‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ నుండి నాగార్జున ఔట్
హైదరాబాద్: ‘కౌన్ బనేగా కరోడ్ పతి' తెలుగు వెర్షన్ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు' గేమ్ షోలో నాగార్జున ఇంతకాలం అలరించారు. ఇప్పటికే షో 2 సీజన్లు పూర్తి చేసుకుంది. ఇకపై ఈ షోలో నాగార్జున కనిపించరు. ఇతర సినిమా ప్రాజెక్టులకు కమిట్ కావడం వల్ల నాగార్జున ఈ షో నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు.
తన నిర్ణయాన్ని నాగార్జున ఇప్పటికే తెలియజేసారు. నాగార్జున నిర్ణయంపై షో నిర్వాహకులు ఆందోళనలో పడ్డారు. నాగార్జున తరహాలో ఈ షోను హోస్ట్ చేసే వ్యక్తి దొరకడం కష్టమే అనే అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. మరి వచ్చే సీజన్ కోసం ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి.

గతంలో హిందీ వెర్షన్ ‘కౌన్ బనేగా కరోడ్ పతి' సమయంలోనూ ఇలాంటి సమస్యే ఏర్పడింది. తొలుత అమితాబ్ బచ్చన్ తో ప్రారంభమైన షో సూపర్ హిట్టయింది. ఆయన తప్పుకోవడంతో షారుక్ ఖాన్ తో చేసారు. అయితే షారుక్ తో చేసిన షో అట్టర్ ప్లాప్ అయింది. మళ్లీ అమితాబ్ బచ్చన్ తో చేయడంతో పుంజుకుంది.
ప్రస్తుతం నాగార్జున సినిమాలతో బిజీ కాబోతున్నారు. మీలో ఎవరు కోటీశ్వరుడు రెండో సీజన్ పూర్తి కావడంతో ఆయన తన తాజా మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయన' షూటింగులో పాల్గొంటారు. దీని తర్వాత కార్తితో కలిసి ఓ సినిమా, తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











