నేషనల్ అవార్డు చిత్రం హక్కులు...మాటీవి చేతికి
హైదరాబాద్: మూడు జాతీయ అవార్డులతో పాటు ఐదు అంతర్జాతీయ అవార్డులు పొందిన ‘నా బంగారు తల్లి' చిత్రం. రాజేశ్ టచ్రివర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎం.ఎస్. రాజేశ్, డాక్టర్ సునీతా కృష్ణన్ సంయుక్తంగా నిర్మించారు.
సిద్దిఖ్, అంజలీ పాటిల్ తండ్రీ కూతుళ్లుగా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఇక్కడ విడుదలై మంచి పేరు తెచ్చుకుంది. ఈ చిత్రం శాటిలైట్ హక్కులను మాటీవి వారు సొంతం చేసుకున్నారని సమాచారం.

ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
నిర్మాత సునీతా కృష్ణన్ మాట్లాడుతూ ‘‘ఇది అమ్మాయిలను బలవంతంగా వ్యభిచారంలోకి దింపే ‘హ్యూమన్ ట్రాఫికింగ్' నేపథ్యంలో తీసిన సినిమా అయినా ఎలాంటి అసభ్యతకూ, అశ్లీలతకూ చోటు లేకుండా ఫ్యామిలీ అంతా కూర్చొని చూసేవిధంగా దర్శకుడు రూపొందించారు. ఇది ఓ తండ్రీ కూతుళ్ల అందమైన అనుబంధాన్ని చాటిచెప్పే చిత్రం.
నిజ జీవిత సంఘటనలను ఆధారం చేసుకొని ఈ చిత్రాన్ని నిర్మించాం. ఈ సినిమా నిర్మాణానికి మా ఇంటిని కూడా తాకట్టు పెట్టాం. ఇందులోని తండ్రీ కూతుళ్ల పాత్రల కోసం తెలుగు చిత్రసీమలోని పలువురిని సంప్రదించినా, చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. చివరకు మహారాష్ట్ర అమ్మాయి అంజలీ పాటిల్, పేరుపొందిన మలయాళ నటుడు సిద్దిఖ్ ఆ పాత్రలను చేశారు.

ప్రఖ్యాత గాయని శ్రేయా ఘోషల్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇందులో పాటలు పాడారు. అలాగే సినిమా విడుదలకై ఎంతోమంది డిస్ట్రిబ్యూటర్లను సంప్రదించినా, ఎవరూ చేయడానికి ఇష్టపడలేదు. దాంతో అమల అక్కినేని ఇచ్చిన సలహాతో జనం నుంచి విరాళాలు సేకరించాం. 40 థియేటర్లలో విడుదల కోసం రూ. 15 లక్షలు వసూలు చేయాలని మేం ఆశిస్తే, మేం ప్రచారం ప్రారంభించిన కేవలం పది రోజుల్లోనే రూ. 32 లక్షలు వసూలవడం మమ్మల్నే ఆశ్చర్యపరిచింది. మొత్తం 543 మంది విరాళాలు ఇస్తే, వారిలో బెంగళూరుకు చెందిన ఒక్కరే రూ. 12 లక్షలు ఇచ్చారు'' అని చెప్పారు.
దర్శకుడు రాజేశ్ మాట్లాడుతూ ‘‘గతంలో వేరే భాషల్లో ఇలాంటి కథలతో సినిమాలు వచ్చినా, వాటిలో హింస, అశ్లీలత ఎక్కువగా ఉన్నాయి.
అలాంటివాటికి చోటు లేకుండా ఆరు నెలల కష్టంతో స్ర్కిప్ట్ తయారుచేసి పిల్లలు, పెద్దలు కలిసి చూసేవిధంగా సినిమా తీశాం. నిజ జీవితంలో వ్యభిచార కూపంలోకి బలవంతంగా వెళ్లి, బయటకు వచ్చిన అమ్మాయిల అనుభవాలనే తీసుకొని ఓ ఫ్యామిలీ థ్రిల్లర్గా దీన్ని రూపొందించాం'' అని తెలిపారు.


Click it and Unblock the Notifications











