టాలీవుడ్ లో మరో విషాదం.. కరోనాతో ప్రముఖ సింగర్ మృతి!
కరోనా వైరస్ కల్లోలం ఆగడం లేదు. రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతూ అందరిలో టెన్షన్ రేపుతోంది. మొదటి వేవ్ కంటే దారుణంగా ఉన్న ఈ సెకండ్ వేవ్ ఈ సారి సెలబ్రిటీలు, సినిమా వాళ్ళను కూడా వదలడం లేదు. మరీ ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే కరోనా బారిన పడి తెలుగు సినీ పరిశ్రమ కొంతమంది యువ దర్శకులను ఇతర టెక్నీషియన్స్ ను కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా టాలీవుడ్కి చెందిన ప్రముఖ సింగర్ కరోనాతో మృతి చెందారు.
నవదీప్ హీరోగా తేజ దర్శకత్వంలో నటించిన 'జై' సినిమాలో 'దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జండా మనదే..' పాటతో ప్రాచుర్యం పొందిన నేరేడుకొమ్మ శ్రీనివాస్ అలియాస్ 'జై' శ్రీనివాస్ ఈ రోజు కరోనా కారణంగా కన్ను మూశారు. గత కొన్ని రోజులుగా కరోనాతో పోరాడుతూ సికింద్రాబాద్లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారని తెలుస్తోంది. సినిమా పాటలే కాకుండా బయట కూడా ఎన్నో దేశభక్తి గీతాలు ఆయన ఆలపించారు. జై శ్రీనివాస్ గత నెలలో కరోనా బారిన పడ్డాడు.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కావడంతో హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరాడు. ముందు వైద్యం కోసం కుటుంబ సభ్యులు సుమారు రూ.11 లక్షలకు పైగా ఖర్చు చేశారు.

ఇంకా పరిస్థితి విషమంగానే ఉండటం, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురు కావడంతో భార్య పిల్లలు తమకు సాయం అందించాలని కోరారు. ఆ సమయంలో టాలీవుడ్ నుంచి సింగర్స్ కూడా ఆయన ఫండ్స్ కోసం వీడియోలు చేశారు. ఆయనకు భార్య స్వాతి, కూతుళ్లు అభిష్ణు, జైత్ర ఉన్నారు. ఇక ఆయన మరణవార్త తెలిసిన సినీ ప్రముఖులు.. శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. నివాళులు అర్పిస్తున్నారు.


Click it and Unblock the Notifications











