దిశా పటానీ ఇంటిపై కాల్పుల నిందితుల ఎన్కౌంటర్.. యూపీ సీఎం యోగి మార్క్ ట్రీట్మెంట్
ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఉన్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానీ ఇంటిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరపడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. పటానీ ఇంటిపై విచక్షణారహితంగా కాల్పులు జరపగా.. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. అయితే హై ప్రొఫైల్ కేసు కావడంతో హాట్ టాపిక్గా మారింది. చివరికి ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించి బాధితులకు న్యాయం చేస్తామన్నారు. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని సీఎం తేల్చి చెప్పారు. ఆయన హామీ ఇచ్చిన 24 గంటల్లోనే ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
పటానీ ఇంటిపై కాల్పులు
బరేలీలోని దిశా ఇంటి ముందు సెప్టెంబర్ 12 శుక్రవారం తెల్లవారుజామున కాల్పులు చోటు చేసుకున్నాయి. అందరూ గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా కాల్పుల శబ్ధం చోటు చేసుకోవడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఆ సమయంలో దిశా పటానీ అక్క, రిటైర్డ్ మేజర్ ఖుష్బూ పటానీ.. ఆమె తండ్రి, మాజీ డీఎస్పీ జగదీశ్ సింగ్ పటానీ, ఆమె తల్లి ఇంట్లో ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. అయితే దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ ఇటీవల ఓ వర్గాన్ని కించపరిచేలా మాట్లాడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే దిశా పటానీ ఇంటి వద్ద కాల్పులు జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ దాడి తమ పనేనని లారెన్స్ బిష్ణోయ్కి అత్యంత సన్నిహితుడు, మరో గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ ప్రకటించాడు. ప్రస్తుతం దిశా పటానీ ప్రస్తుతం వెలకమ్ టు జంగిల్, హోలీ గార్డ్స్ సాగాలో నటిస్తున్నారు.

ఆ రెండు గ్యాంగ్ల పనే
ఆర్మీలో పనిచేసిన దిశా పటానీ సోదరి.. ఖుష్బూ పటానీ ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రేమానంద్ మహారాజ్పై అనుచిత వ్యాఖ్యలు చేయడయే ఈ వివాదానికి కారణంగా తెలుస్తోంది. గ్యాంగ్స్టర్లు రోహిత్ గోద్రా, గోల్డీ బ్రార్ గ్యాంగ్లు ఆమెపై కక్షకట్టి కాల్పులకు తెగబడినట్లుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖుష్బూ ఈ ఘటనపై స్పందించారు. తనను తాను రక్షించుకోవడానికి ఓ డేటా కేబుల్ కూడా చాలని ఆమె హెచ్చరించారు. అత్యవసర సమయాల్లో మహిళలు తమను తాము రక్షించుకోవడానికి ఇంట్లోని సాధారణ వస్తువులను ఎలా ఉపయోగించవచ్చో ఇందులో ఆమె చూపించారు. ఇందుకోసం యుద్ధ విద్యలను నేర్చుకోవాల్సిన అవసరం లేదని సమయస్పూర్తి, తెగింపు వంటివి చాలని పేర్కొంది.
ఎవ్వరినీ వదిలిపెట్టమన్న యోగి
కేసు తీవ్రత నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. నిందితులను తగిన బుద్ధి చెబుతామని, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిగంటల్లోనే ఇద్దరు దుండగుల్ని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. పటానీ ఇంటిపై దాడి చేసిన దుండగుల కోసం ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ఫోర్స్, ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు వారికి తారసపడి కాల్పులకు దిగారు. పోలీసులు ఎదురుకాల్పులకు దిగడంతో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతులను రోహ్తక్లోని కహ్నికి చెందిన రవీంద్ర, సోనీపట్కు చెందిన అరుణ్గా గుర్తించారు. వీరిద్దరూ గోల్డ్రీ బ్రార్ గ్యాంగ్ సభ్యులని పోలీసులు చెబుతున్నారు.
చెప్పినట్లుగానే సీఎం చేశారు
ఎన్కౌంటర్లో నిందితులు హతం కావడం గురించి తెలుసుకున్న దశా పటానీ తండ్రి జగదీష్ సింగ్ పటానీ.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు ధన్యవాదాలు తెలిపారు. హామీ ఇచ్చిన మేరకు నిందితులపై సీఎం కఠిన చర్యలు తీసుకున్నారని జగదీష్ ఓ వీడియో విడుదల చేశారు. సీఎంతో తాను ఫోన్లో మాట్లాడానని, ఆయన నేతృత్వంలో యూపీ పోలీసులు భయరహిత సమాజం దిశగా అడుగులు వేస్తున్నారని జగదీష్ పటానీ కొనియాడారు.


Click it and Unblock the Notifications











