Disha Rape Case : చిక్కుల్లో రవితేజ, అల్లు శిరీష్, రకుల్, ఛార్మి.. మొత్తం 38 మీద కేసు.. అసలు ఏమైందంటే?
తెలుగు రాష్ట్రాలలో దిశ రేప్ కేసు ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2019 లో జరిగిన ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాలను మాత్రమే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ కేసు వ్యవహారంలో ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్, రవితేజ సహా చాలా మంది తెలుగు సినీ ప్రముఖులు చిక్కుల్లో పడ్డారు. అసలు వాళ్ళు ఎందుకు చిక్కుల్లో పడ్డారు? ఏం జరిగింది ? అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

దారుణంగా రేప్
దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారిన దిశ కేసు పూర్వపరాలలోకి వెళితే 2019లో నవంబర్ 27న హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో ప్రభుత్వ వెటర్నరీ వైద్యురాలు గ్యాంగ్ రేప్, హత్యకు గురైన సంగతి తెలిసిందే. తొండుపల్లి ఓఆర్ఆర్ జంక్షన్ దగ్గర పక్కా ప్రణాళికతో నలుగురు నిందితులు పార్క్ చేసిన స్కూటీని తీసుకునేందుకు రాత్రి 9 గంటల తర్వాత అక్కడికొచ్చిన దిశను అపహరించి లారీని అడ్డుగా పెట్టి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

వెంటనే ఎన్ కౌంటర్
ముక్కు, నోరు మూసి అత్యంత పాశవికంగా హత్య చేసి మృతదేహాన్ని లారీలోకి ఎక్కించారు. 30 నుంచి 40 నిమిషాల స్వల్ప కాలంలోనే ఇదంతా చేశారని కూడా తరువాత పోలీసులు వెల్లడించారు. అయితే సరిగ్గా కొద్ది రోజుల్లో కేసులో నలుగురు నిందితులను సీన్ రీ కన్ స్ట్రక్షన్ పేరుతో డిసెంబర్ 6 తెల్లవారుజామున ఘటనా ప్రదేశానికి తీసుకెళ్లారు. ఈ సమయంలో పోలీసులపై దాడి చేసి, పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితులను కాల్చి చంపినట్లు పోలీసులు ప్రకటన చేశారు. ఆ తర్వాత కేసులు నడుస్తున్నాయి అనుకోండి అది వేరే విషయం.

రవితేజ, నటి రకుల్ ప్రీత్ సింగ్ సహా 38 మందిపై
తాజాగా ఈ కేసు కారణంగా ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, టాలీవుడ్ నటుడు రవితేజ, నటి రకుల్ ప్రీత్ సింగ్ సహా 38 మంది పై మరో కేసు నమోదైంది. ఎందుకంటే పోలీసులు దిశా అనే పేరుపెట్టినా సరే బాధితురాలి పేరును సామాజిక మాధ్యమాల వేదికగా బహిర్గతం చేసినందుకు ప్రముఖులను అరెస్టు చేయాలని కోరుతూ ఢిల్లీ తీస్ హజారీ కోర్టులో న్యాయవాది గౌరవ్ గులాటీ పిటిషన్ దాఖలు చేశారు.

పోలీస్ స్టేషన్ లో మరో కేసు
అంతే కాక సెక్షన్ 228 ఏ కింద ప్రముఖులపై కేసు నమోదు చేయాలని సబ్జీ మండి పోలీసు స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు గౌరవ్. ఫిర్యాదు పరిగణనలోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, అజయ్ దేవ్గన్, అభిషేక్ బచ్చన్, ఫరాన్ అక్తర్, అనుపమ్ ఖేర్ సహా టాలీవుడ్ నటులు రవితేజ, అల్లు శిరీష్, నటి ఛార్మి పేర్లను ఫిర్యాదులో పేర్కొన్నారు గౌరవ్. హర్బజన్ సింగ్, శిఖర్ ధావన్, సైనా నెహ్వాల్ వంటి క్రీడా ప్రముఖుల మీద కూడా కేసు నమోదు చేయాలని కోరారు.

చిక్కులు తప్పవు
సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం రేప్ కేసులో బాధితులుగా ఉన్న వారి పేర్లు ఎవరూ బహిర్గత పరచకూడదు, ఈ విషయంలో మీడియా సైతం పరిమిథులకు లోబడే పని చేయాల్సి ఉంటుంది. కానీ ఊహించని విధంగా వీళ్లందరూ దిశ అసలు పేరు తో ఆమెకు సంతాపం తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఈ పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలోనే సదరు లాయర్ కోర్టుకు ఎక్కినట్లు గా తెలుస్తోంది. నిజానికి ఇది చాలా సీరియస్ కేసు కావడంతో సినీ సెలబ్రిటీలు సైతం చిక్కులు తప్పవు అనే విశ్లేషణ వినిపిస్తోంది


Click it and Unblock the Notifications











