200 కోట్లు ఇవ్వాల్సిందే.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మపై ‘హనుమాన్’ నిర్మాత ఫిర్యాదు.. అసలేం జరిగింది?
హనుమాన్ సినిమా పాన్ ఇండియా రేంజ్లో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ( Prasanth Varma). ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో బ్లాక్బస్టర్ హిట్ కావడంతో స్టార్ డైరెక్టర్ల సరసన నిలిచారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. అయితే ఆ విజయం తర్వాతే ఎన్నో అవకాశాలను అందుకున్నారు. భారీ కథలను లైన్ లో పెట్టారు. కానీ, తాజాగా దర్శకుడు ప్రశాంత్ వర్మపై హనుమాన్' నిర్మాత నిరంజన్ రెడ్డి ఫిల్మీ ఛాంబర్ లో ఫిర్యాదు చేశారు. ఒకటి కాదు.. రెండు కాదు 200 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేస్తూ ఫిర్యాదు చేశారు. అసలే జరిగిందంటే?
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'హనుమాన్' సినిమా తెలుగు సినిమా కొత్త చరిత్రను రాసింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ₹295 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ విజయంతో దర్శకుడు ప్రశాంత్ వర్మకు భారీ క్రేజ్ వచ్చింది. అయితే అదే సినిమా తర్వాత ఆయన, నిర్మాత నిరంజన్ రెడ్డి మధ్య ఆర్థిక విభేదాలు మొదలయ్యాయి. తాజాగా ఈ ఇద్దరూ ఒకరిపై మరొకరు తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్కు లేఖలు సమర్పించడంతో అసలు వివాదం బయటపడింది.

నిరంజన్ ఆరోపణలు
హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నదాని ప్రకారం ప్రశాంత్ వర్మ, అధీర, మహాకాళి, జై హనుమాన్, బ్రహ్మరాక్షస సినిమాలు తన బ్యానర్పై డైరెక్ట్ చేస్తానని హామీ ఇచ్చి రూ. 10.34 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారని తెలిపారు. అంతేకాక, ప్రశాంత్ సూచనతో మరో సినిమా ఆక్టోపస్ నిర్మించేందుకు ఆయన రూ. 10.23 కోట్లు ఖర్చు పెట్టారని పేర్కొన్నారు. అయితే ఆ సినిమాకు సంబంధించి అవసరమైన NOC (No Objection Certificate) కూడా ఇప్పించలేదని ఆరోపించారు.
నిరంజన్ ఫిర్యాదులో మరో సెన్సేషన్ ఏమిటంటే.. ప్రశాంత్ వర్మ తనతో ఒప్పందం చేసుకున్న అధీర, మహాకాళి సినిమాలను తన బ్యానర్పై కాకుండా RKD స్టూడియోస్ పేరుతో ప్రకటించారని, అలాగే జై హనుమాన్, బ్రహ్మరాక్షస సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్, హోంబలే ఫిలిమ్స్ బ్యానర్లపై తీసుకెళ్తున్నారని తెలిపారు.
రూ. 200 కోట్ల పరిహారం
ఈ పరిణామాలన్నింటితో తాను భారీగా నష్టపోయానని నిరంజన్ పేర్కొన్నారు. ప్రశాంత్ వర్మ నుంచి తాను చెల్లించిన రూ. 20.57 కోట్ల అడ్వాన్స్ను 36% వడ్డీతో తిరిగి ఇవ్వాలని, అదనంగా రూ. 200 కోట్ల నష్టపరిహారం (Loss of Business Opportunity) ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాక, ప్రస్తుతం కొనసాగుతున్న అధీర, మహాకాళి, జై హనుమాన్, బ్రహ్మరాక్షస, ఆక్టోపస్ చిత్రాలను ఆపివేయాలని, తన ఆర్థిక పరిష్కారం క్లియర్ అయ్యే వరకు వాటిపై ఎలాంటి నిర్మాణం జరగరాదని ఫిలిం చాంబర్ను కోరారు.
ప్రశాంత్ వర్మ కౌంటర్ ఫిర్యాదు
ప్రశాంత్ వర్మ ఈ ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. నాలుగు పేజీల సమాధాన పత్రం సమర్పించి, నిరంజన్ రెడ్డి చర్యల వల్లే తాను నష్టపోయానని పేర్కొన్నారు. అధీర, మహాకాళి, జై హనుమాన్, బ్రహ్మరాక్షస సినిమాలకు సంబంధించి ఎటువంటి అధికారిక ఒప్పందాలు లేవని స్పష్టం చేశారు. "ఆక్టోపస్ సినిమాకు సంబంధించిన చెల్లింపులు ఆ ప్రాజెక్ట్ ఒరిజినల్ ప్రొడ్యూసర్కి అప్పగించాను. ఆ విషయాన్ని నిరంజన్ ఆయనే తేల్చుకోవాలి" అని చెప్పారు.
ప్రశాంత్ వర్మ తన ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం 'హనుమాన్' సినిమా ద్వారా రూ. 295 కోట్లు వసూలయ్యాయి. ఆ లాభాల నుంచి తనకు రావాల్సిన వాటా ఇవ్వకుండా, నిర్మాత నిరంజన్ రెడ్డి ఆ నిధులను డార్లింగ్, సంబరాల ఏటిగట్టు, బిల్లా రంగ భాషా వంటి ప్రాజెక్ట్లకు మళ్లించారని ఆరోపించారు. "అధీర సినిమా కోసం ఇచ్చిన కోటి రూపాయల అడ్వాన్స్ అనేది నిజం కాదు. అది కేవలం టీజర్ డైరెక్షన్ కోసం మాత్రమే ఇచ్చారు. ఈ ఫిర్యాదు అంతా నా వాటా దాచిపెట్టేందుకే రూపొందించిన నాటకం" అని వర్మ స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఈ అంశం ఫిలిం చాంబర్ వద్ద విచారణలో ఉంది. ఇరువురి వాదనలపై ఇంకా ఎటువంటి నిర్ణయం వెలువడలేదు. అయితే, ఈ వివాదం పరిష్కారం రాకపోతే కోర్టు దారి తీసే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రశాంత్ వర్మపై మరికొందరు నిర్మాతలు కూడా అడ్వాన్స్ రిఫండ్ కోసం డిమాండ్ చేస్తున్నారని సమాచారం. దీంతో ఆయన కెరీర్లో విశ్వసనీయత, భవిష్యత్ ప్రాజెక్ట్లపై ఈ కేసు ప్రభావం చూపే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











