‘జగన్ జోలికి రావొద్దు.. గేమ్ ఛేంజర్, హరిహర వీరమల్లు ఫ్లాప్ అందుకే’
ఆంధ్రప్రదేశ్లో సినిమాలు, రాజకీయాలకు ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీటికి కులాలు తోడై ఎప్పుడూ హాట్ హాట్గా సాగుతాయి ఇక్కడి వ్యవహారాలు. కూటమి ప్రభుత్వంలోనే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు స్వయంగా సినీ కుటుంబానికి చెందినవారు కావడం విశేషం. ఇక పవన్ కళ్యాణ్ స్వయంగా అగ్ర కథానాయకుడు. దీంతో సహజంగానే రాజకీయాలు, సినిమా అనేవి ఏపీలో కలిసికట్టుగా సాగుతున్నాయి.
ఒకే రోజున వార్ 2, కూలీ
రాజకీయాల్లో ప్రత్యర్ధులుగా ఉన్న వారు ఆయా సినిమాలను కావాలని టార్గెట్ చేస్తున్నారన్న విమర్శలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2తో పాటు సూపర్స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమాలు సందడి చేస్తున్నాయి. రెండు సినిమాలకు బెనిఫిట్ షోలకు, టికెట్ ధరల పెంపుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చేశాయి. దీంతో తొలిరోజే థియేటర్ల వద్ద ధరలు మోతక్కిపోయాయి.

టీడీపీకి దూరంగా ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టాలని ఆ పార్టీలోని మెజారిటీ నాయకులు, కేడర్, తారక్ అభిమానులు కోరుకుంటున్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, బ్యానర్లు, సీఎం సీఎం అంటూ అభిమానులు హల్చల్ చేసేవారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిమాండ్ కాస్త సైలెంట్ అయినప్పటికీ.. నివురుగప్పిన నిప్పులా ఉందని అంటున్నారు. ఎప్పటికైనా ఎన్టీఆర్ రూపంలో చంద్రబాబుకు ముప్పు పొంచి ఉందని ఓ వర్గం భయపడుతూనే ఉంది. తెలుగుదేశం పార్టీకి దూరంగా తన సినిమాలు చేసుకుంటున్నారు ఎన్టీఆర్.
వార్ 2ని ఆడనివ్వం
అయితే వార్ 2 సినిమా రిలీజ్ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేత, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన అనుచిత వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. ఎన్టీఆర్ సినిమాలు అసలు ఎలా చూస్తారు.. లోకేష్కు వ్యతిరేకంగా ఉన్న ఎన్టీఆర్ సినిమాలు ఆడనివ్వమంటూ వార్నింగ్ ఇచ్చారు. అలాగే వార్ 2 సినిమా ప్రదర్శనను అనంతపురంలో నిలిపివేయాలని ఆయన దగ్గుబాటి హెచ్చరించారు. వార్ 2 స్పెషల్ షోకు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ను.. ఎన్టీఆర్ అభిమాన సంఘం నేత ధనుంజయ నాయుడు ఆహ్వానించగా.. దీనికి సంబంధించిన ఫోన్ కాల్ సంభాషణల్లో ఈ విషయం బయటపడింది. దీంతో తారక్ అభిమానులు భగ్గుమంటున్నారు. అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కు దగ్గుబాటి ప్రసాద్ క్షమాపణలు చెప్పారు. తన ఫోన్ కాల్ ఆడియో బయటకు రావడం వెనుక సొంత పార్టీ నేతల కుట్ర ఉందని ఆరోపించారు.
సినిమా బాగుంటే ఏం చేయలేరు
జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను ఆడనియ్యమన్న దగ్గుబాటి ప్రసాద్ వ్యాఖ్యలపై వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా స్పందించారు. 'ఈవీఎంలు అనుకున్నారా వీళ్లు మార్చి మోసం చేయడానికి..పెద్ద ఎన్టీఆర్ అభిమానులంతా చిన్న ఎన్టీఆర్ సినిమాలు చూస్తారు. చిన్న ఎన్టీఆర్ సినిమాల్ని ఆపేస్తాను అంటే.. సూర్యుడిని అరచేతితో ఆపుతాము అన్నంత హాస్యాస్పదంగా ఉంది. సినిమా బాగుంటే ఎవ్వరూ ఏం చేయలేరు.. బాలేనప్పుడు ఎవ్వరూ ఆడించలేరు. హరిహర వీరమల్లు సినిమా విషయంలో మీకు తెలిసే ఉంటుంది.. ఎమ్మెల్యేలు తలకిందులుగా తపస్సు చేసి టికెట్లు ఫ్రీగా ఇస్తే కూడా వారి అభిమానులే థియేటర్కి రాలేక ఏడుస్తూ ఆ సినిమాను ఎలా చేశారో మనమంతా కళ్లారా చూశాం' అని రోజా ఎద్దేవా చేశారు
సినిమా ఈవెంట్స్లో జగన్ను తిట్టడమే పని
'ఇప్పటికైనా వాళ్లు తెలుసుకోవాల్సింది రాజకీయం రాజకీయంలా చేయండి, సినిమాను సినిమా వాళ్లు చూసుకుంటారు. సినిమా ఫంక్షన్లలలో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, సవాళ్లు చేయడం చేస్తే ఏ విధంగా గేమ్ ఛేంజర్, హరిహర వీరమల్లు లాంటి సినిమాలు ఏమయ్యాయో మనం కళ్లారా చూశాం. కాబట్టి సినిమాను, రాజకీయాన్ని మిక్స్ చేయొద్దండి. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో లేరు.. ఆయన సినిమాలు చేసుకుంటున్నారు. ఆయన సినిమాలు ఏ విధంగా సూపర్ హిట్స్ అవుతున్నాయి.. ఏ విధంగా ఆయన పర్ఫార్మెన్స్కు అవార్డ్స్ వస్తున్నాయి ఇంటర్నేషనల్ రేంజ్లో మనం కళ్లారా చూస్తున్నాం. మాకు మైకులు ఉన్నాయి.. పచ్చ ఛానెల్స్ ఉన్నాయని వేస్తే చూసే జనం నవ్వుతారు' అంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు.


Click it and Unblock the Notifications











