రావణాసుర కోసం రంగంలో ఆచార్య: మొదలైన రోజే రిలీజ్ డేట్ ప్రకటించిన రవితేజ
తెలుగు సినీ ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసే హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో మాస్ మహారాజా రవితేజ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ ఇదే పంథాను ఫాలో అవుతోన్న అతడు.. సినిమాల మీద సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే కొన్ని పరాజయాల తర్వాత గత ఏడాది ఆరంభంలో 'క్రాక్'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. అంతేకాదు, ఇది అతడి కెరీర్లోనే మంచి కలెక్షన్లను రాబట్టిన చిత్రంగానూ నిలిచింది. ఈ ఉత్సాహంతోనే రవితేజ వరుస పెట్టి ప్రాజెక్టులను లైన్లో పెట్టుకుంటున్నాడు. ఇలా ఇప్పటికే పలు సినిమాలను మొదలు పెట్టేశాడు.
'క్రాక్' హిట్ తర్వాత రవితేజ రమేశ్ వర్మ దర్శకత్వంలో వస్తున్న 'ఖిలాడి'ని చాలా రోజుల క్రితమే మొదలు పెట్టాడు. సస్పెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పెన్ స్టూడియోస్ సమర్పణలో హవీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇది ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కోవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా ఫిబ్రవరి 11కు వాయిదా పడింది. దీనితో పాటు రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' అనే సినిమాను కూడా మొదలెట్టాడు. శరత్ మండవ అనే దర్శకుడు రూపొందిస్తోన్న ఈ సినిమాను మార్చి 25న విడుదల చేయబోతున్నారు. ఇందులో దివ్యాన్షా కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ రెండు సినిమాలు ఇప్పటికే ప్రారంభం అయిపోయాయి. ఈ క్రమంలోనే త్రినాథరావు నక్కిన దర్శఖత్వంలో రవితేజ 'ధమాకా' అనే సినిమాను కూడా ప్రకటించాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇంకా ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో రవితేజ.. సుధీర్ వర్మ దర్శకత్వంలో 'రావణాసుర' అనే సినిమాను అనౌన్స్ చేశాడు. తాజాగా దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్లో జరిగాయి.
క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న 'రావణాసుర' మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలను సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన ఎంతో గ్రాండ్గా నిర్వహిస్తామని చిత్ర యూనిట్ కొద్ది రోజుల క్రితమే ప్రకటించింది. అందుకు అనుగుణంగానే తాజాగా ఈ కార్యక్రమాన్ని జరిపారు. దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి సినిమాను అధికారికంగా ప్రారంభించారు. దీనికి చిత్ర యూనిట్ సభ్యులందరూ హాజరయ్యారు. ఇక, ఈ సినిమాను దసరా కానుకగా 2022 సెప్టెంబర్ 30న విడుదల చేస్తున్నట్లు యూనిట్ ప్రకటించింది. మూవీ మొదలైన రోజే రిలీజ్ డేట్తో కూడిన పోస్టర్ను కూడా వదలడం విశేషం.

విభిన్నమైన కథతో రాబోతున్న 'రావణాసుర' ప్రీ లుక్ పోస్టర్కు అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా దీనిపై అప్పుడే అంచనాలు ఏర్పడ్డాయి. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ మీద అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా కలిసి నిర్మిస్తున్నారు. ఇందులో రవితేజ విభిన్నమైన పాత్రను చేస్తున్నట్లు ఫిలిం నగర్ ఏరియాలో ప్రచారం జరుగుతోంది. ఇందులో సుశాంత్, విష్ణు విశాల్ కీలక పాత్రలను చేస్తున్నారు. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను చిత్ర యూనిట్ తెలియజేయాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











