ప్రభుత్వం నియంత కావొచ్చు.. కానీ.. మంత్రి పేర్ని నానితో భేటికి ముందు వర్మ సెన్సేషనల్ ట్వీట్లు
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, తెలుగు సినిమా పరిశ్రమకు జరుగుతున్న వివాదం దేశవ్యాప్తంగా, సోషల్ మీడియాలో అత్యంత చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో ఆసక్తినే కాకుండా అలజడిని రేపాయి. దాంతో ఆర్జీవి, ఏపీ సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నాని మధ్య ట్విట్టర్లో ఆసక్తికరమైన చర్చ జరిగింది. అయితే ఇద్దరూ తమ ట్విట్టర్ వార్కు ముగింపు పలికి చర్చిద్దామనే అంగీకారానికి వచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రి పేర్ని నానితో సోమవారం భేటి జరుగడానికి ముందు వర్మ చేసిన ట్వీట్లు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఆ ట్వీట్ల వివరాల్లోకి వెళితే..

పేర్ని నానితో వర్మ ట్వీట్ వార్
సినిమా తీసే నిర్మాతలకు, చూసే ప్రేక్షకులకు మధ్య అంగీకారం ఉన్నప్పుడు.. సినిమా టికెట్ల ధరను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వచ్చిందనే ప్రశ్నలను రాంగోపాల్ వర్మ లేవనెత్తారు. అయితే ప్రభుత్వం తరఫున మంత్రి పేర్ని నాని తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. మంత్రి నాని ఇచ్చిన కౌంటర్కు వర్మ మళ్లీ తన శైలిలో జవాబులివ్వడం నెటిజన్లను ఆకట్టుకొన్నది. అయితే సోషల్ మీడియాలో కాకుండా వ్యక్తిగత చర్చిద్దామని వర్మ సలహా ఇవ్వడంతో పేర్ని నాని కూడా సానుకూలంగా స్పందించారు.
ఒరేయ్ సుబ్బారావుల్లారా?
అయితే టికెట్ రేట్లు పెంచేవాడికి, ప్రేక్షకుడికి ఇబ్బంది లేనప్పుడు ప్రభుత్వానికి ఏంటి నొప్పి అంటూ రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ను కొందరు ట్రోల్ చేశారు. ‘విటుడు, వేశ్యకు ఇబ్బంది లేనప్పుడు పోలీసులకు ఏంటి నొప్పి?', ‘లంచం ఇచ్చేవాడికి, పుచ్చుకొనే వాడికి ఇబ్బంది లేనప్పడు ఏసీబీకి ఏంటి నొప్పి?' బ్లూ ఫిలిం తీసేవాడికి చూసే వాడికి ఇబ్బంది లేనప్పుడు సెన్సార్ వాళ్లకి ఏంటి నొప్పి అంటూ కొందరు ప్రశ్నలు లేవనెత్తారు. అయితే నెటిజన్ల ట్రోలింగ్కు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో సెటైర్ వేశారు. ఓరేయ్ సుబ్బారావుల్లారా? నేను అడిగిన ప్రశ్నలకు కోర్టు, చట్టాల పరిధిలో ఉంది. మీరిచ్చే ఉదాహరణలన్నీ క్రిమినల్ కోణంలో ఉన్నాయి అంటూ ఘాటుగా స్పందించారు. టికెట్ రేట్లపై వర్మ తన స్పష్టమైన వైఖరిని మరోసారి స్పష్టం చేశారు.

ఓటరుకే పవర్ అంటూ
ప్రభుత్వాల పనితీరు, ఓటు హక్కు గురించి వర్మ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వమే కింగ్ లేదా నియంత కావొచ్చు. ప్రత్యేకమైన విధి నిర్వాహణ కోసం ఓటు వేసిన ఓటరుకే ఎక్కువ పవర్ ఉంటుంది. అలాంటి ఓటరుకు ప్రభుత్వాలు వాళ్లు తీసుకొనే నిర్ణయాలకు జవాబుదారీగా ఉండాల్సి ఉంటుంది అని ప్రముఖ రచయిత ఐయాన్ రాండ్ కోట్స్ను చెబుతూ ట్వీట్ చేశారు.

పేదల్లారా.. మీ ఆలోచన మార్చుకోండి..
ఇక సమాజంలోని ప్రజలపై కూడా రాంగోపాల్ వర్మ స్పందించారు. పేద ప్రజలకు సంబంధించి దారుణమైన విషయం ఏమిటంటే.. ధనవంతులు కావడానికి బదులు.. వాళ్లంత ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలపై బతకాలని అనుకొంటారు. పేదరికం ఓ అర్హత కాదు.. ఓ సామాజిక పరిస్థితి అని పేదలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ వర్మ తనదైన శైలిలో ట్వీట్ చేశారు.
Recommended Video

పేర్ని నానితో వర్మ భేటి
ఇలాంటి ట్వీట్ల మధ్య మంత్రి పేర్నినానితో దర్శకుడు రాంగోపాల్ వర్మ భేటీ కానున్నారు. ఏపీ సచివాలయంలో సోమవారం మధ్యాహ్నం జరిగే సమావేశంలో వీరిద్దరూ చర్చలు జరుపనున్నారు. సినిమా టికెట్ల ధరపై ప్రభుత్వానికి ఉన్న అభిప్రాయాలు, సినిమా పరిశ్రమలో ఉన్న అభిప్రాయలు, వాదనలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఏ మేరుకు మంత్రి పేర్ని నానిని వర్మ తన వాదనతో సంతృప్తి పరుస్తారో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











