారిలో ఒక విజేతను లాటరీ ద్వారా ఎంపిక చేసి రూ.10 వేలు అందజేస్తారు. అయితే, ఇదంతా ఓ చట్టబద్ధమైన మోసమంటూ ఈ కార్యక్రమానికి వ్యతిరేకంగా వాట్సప్లో కొన్ని సందేశం చక్కర్లు కొడుతోంది.
షో నిర్వాహకులు ఎస్ఎంఎస్ రూ. 15 వసూలు చేస్తున్నారని, లక్షల మంది నుండి కోట్ల వసూలు చేస్తున్నారు. అందులో లాటరీ పద్దతిలో ఒకరిని విజేతగా ఎంపిక చేస్తారు..... ఈ మాయలో పడి ఎంతో మంది పేదలు డబ్బులు పోగొట్టుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. లాటరీ టిక్కెట్లను బ్యాన్ చేసిన ప్రభుత్వాలు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయడం విచారకరం అంటూ ఓ మెసేజ్ వాట్సాప్ లో వైరల్ అయింది. ఇవన్నీ టీఆర్పీపై ప్రభావం చూపించే అవకాసం ఉందంటున్నారు.


Click it and Unblock the Notifications











