OG నిర్మాతతో విభేదాలు.. బహిరంగ లేఖతో డైరెక్టర్ సుజిత్ కుండబద్దలు!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన OG చిత్రం 2025 సంవత్సరంలో సంచలన విజయాలు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా రిలీజ్ ఆలస్యమైనప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కనకవర్షం కురిపించింది. ఈ సినిమా విజయవంతమైన నేపథ్యంలో దర్శకుడు సుజిత్, నిర్మాత డీవీవీ దానయ్య మధ్య విభేదాలు నెలకొన్నాయంటూ సోషల్ మీడియాలోను, మీడియాలోను వివాదాస్పద అంశాలు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో వివాదంపై దర్శకుడు సుజిత్ బహిరంగ లేఖను విడుదల చేసి వాస్తవాన్ని చెప్పేందుకు ప్రయత్నించారు. అసలు వివాదం ఏమిటి? సుజిత్ ఏం వివరణ ఇచ్చాడు? అనే విషయాల్లోకి వెళితే..
పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యంగా పూర్తయింది. ఈ సినిమా నిర్మాణంలో నిర్మాత డీవీవీ దానయ్య అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు. అయితే ఈ సినిమా నిర్మాణ విషయంలో నిర్మాత, సుజిత్కు మధ్య 6 కోట్ల రూపాయల మేర వివాదం నెలకొన్నది. వారి మధ్య విభేదాలు చోటు చేసుకొన్నాయి అనే విషయం ఫిలిం సర్కిల్స్లో భారీగా ప్రచారమైంది. డీవీవీ, సుజిత్ మధ్య నెలకొన్న వివాదం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.

OG సినిమా ప్రయాణం గురించి ఇప్పటికే చాలా విషయాలు బహిరంగంగానే చెప్పాను. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు చిత్ర యూనిట్లో కుదిరిన అగ్రిమెంట్, ఉన్న అవగాహన చాలా గొప్పది. మా మధ్య ఉన్న సమన్వయంతోనే ఆ సినిమాను సక్సెస్ఫుల్గా పూర్తి చేశాం. నాపై నిర్మాతకు ఉన్న నమ్మకం, నా చిత్ర యూనిట్ చూపించిన సహకారం నా మాటల్లో చెప్పలేను. ఇప్పటికీ నైతికంగా నన్ను ఎంతో స్ట్రాంగ్గా మార్చింది అని సుజిత్ తన లేఖలో పేర్కొన్నారు.
ఓజీ సినిమా ప్రయాణం అంత తేలికైంది కాదు. ఈ సినిమా నిర్మాణం విషయంలో తలెత్తిన సవాళ్లను అధిగమించడం కేవలం అందరి కమిట్మెంట్ వల్లే సాధ్యమైంది. ప్రతీ ఒక్కరి కమిట్మెంట్ను గౌరవించాల్సిందే. ఆ తర్వాత ఈ సినిమాపై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ చూపించిన ప్రేమ, ఆదరణ చాలా గొప్పగా అనిపించింది. నాకు గొప్ప అనుభూతిని పంచింది. ఇలాంటి గొప్ప సినిమాను అందించడంలో సహకరించిన దానయ్య గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను అని దర్శకుడు సుజిత్ తన లేఖలో వివరించారు. ఈ సినిమా విషయంలో వస్తున్న అవాస్తవ ప్రచారాలను ఆయన తిప్పి కొట్టే విధంగా లెటర్ను రిలీజ్ చేశారు.
ఓజీ కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ సినిమా ఇండియాలో భారీగా వసూళ్లను సాధించింది. కేవలం తెలుగు వెర్షన్ సినిమా మాత్రమే రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రం తెలుగులో 235 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్లో ఈ చిత్రం 65 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.


Click it and Unblock the Notifications











