మా ప్రతిష్ఠను దిగజార్చేందుకు ప్రయత్నం.. మంచు ఫ్యామిలీ రియాక్షన్
Mohan Babu University Controversy: ప్రముఖ విద్యాసంస్థ మోహన్ బాబు ప్రైవేట్ యూనివర్సిటీ (MBU)కి భారీ ఎదురు దెబ్బ తగిలింది. విద్యార్ధుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం, ఆదాయాన్ని వెల్లడించకపోవడంపై ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (APHERMC) భారీ చర్యలు తీసుకుంది. ఏకంగా రూ.15 లక్షలు జరిమానా విధించింది. అంతేకాదు, విద్యార్థుల నుండి అదనంగా వసూలు చేసిన రూ. 26.17 కోట్లు 15 రోజుల్లో తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు సెప్టెంబర్ 17న కమిషన్ ఆదేశాలు జారీ చేయగా.. ఆ వివరాలను వెబ్సైట్లో ఉంచింది. అంతేకాకుండా వరుస అవకతవకలకు పాల్పడుతున్న వర్సిటీ గుర్తింపు రద్దు చేయాలని ప్రభుత్వానికి ఉన్నత విద్యా నియంత్రణ కమిషన్ సిఫార్సు చేసింది.
ఈ పరిణామాల తర్వాత యూనివర్సిటీ తరఫున హైకోర్టును ఆశ్రయించిన మంచు విష్ణు, కమిషన్ ఆదేశాలపై మూడు వారాలపాటు స్టే మంజూరు చేయించుకున్నారు. కేసు ఈ నెల 14న విచారణకు రానుంది. మోహన్ బాబు యూనివర్సిటీ (MBU)పై ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (APHERMC) చేసిన సిఫార్సులపై మీడియా లో వస్తున్న వార్తలపై విశ్వవిద్యాలయం ప్రో ఛాన్సలర్ విష్ణు మంచు అధికారిక ప్రకటన విడుదల చేశారు.

మంచు విష్ణు వివరణ
మోహన్ బాబు యూనివర్సిటీ ప్రో-ఛాన్సలర్ విష్ణు మంచు అధికారిక ప్రకటన విడుదల చేశారు. "APHERMC సిఫార్సులు కేవలం సిఫార్సులు మాత్రమే. ఈ విషయం ప్రస్తుతం హైకోర్టులో విచారణలో ఉంది. అయినా సరే కమిషన్ కోర్టు ఉత్తర్వును ధిక్కరించి తమ వెబ్సైట్లో వివరాలు ఉంచడం విచారకరం. మోహన్ బాబు యూనివర్సిటీ ఎల్లప్పుడూ నైతికతతో ముందుకు సాగుతుంది. కొంతమంది మీడియా వర్గాలు ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారు," అని తెలిపారు. 'మోహన్ బాబు యూనివర్సిటీ నేడు భారతదేశంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థలలో ఒకటిగా నిలించింది. రాయలసీమను ఉన్నత విద్యకు గుర్తింపు పొందిన కేంద్రంగా మార్చడంలో MBU కీలక పాత్ర పోషిస్తోంది. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న యూనివర్సిటీగా రికార్డు క్రియేట్ చేసింది. ఇది ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీలకు సాధ్యపడని స్థాయి విజయమని గర్వంగా చెప్పగలం " అని తెలిపారు.
విశ్వవిద్యాలయ ప్రతిష్ఠకు భంగం
విష్ణు మంచు ఇంకా మాట్లాడుతూ "1992లో శ్రీ విద్యానికేతన్ ట్రస్ట్ స్థాపించినప్పటి నుండి మేము సామాజిక బాధ్యతతో ముందుకు సాగుతున్నాం. పేద విద్యార్థులకు ఉచిత విద్య, పోలీసు, సైనిక సిబ్బంది పిల్లలకు స్కాలర్షిప్లు, అనాథ పిల్లలకు సంరక్షణ అందిస్తున్నాం. మోహన్ బాబు యూనివర్సిటీ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. పెన్ స్టేట్ యూనివర్సిటీ (USA), RWTH ఆకెన్ యూనివర్సిటీ (జర్మనీ), విస్కాన్సిన్ యూనివర్సిటీ (USA) వంటి విదేశీ యూనివర్సిటీలతో జాయింట్ ప్రోగ్రాములు ప్రారంభించాం," అని పేర్కొన్నారు.
తల్లిదండ్రులకు హామీ
తల్లిదండ్రులు, విద్యార్థులు విశ్వసించవలసిందిగా కోరుతూ... "మా ఛాన్సలర్ డాక్టర్ ఎమ్. మోహన్ బాబు గారి మార్గదర్శకత్వంలో ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు కట్టుబడి ఉన్నాం" అని విష్ణు మంచు స్పష్టం చేశారు. మొత్తంగా మోహన్ బాబు యూనివర్సిటీలోని అవకతవకల ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఒకవైపు APHERMC కఠిన చర్యలు తీసుకుంటుండగా, మరోవైపు మంచు ఫ్యామిలీ తమ యూనివర్సిటీ ప్రతిష్ఠను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. హైకోర్టు విచారణ తర్వాత ఈ వివాదానికి తుది తీర్పు రానుంది.


Click it and Unblock the Notifications











