ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి కరోనాపాజిటివ్.. త్వరగా కోలుకోవాలని పవన్ కల్యాణ్ ప్రార్థన
దేశవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. సాధారణ పౌరుల నుంచి రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు కరోనావైరస్ బారిన పడుతున్నారు. పార్లమెంట్లో విధులు నిర్వహించే సిబ్బందిలో ఏకంగా 875 మంది కోవిడ్ బారిన పడినట్టు కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు పేర్కొన్నాయి. కొద్ది రోజులుగా పార్లమెంట్లో పనిచేసే 2847 మందికి కరోనావైరస్ టెస్టులు జరుపగా.. 875 మందికి కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. ఇలాంటి వార్తల మధ్య ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు కూడా కరోనావైరస్ బారిన పడ్డారు. హైదరాబాద్లో ఉన్న ఆయనకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది.

తనకు కరోనావైరస్ పాజిటివ్ అనే విషయాన్ని వెంకయ్య నాయుడు భారత ఉపరాష్ట్రపతికి సంబంధించిన ట్విట్టర్ ఖాతా నుంచి వెల్లడించారు. హైదరాబాద్లోని ఉన్న వెంకయ్య నాయుడు గారికి కరోనావైరస్ పాజిటివ్ అని వైద్యులు నిర్ధారించారు. వారం రోజులపాటు స్వీయ గృహ నిర్బంధాన్ని పాటించనున్నారు. తనతో సన్నిహితంగా మెదిలిన వారు కరోనావైరస్ పరీక్షలు చేసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోండి అని ట్వీట్లో వెల్లడించారు.
కరోనావైరస్ బారిన పడిన ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు త్వరగా కోలుకోవాలని జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ భగంతుడిని ప్రార్థించారు. ఓ ప్రకటనను విడుదల చేస్తూ.. గౌరవ ఉప రాష్ట్రపతి శ్రీ ఎమ్.వెంకయ్య నాయుడు గారు కరోనాకు గురి కావడం విచారకరం. శ్రీ వెంకయ్య నాయుడు గారు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. సంపూర్ణ ఆరోగ్యవంతులై దేశ ప్రజల సేవలో నిమగ్నం కావాలని ఆకాంక్షిస్తున్నాను అని పవన్ కల్యాణ్ ప్రకటనలో తెలిపారు.


Click it and Unblock the Notifications











