కైకాల సత్యనారాయణ మృతి... చెంచాగిరి, డ్రామాలు అంటూ పోసాని సంతాపం
టాలీవుడ్ లెజెండరీ యాక్టర్లలో ఒకరైన కైకాల సత్యనారాయణ శకం తెలుగు సినిమా పరిశ్రమలో ముగిసిపోయింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం (డిసెంబర్ 23వ తేదీ) కన్నుమూశారు. దాదాపు 6 దశాబ్దాలకుపైగా, 777 చిత్రాల్లో నటించిన ఆయన ఇక లేరనే విషయం తెలుగు సినీ వర్గాలు, ప్రేక్షకులకు జీర్ణించుకోలేని విషయంగా మారింది. ఆయన మరణంపై ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళీ స్పందిస్తూ..
చెంచాగిరి చేయకుండా, డ్రామాలు ఆడకుండా నిజాయితీగా బ్రతికిన వాడు. నీతిగా ప్రవర్తించిన వాడు. కాలం ఉన్నంతకాలం కాకపోయినా.. సినీ కళాకారుడు బతికి ఉన్నంత కాలం ఉండే వ్యక్తి కైకాల సత్యనారాయణ. ఆయనకు నా జోహార్ అంటూ ఓ వీడియో సందేశంలో పోసాని కృష్ణమురళీ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. అయితే ఆయన తనదైన శైలిలో సంతాపం ప్రకటించడం చర్చనీయాంశమైంది.

ఎలాంటి సందర్భంలోనైనా అతిగా, తీవ్రమైన పదజాలాన్ని వాడే పోసాని కృష్ణమురళీ తన నైజాన్ని మానుకోలేకపోయారు. టాలీవుడ్ లెజెండ్ కైకాల సత్యనారాయణ మరణంపై ఆయన స్పందించిన తీరు కొంత ఆశ్చర్యం, అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. వెట్టిచాకిరి, డ్రామాలు ఆడేవారు ఉన్నారని చెప్పడం పోసాని ఉద్దేశమేనా అనే చర్చకు దారి తీసింది. మరణం సమయంలో కూడా ఇలా అతిగా మాట్లాడటం ఎంత వరకు సమంజసం అని సినీ, మీడియా వర్గాలు వ్యక్త చేస్తున్నాయి. ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్గా పోసాని కృష్ణమురళీ పరిస్థితులను బేరీజు వేసుకొని బాధ్యతాయుతంగా మాట్లాడాల్సింది అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











