RIPTNR : ఇంత నిర్దయగా మంచివాళ్ళనే ఎందుకు.. మరెవరికి సాధ్యం కాదు.. ఐడ్రీమ్ చైర్మన్ ఎమోషనల్!
ప్రముఖ సినిమా జర్నలిస్ట్, నటుడు టీఎన్ఆర్ కరోనాతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియ చేస్తున్నారు. ఇక ఆయన పని చేస్తున్న సంస్థ ఐ డ్రీమ్ చైర్మన్ చిన్నా వాసుదేవ రెడ్డి టీఎన్ఆర్ మరణం గురించి స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే
Recommended Video

అలాంటి వ్యక్తే టీఎన్ఆర్
దేశం మొత్తం విపరీతమైన ఉత్పాతాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో దేవుడు ఇంత నిర్దయగా మంచివాళ్ళనే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నాడో అంతు చిక్కడం లేదు. వృత్తి పట్ల నిబద్ధత, లక్ష్యం పట్ల గౌరవం ఉన్న వాళ్ళను మనం అరుదుగా చూస్తుంటాం. అలాంటి వ్యక్తే తుమ్మల నరసింహారెడ్డి అని వాసుదేవ రెడ్డి అన్నారు. మీడియాతో పాటు అభిమానులు టీఎన్ఆర్ అనే బ్రాండ్ నేమ్ తో పిలుచుకునే మంచి వ్యక్తి ఈ రోజు మన మధ్య లేరనే వాస్తవాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉందని ఆయన అన్నారు.

జీవితంలో పోరాడి గెలిచి
జీవితంలో పోరాడి గెలిచిన టీఎన్ఆర్ కరోనా మహమ్మారితో పోరాటంలో అసువులు బాయడం మాటల కందని విషాదమన్న ఆయన ఏ రంగంలో అయినా గేమ్ చేంజర్స్ కొందరే ఉంటారు. అందులోనూ ఇంటర్వ్యూలలో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి సాంప్రదాయ పద్ధతికి స్వస్తి చెప్పి చరిత్ర సృష్టించడం టీఎన్ఆర్కే చెల్లిందని అన్నారు. జర్నలిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి సునిశితమైన సినీ విశ్లేషకుడిగా అతి తక్కువ సమయంలోనే పేరు తెచ్చుకున్న టీఎన్ఆర్ మా ఐడ్రీమ్ లో చేరాక అందించిన నిరుపమానమైన సేవలు ఎంత అమూల్యమో ఈ చిన్న సందేశంలో వివరించడం అసాధ్యం అని అన్నారు.

మరెవరికి సాధ్యం కాదు
గెస్టులకు స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కలిగిస్తూ షో టైటిల్ కు తగ్గట్టు వాళ్ళతో ఫ్రాంక్ గా మాట్లాడుతూ ఎవరినీ నొప్పించకుండా "Frankly With TNR" అంటూ విషయాలు రాబట్టుకోవడం మరెవరికి సాధ్యం కాదనేది అతిశయోక్తి కాదని ఆయన అన్నారు. టీఎన్ఆర్ పదులు వందలు కాదు వేలాది యాంకర్లకు స్ఫూర్తిగా నిలిచి సెలబ్రిటీ ఇంటర్వ్యూలలో ఓ బెంచ్ మార్క్ సెట్ చేయడం చరిత్ర పుటలలో శాశ్వతంగా నిలిచిపోతుందని వాసు దేవ రెడ్డి పేర్కొన్నారు.

విధికి కన్ను కుట్టడం దారుణం
ఒకపక్క సినిమాల్లో నటిస్తూ తనలో మరో కోణాన్ని ప్రపంచానికి గొప్పగా పరిచయం చేస్తూ అందివచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంటున్న తరుణంలో విధికి కన్ను కుట్టడం దారుణం అని అన్నారు. ఇంకా ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక ఉజ్వల తార ఇలా రాలిపోవడం లక్షలాది హృదయాలను గాయపరుస్తోందని ఆయన అన్నారు. ఐడ్రీమ్ లో తన ప్రస్థానాన్ని చివరిదాకా గొప్పగా నడిపించిన టీఎన్ఆర్ సంస్థ ఎదుగుదలలో క్రియాశీలక పాత్ర పోషించడం ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు.

నెల కాకముందే మమ్మల్ని ఇలా విడిచి
"వాసు గారూ 150వ ఇంటర్వ్యూ వర్మతో చేసాను 200వ ఇంటర్వ్యూకు మరో మంచి గెస్ట్ ను మాట్లాడాను,మీకు కూడా సర్ప్రైజ్ ఇస్తాను" అని చెప్పి నెల కాకముందే మమ్మల్ని ఇలా విడిచి వెళ్లడం భరించలేని విషాదాన్ని కలిగిస్తోందని అన్నారు. భౌతికంగా దూరమైనా టీఎన్ఆర్ చేసిన 189 ఇంటర్వ్యూల రూపంలో మన హృదయాలలో ఎప్పటికీ సజీవ స్థానం కలిగి ఉంటారని కల్మషం లేని ఆ చిరు నవ్వు, ఎవరినైనా ఆత్మీయంగా పలకరించే స్వచ్ఛత ఇకపై ప్రత్యక్షంగా ఉండకపోవచ్చు. కానీ టీఎన్ఆర్ అనే మూడక్షరాలు విన్న ప్రతిసారీ ఆయన ఎదురుగా నిలిచినట్లు ఉంటుందని అన్నారు.
మనోస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా
నిరంతరం సంస్థ మనుగడ కోసం కుటుంబ శ్రేయస్సు కోసం పాటుపడిన టీఎన్ఆర్ కు నివాళి ఘటిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. సదా మా హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయే గొప్ప స్థాయికి చేరుకున్న తుమ్మల నరసింహ రెడ్డి గారికి సెలవు చెబుతూ అంటూ ఆయన ఒక సుధీర్ధ పోస్ట్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.


Click it and Unblock the Notifications











