టాలీవుడ్లో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత
తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకొన్నది. గత కొద్దికాలంగా సినీ ప్రముఖుల మరణవార్తతో టాలీవుడ్ తీవ్ర దిగ్బ్రాంతికి గురవుతున్నది. కైకాల సత్యనారాయణ, జమున లాంటి లెజెండరీ మరణ వార్తల నుంచి తేరుకోక ముందే మరో సీనియర్ దర్శకుడు సాగర్ కన్నుమూశారు. ఆయన మరణవార్తకు సంబంధించి వివరాలు, ఆయన కెరీర్కు సంబంధించిన విషయాల్లోకి వెళితే..
తెలుగు సినిమా పరిశ్రమలో పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకుడిగా సాగర్ పనిచేశారు. పలువురు స్టార్ హీరోలను డైరెక్ట్ చేసిన అనుభవం ఉంది. గత కొద్దికాలంగా సాగర్ వృద్దాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన వైద్యులు పర్యవేక్షణలో చికిత్స పొందుతూ అనారోగ్యం నుంచి కోలుకొన్నట్టే కనిపించారు. అయితే ఫిబ్రవరి 2వ తేదీన ఉదయం 6 గంటల ప్రాంతంలో చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు అని ఆయన కుమారుడు చందూ మీడియాకు తెలిపారు. ఆయన మరణవార్తతో సినీ రంగ ప్రముఖులు విషాదంలో మునిగిపోయారు. ఆయన మృతికి స్నేహితులు, సన్నిహితులు, సినీ రంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
దర్శకుడు సాగర్ అసలు పేరు విద్యాసాగర్ రెడ్డి. సాగర్ 1952 మార్చి 1 తేదీన కృష్ణా జిల్లాలో జన్మించారు. ఉన్నత విద్య కోసం విజయవాడలో గవర్నర్ పేట నుంచి కుటుంబ సమేతంగా మద్రాసుకు షిప్ట్ అయ్యారు. మద్రాసులో తేనాంపేటలో ఉంటూ సినీ పరిశ్రమలోకి ఎడిటర్గా అడుగుపెట్టారు. ఆ తర్వాత దర్శకుడిగా మారారు. సూపర్ స్టార్ కృష్ణకు అత్యంత సన్నిహితుడిగా మారారు. దాదాపు 30 చిత్రాలకు దర్శకత్వం వహించారు. రామసక్కనోడు సినిమాకు నంది అవార్డులు లభించాయి.

సాగర్ కెరీర్ విషయానికి వస్తే.. స్టూవర్ట్పురం దొంగలు, డాకు, రాకాసిలోయ, చార్మినార్, వజ్రాస్త్ర, అన్వేషణ, అమ్మదొంగ, కార్మిక, భయానక, ఓసీ నా మరదల, జగదేక వీరుడు, అమ్మ అమ్మనీ చూడాలని ఉంది. దాడి చిత్రాలకు దర్శకత్వం వహించారు. సూపర్ స్టార్ కృష్టతో తీసిన అమ్మదొంగ చిత్రం, శోభన్ బాబుతో రామ సక్కనోడు చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొన్నది.
ఇదిలా ఉండగా, సాగర్ అంత్యక్రియలను బుధవారం సాయంత్రం చెన్నైలో నిర్వహించే అవకాశం ఉంది అని కుటుంబ సభ్యులు తెలిపారు.


Click it and Unblock the Notifications











