టాలీవుడ్పై టికెట్ రేట్ల దెబ్బ.. నార్మల్ ధరకే మేజర్.. దిగి వచ్చిన మహేశ్ బాబు, నిర్మాతలు
ఇండియాలో ఏ సినీ పరిశ్రమలో లేని విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో టికెట్ రేట్ల పెంపు వ్యవహారం భారీ వివాదానికి దారి తీసింది. టికెట్ రేట్ పెంచుకోనే అధికారం నిర్మాతలకు ఉందనే అంశంపై ఏకంగా ప్రభుత్వాలతో సినీ వర్గాలు అమీతుమీ తేల్చుకొనేందుకు సిద్ధపడ్డారు. తెలంగాణ విషయం పక్కన పెడితే.. ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్ల పెంపు వ్యవహారం గందరగోళంగా మారింది. ఈ నేపథ్యంలో టికెట్ రేట్ల పెంపు వ్యవహారంలోకి మరోసారి వెళితే..

లాక్డౌన్ తర్వాత టికెట్ రేట్ల వివాదం
లాక్డౌన్ తర్వాత సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడంపై ఏపీ ప్రభుత్వానికి, తెలుగు సినిమా పరిశ్రమకు మధ్య ప్రతిష్టంభన చోటుచేసుకొన్నది. ఆ వివాదం చిలికి చిలికి గాలివానగా మారడం, అది రాజకీయ రంగు పులుముకోవడంతో మరింత ఝటిలమైంది. ఆ తర్వాత సినీ పెద్దలతో ప్రభుత్వం జరిపిన చర్చల ద్వారా వారి మధ్య రాజీ కుదిరింది. అయితే టికెట్ రేట్ల పెంపు వ్యవహారం ప్రస్తుతం సినీ నిర్మాతల పక్కలో బాంబుగా మారినట్టు కనిపిస్తున్నది. అందుకే మళ్లీ సాధారణ రేట్లకే సినిమాను చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సినీ నిర్మాతలు యూటర్న్ తీసుకొంటున్నట్టు కనిపిస్తున్నది.

ప్రేక్షకులు ముఖం చాటేసే పరిస్థితి
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ఆమోదంతో టికెట్ రేట్లు పెంచుకోవచ్చనే విషయం నిర్మాతల్లో ఆనందం విరిసేలా చేసింది. అయితే ఆ ఆనందం ఎక్కువ రోజులు కనిపించలేదనేది ఇటీవల విడుదలైన అగ్ర హీరోల సినిమా కలెక్షన్లు స్పష్టం చేశాయి. భారీ రేట్లు ఉండటంతో ప్రేక్షకులు సినిమా థియేటర్లకు ముఖం చాటేసే పరిస్థితి ఏర్పడింది. దాంతో అసలికే మోసం వస్తుందని తెలుసుకొన్న నిర్మాతలు తమ తప్పును సరిద్దిదుకొనేందుకు సిద్దమవుతున్నారు. సాధారణ టికెట్ రేట్లకే విడుదలైన అఖండ, పుష్ప, వకీల్ సాబ్, భీమ్లా నాయక్ (ఏపీలో) చిత్రాలు భారీగా కలెక్షన్లు సాధించాయనే వాస్తవాన్ని ఇప్పుడే గ్రహిస్తున్నారు.

నిర్మాతల ఆవేదనతో
అయితే టికెట్ రేట్ల పెంపు విషయానికి వస్తే.. లాక్డౌన్ కారణంగా సినిమాలు షూటింగుకు నోచుకోకపోవడంతో తమపై ఆర్థికంగా భారీ భారం పడిందని నిర్మాతలందరూ ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాతల ఆవేదనలో ఎలాంటి తప్పు లేదు. బడ్జెట్ పెరగడం, వడ్డీలు తడిసి మోపెడు కావడమనే వారి వాదన సమంజసంగానే కనిపించింది. అయితే లాక్డౌన్ కారణంగా కేవలం నిర్మాతలే కాదు.. సామాన్య జనం.. సగటు సినీ ప్రేక్షకుడు కూడా అంతే ఇబ్బంది పడ్డారు. ఆర్థికంగా చితికి పోయారు అనే చిన్న లాజిక్ను నిర్మాతలు మరిచిపోవడం బాధాకరం అని మరో వర్గం అభిప్రాయపడుతున్నది.

మేజర్ టికెట్ రేట్ల తగ్గింపు ప్రకటన
టికెట్ రేట్లు పెంచితే అసలికే ఎసరు పెడుతుందనే విషయం ఇటీవల విడుదలైన ఆచార్య, సర్కారు వారి పాట పరోక్షంగా చెప్పేశాయి. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా మారి తీసిన ప్యాన్ ఇండియా మూవీ మేజర్ సినిమా విషయంలో గతంలో చేసిన తప్పును సరిద్దిద్దుకొనే ప్రయత్నం చేసినట్టు కనిపించింది. మేజర్ సినిమా టికెట్ రేటును తెలంగాణలో సింగిల్ స్క్రీన్ను 150 రూపాయలుగా, ఆంధ్రప్రదేశ్లో 147 రూపాయలుగా నిర్ణయించారు. ఇక మల్టీప్లెక్స్లో తెలంగాణలో 195 రూపాయలు, ఏపీలో 177 రూపాయలుగా నిర్ణయించారు.

మేజర్ సినిమా గురించి
మేజర్ సినిమా విషయానికి వస్తే.. 26/11 ముంబైపై దాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథగా ఈ సినిమా తెరకెక్కింది. మహేష్ బాబుకు చెందిన జీఎంబీ ఎంటర్టైన్మెంట్, సోని పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఏ+ఎస్ మూవీస్ బ్యానర్లపై నిర్మించారు. అడివి శేషు, శోభితా ధూళీపాల, ప్రకాశ్ రాజ్, రేవతి, మురళీశర్మ కీలక పాత్రల్లో నటించారు. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించిన ఈ సినిమాకు శశి కిరన్ తిక్క దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications











