వివాదంలో భీమ్లా నాయక్.. ''మనోభావాలు దెబ్బతిన్నాయి… ఆ సీన్ తొలగించండి' అంటూ ఫిర్యాదు
సినిమాను సినిమాగా చూడాలి. కానీ సినిమాల్లో సాధారణ సన్నివేశాలలో కూడా భూతద్దం పెట్టి వెతికికే పనిలో పడుతున్నారు కొంతమంది. సాధారణంగా కొన్ని సినిమాలు విడుదలైనప్పుడు అందులో ఫలానా సన్నివేశం మా మనోభావాలను దెబ్బ తీసింది అంటూ కొందరు వృత్తుల వారు, కొందరు కులాల వారు తెర మీద వస్తూ ఉంటారు. ఇప్పుడు అదే విధంగా కుమ్మరి వృత్తి వారు భీమ్లా నాయక్ సినిమా కారణంగా మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ తెర మీదకు వచ్చారు. అసలేమైంది? వారి మనోభావాలు దెబ్బ తినడానికి కారణం ఏమిటి అనే వివరాల్లోకి వెళితే..

అద్భుతమైన స్పందన
మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియం సినిమాను తెలుగులో 'భీమ్లా నాయక్' పేరుతో రూపొందించారు. పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా నటించిన ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీకి దర్శకత్వ పర్యవేక్షణ చేయడమే కాక స్క్రీన్ ప్లే సహా మాటలు కూడా అందించారు.

కాస్త డ్రాప్
ఈ సినిమాలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా రావు రమేష్, రవి వర్మ, మురళీ శర్మ, రఘుబాబు, చౌదరి, సముద్ర ఖని వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల తుఫాన్ సృష్టిస్తూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. సోమవారం నాడు మాత్రం కలెక్షన్స్ లో కాస్త డ్రాప్ కనిపించింది.

మనోభావాలు దెబ్బతినేలా
ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు భీమ్లా నాయక్ మూవీ వివాదాల్లో చిక్కుకుంది. తమ మనోభావాలు దెబ్బతినేలా సినిమాలో సన్నివేశాలను చిత్రీకరించారని ఆంధప్రదేశ్ లోని కుమ్మరి, శాలివాహన కార్పొరేషన్ ఛైర్మన్ ఎం.పురుషోత్తం ఆరోపించారు. అంతే కాదు తమ మనోభావాలను కించ పరిచేలా చిత్రీకరించిన ఆ సీన్ ను సినిమా నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్కు పురుషోత్తం ఫిర్యాదు కూడా చేశారు.

కాలితో తన్నినట్లు
పురుషోత్తం మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ , రానా మధ్యలో ఫైటింగ్ సీన్ లో చిత్రీకరించిన సన్నివేశం కుమ్మరులను కించపరిచేలా ఉందని చెప్పారు. పవన్, రానా ల మధ్య వచ్చే ఫైటింగ్ సన్నివేశంలో రానా కుమ్మరి చక్రాన్ని కాలితో తన్ని... దానిని తీసుకుని పవన్ పై దాడి చేసినట్లు చూపించారని పేర్కొన్నారు. తాము ఆ కుమ్మరి చక్రాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తామని.. దానిని కాలితో తన్నినట్లు చూపించడం తమను కించపరచమే కాదు.. కుమ్మరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని వ్యాఖ్యానించారు.
Recommended Video

పోలీసులకు ఫిర్యాదు
అందుకనే ఈ సన్నివేశం సినిమా నుంచి తొలగించే విధంగా చర్యలు తీసుకోలేని తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. భీమ్లా నాయక్ హీరోలైన పవన్, రానా, దర్శకుడు సాగర్, నిర్మాత చినబాబు పై చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. మరి ఈ విషయం మీద సినిమా యూనిట్ ఎలా స్పందిస్తుంది అనేది తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











