నిర్మాతగా మారిన తాప్సీ.. అవుట్ సైడర్ అంటూ క్రేజీగా బ్యానర్!
విభిన్నమైన చిత్రాలు, విలక్షణమైన పాత్రలతో రాణిస్తున్న తాప్సీ పన్ను నిర్మాతగా అవతారం ఎత్తారు. తాజాగా తన సొంత ప్రొడక్షన్ హౌజ్ అవుట్ సైడర్ ఫిల్మ్స్ అనే బ్యానర్ను ప్రారంభించారు. ప్రముఖ నిర్మాత, రచయిత, 20 ఏళ్లకుపైగా సినీ నిర్మాణ రంగంలో ఉన్న ప్రంజల్ ఖంద్దియాతో భాగస్వామ్యం అయ్యారు. గతంలో సూపర్ 30, 83, సూర్మ, పికూ, ముబాకరన్, అజహర్ చిత్రాలకు పనిచేశారు. తాజాగా తాప్సీ నటిస్తున్న రష్మీ రాకెట్ చిత్రాన్ని ప్రంజల్ నిర్మిస్తున్నారు.
అవుట్సైడర్ ఫిల్మ్స్ బ్యానర్ ప్రారంభించినట్టు తాప్సీ ఇన్స్టాగ్రామ్లో పోస్టు పెట్టారు. వ్యాపార సంస్థలు, మేనేజ్మెంట్ కంపెనీలు స్థాపించడం సహజంగానే జరిగిపోయాయి. 11 ఏళ్ల సినీ కెరీర్లో ప్రేక్షకులు, ఇండస్ట్రీ సహకారం లభించింది. నాకు లభించిన ప్రతిఫలాన్ని మళ్లీ ఇండస్ట్రీకి తిరిగి ఇచ్చేందుకు అవుట్ సైడర్స్ ఫిల్మ్స్ను స్థాపించాను. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి నా ప్రతిభను చాటుకొన్నాను. సినీ పరిశ్రమలో స్థిరపడాలనుకొనే కొత్త నటీనటులకు, క్రియేటివ్ పర్సన్కు సహకారం అందిస్తాను అని అన్నారు.

నా మాదిరిగానే ప్రంజల్ కూడా సినీ పరిశ్రమకు సంబంధం లేని వారే. అందుకే మా కంపెనీకి సార్థకంగా ఉండేలా బ్యానర్ పేరును అవుట్సైడర్ ఫిల్మ్స్ పెట్టాం అని తాప్సీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. తాప్సీ బ్యానర్లో థ్రిల్లర్ మూవీని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పటికే తాప్సీ ఓ వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీ, 7 ఏసేస్ పూణే అనే బాడ్మింటన్ టీమ్కు ఓనర్గా ఉన్నారు. ఇక తాప్సీ లూప్ లపేటా, రష్మీ రాకెట్, దోబారా, తదితర చిత్రాల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











