శెభాష్ స్టాలిన్ అంటూ నిన్న పవన్.. నేడు స్వయంగా వెళ్లి కలిసిన చిరు.. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ !
మెగాస్టార్ చిరంజీవి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను బుధవారం చెన్నైలో కలిశారు. ఈ సమయంలో ప్రముఖ నటుడు, స్టాలిన్ కుమారుడు, ఎమ్మెల్యే అయిన ఉదయనిధి స్టాలిన్ కూడా ఉన్నారు. స్టాలిన్ ముఖ్యమంత్రి అయినందుకు చిరు అభినందనలు తెలిపారు. అయితే నిన్న రాత్రి స్టాలిన్ ను ప్రశంసిస్తూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడం, ఉదయాన్నే చిరంజీవి కలవడం సంచలనంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

మునుపెన్నడూ లేని విధంగా
తమిళనాడు సీఎం స్టాలిన్ పరిపాలన చర్చనీయాంశం అవుతోంది. ఈ వ్యవహారం తమిళనాదుకే పరిమితం కాకుండా చుట్టూ పక్కల రాష్ట్రాలలో కూడా చర్చనీయాంశం అవుతోంది. ఎందుకంటే తమిళనాడు రాజకీయాల్లో కక్షా రాజకీయాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. నాటి జయలలిత- కరుణానిధి ఉన్నంత వరకూ ఇవి సాధారణంగా జరుగుతూ ఉండేవి. కానీ కరుణానిధి వారుసుడు స్టాలిన్ మాత్రం వాటన్నింటినీ వదిలేసి కేవలం అభివృద్ధిపైనే దృష్టి పెట్టారు.

కీలక ప్రకటన
మరో విషయం ఏమిటంటే తమిళనాడులో నేతలకు వ్యక్తి పూజ అధికం, మనం జయలలిత పాత వీడియోలు చూస్తే ఆమెకు సాష్టాంగ ప్రమాణాలు చేసేవాళ్ళు కోకొల్లలు, అలాంటిది ఇప్పుడు స్టాలిన్ కనీసం ఎవరైనా తనను అసెంబ్లీ వేదికగా పొడిగినా సరే చర్యలు తీసుకుంటానని ప్రకటన చేయడమే కాక ఇక మీదట అలాంటివి ఉంటే ఊరుకోనని భారీ వార్నింగ్ ఇచ్చారు.

చర్చనీయాంశంగా
ఇది కాక ఆయన అన్నాడీఎంకే రంగులు, జయలలిత, మాజీ సీఎం పళనిస్వామి బొమ్మలు ఉన్న స్కూల్ బ్యాగులను పంపిణీ చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వం తయారు చేయించిన వాటిని సీఎం తీసి పక్కన పడేయమంటారో లేక పైన తన బొమ్మో వేయమని అంటారని అధికారులు అనుకున్నా వాటిని విద్యార్థులందరికీ పంపిణీ చేయాలని స్టాలిన్ ఆదేశించారు. ఈ రెండు ఘటనలు ఇటీవల వెలుగులోకి రాగా మరికొన్ని విషయాలు అంతకుముందు నుంచి చర్చనీయాంశంగా మారాయి.

తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్
స్టాలిన్ వైఖరి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ అవుతోండగా నిన్న పవన్ కళ్యాణ్ ప్రసంశలు, ఇవాళ చిరంజీవి కలయిక ఆసక్తి రేకెత్తిస్తోంది. ''శ్రీ స్టాలిన్ గారికి శుభాభినందనలు, ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి రావటానికి రాజకీయం చెయ్యాలి కానీ - ప్రభుత్వంలోకి వచ్చాక రాజకీయం చెయ్యకూడదు. దీన్ని మీరు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు. మీ పరిపాలన, మీ ప్రభుత్వ పని తీరు మీ ఒక్క రాష్ట్రానికే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాలకు, అన్ని రాజకీయ పార్టీలకు మార్గదర్శకం... స్ఫూర్తిదాయకం. మీకు మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియచేస్తున్నాను. మీకు నా శుభాకాంక్షలు అంటూ పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. ఇక చిరంజీవి నేడు చెన్నైలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ను కలిశారు. స్టాలిన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన చిరంజీవి ఆయనను అభినందించారు. స్టాలిన్ కు పుష్పగుచ్చం అందించి శాలువా కప్పారు. ఈ సందర్భంగా అక్కడ స్టాలిన్ తనయుడు ఉదయనిధి కూడా ఉన్నారు.

ఆనందంగా ఉంది
గౌరవనీయులైన ముఖ్యమంత్రి స్టాలిన్ ని కలవడం ఆనందంగా ఉంది, పార్టీ శ్రేణుల సాయంతో అనేక ప్రయోజనకరమైన కార్యక్రమాలతో రాజనీతిజ్ఞుడిగా ఎదిగినందుకు, విజన్ & అంకితభావంతో ప్రజల నాయకుడిగా ఉన్నందుకు మరియు కోవిడ్ పరిస్థితిలో సమర్థవంతమైన పరిపాలన అందించినందుకు ఆయనని అభినందించానని చిరంజీవి సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇక చిరంజీవి కుటుంబానికి మొదటి నుండి స్టాలిన్ కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. ఎందుకంటే చిరంజీవి తమిళనాడుతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు, ఆయన మద్రాస్లో తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించాడు మరియు దాదాపు 25 సంవత్సరాలు మద్రాస్ నగరంలోనే నివసించారువారు.


Click it and Unblock the Notifications











