Prasanth Varma: అవన్నీ తప్పుడు ప్రచారాలే.. ప్రశాంత్ వర్మ క్లారిటీ!
Prasanth Varma: 'హనుమాన్' సినిమాతో టాలీవుడ్లో సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ తాజాగా కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన ప్రైమ్ షో ఎంటర్టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత నిరంజన్ రెడ్డితో ఆయనకు ఆర్థిక విభేదాలు తలెత్తాయి. ప్రస్తుతం ఈ వివాదం తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ పరిధిలో విచారణలో ఉండగా, మీడియాలో వెలువడుతున్న కథనాలపై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అధికారికంగా స్పందించారు. ఇంతకీ ఏమన్నారంటే ?
200 కోట్ల వివాదం ఎలా మొదలైంది?
తేజ సజ్జా హీరోగా నటించిన 'హనుమాన్' సినిమా 2024 సంక్రాంతి సందర్భంగా విడుదలై పాన్ ఇండియా స్థాయిలో రూ. 295 కోట్ల వసూళ్లు సాధించింది. చిన్న బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం తెలుగు సినిమాకు గర్వకారణమైంది. అయితే, ఈ భారీ విజయం తర్వాత దర్శకుడు-నిర్మాతల మధ్య ఆర్థిక లావాదేవీలపై విభేదాలు చెలరేగాయి. ఈ క్రమంలో నిర్మాత నిరంజన్ రెడ్డి ఫిలిం చాంబర్కి ఇచ్చిన ఫిర్యాదులో ప్రశాంత్ వర్మ.. అధీర, మహాకాళి, జై హనుమాన్, బ్రహ్మరాక్షస సినిమాలు తన బ్యానర్పై చేస్తానని హామీ ఇచ్చారనీ, ఈ క్రమంలో రూ, 10.34 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారని పేర్కొన్నారు.

అదేవిధంగా, ప్రశాంత్ సూచనతో రూపొందించిన 'ఆక్టోపస్' ప్రాజెక్ట్పై రూ. 10.23 కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ అవసరమైన NOC ఇవ్వలేదని ఆరోపించారు. దీంతో మొత్తం రూ. 20.57 కోట్ల రీఫండ్తో పాటు రూ.200 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాక, ప్రశాంత్ వర్మ ఇతర ప్రముఖ బ్యానర్ల (మైత్రీ మూవీ మేకర్స్, హోంబలే ఫిలిమ్స్)తో అదే ప్రాజెక్ట్లను కొనసాగిస్తున్నారని, వివాదం సర్దుమనిగే వరకు ఆ ప్రాజెక్టులను నిలిపివేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ప్రశాంత్ వర్మ స్పందన
ఈ ఆరోపణలపై దర్శకుడు ప్రశాంత్ వర్మ ఘాటుగా స్పందించారు. ఆయన ఒక ప్రెస్ నోట్ విడుదల చేస్తూ "నా మీద వస్తున్న వార్తలు అసత్యం, నిరాధారం, ప్రతీకారపూరితమైనవి" అని స్పష్టం చేశారు. ప్రశాంత్ వర్మ తన ప్రకటనలో "కొన్ని మీడియా పోర్టల్స్, సోషల్ మీడియా పేజీలు, న్యూస్ ఛానెల్స్ ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ దాఖలు చేసిన ఫిర్యాదులోని కొన్ని భాగాలను మాత్రమే ప్రసారం చేసి, నా సమాధానాన్ని విస్మరించాయి. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం. ఈ తరహా ఏకపక్ష ప్రచారాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను" అని అన్నారు.
దర్శకుడు ప్రశాంత్ మాట్లాడుతూ.. "నాకు, ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ మధ్య తలెత్తిన వివాదం ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ చాంబర్, తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ విచారణలో ఉంది. విచారణ జరుగుతున్న సమయంలో మీడియా ఈ కేసును చర్చించడం సరికాదు. ఇది న్యాయపరమైన ప్రక్రియకు ఆటంకం కలిగించడమే కాకుండా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేస్తుంది' అని తెలిపారు. "ఈ దశలో ఎవరైనా అంతర్గత పత్రాలు, ఇమెయిల్స్, ఒప్పందాలు లేదా ఆర్థిక వివరాలను బహిర్గతం చేయడమనేది విచారణలో జోక్యం చేసుకోవడమే అవుతుంది. మీడియా సంస్థలు, సోషల్ మీడియా ఛానెల్స్ ఈ విషయంలో బాధ్యతతో వ్యవహరించాలి" అని పేర్కొన్నారు.
డైరెక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ.. "నాపై చేసిన అన్ని ఆరోపణలు అబద్ధం. నిజాలు వెలుగులోకి వచ్చినప్పుడు ఎవరి ఉద్దేశాలు ఏవో అందరికీ తెలుస్తాయి. ఈ కేసు తెలుగు ఫిల్మ్ చాంబర్ పరిధిలో ఉంది. కాబట్టి, మీడియా ఊహాజనిత కథనాలు ప్రచురించకుండా తుది తీర్పు వరకు వేచి చూడాలి" అని ప్రశాంత్ వర్మ విజ్ఞప్తి చేశారు.
'హనుమాన్' విజయంతో వెలుగులోకి వచ్చిన ప్రశాంత్ వర్మ - నిరంజన్ రెడ్డి మధ్య 200 కోట్ల వివాదం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఒక వైపు నిర్మాత ఆర్థిక నష్టపరిహారం కోరుతుండగా, మరో వైపు దర్శకుడు మీడియా ప్రచారాన్ని ఖండిస్తున్నారు. తుది నిర్ణయం వచ్చే వరకు ఈ కేసు పరిశ్రమలో చర్చనీయాంశంగానే నిలిచేలా ఉంది. టాలీవుడ్ వర్గాలంతా ఇప్పుడు ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుందో ఆసక్తిగా గమనిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











