#ElluvochiGodarammaకి 100 మిలియన్ వ్యూస్.. నా 'శ్రీదేవి' అయినందుకు థాంక్స్ అంటూ ఆసక్తికర ట్వీట్!
ఈ మధ్యకాలంలో పాటలు బాగుంటే వాటిని సూపర్ హిట్ చేసేస్తున్నారు ప్రేక్షక దేవుళ్ళు. అలానే మరో పాటకు అరుదైన ఘనత దక్కింది. మెగా హీరో వరుణ్ తేజ్, పూజ హెగ్డే జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో గద్దల కొండ గణేష్ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. వాస్తవానికి వాల్మీకి అనే పేరుతో సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా సదరు కులస్తులు అభ్యంతరం తెలపడంతో రాత్రికి రాత్రి గద్దలకొండగణేష్ గా పేరు మార్చి సినిమా రిలీజ్ చేశారు.. ఈ సినిమాలో శోభన్ బాబు అతిలోకసుందరి శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన దేవత సినిమాలోని 'ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డాదమ్మో' అనే పాటను రీమిక్స్ చేశారు.
ఈ పాట దెబ్బకు సినిమా సూపర్ హిట్ అవడమే కాక పాట కూడా జనానికి బాగా నచ్చేసింది. ఇక ఈ సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాటను మిక్కీ జే మేయర్ రీమిక్స్ చేశారు. తాజాగా ఈ రోజు ఈ పాటకు 100 మిలియన్ వ్యూస్ దాటాయి. ఇక ఈ సందర్భంగా పూజా హెగ్డే హరీష్ శంకర్ గురించి ఆసక్తికరమైన ట్వీట్ చేసింది.

''ఏ పనైనా చేస్తున్నప్పుడు పూర్తి ప్రేమ పెట్టి చేస్తే అది చాలా మందిని చేరుతుందని నాకు నేర్పించినందుకు ధన్యవాదాలు, ఒకరకంగా ఇది షూటింగ్ సమయంలో శారీరక పరంగా కష్టపడాల్సిన విషయమే అయినా ఇది 100 మిలియన్ వ్యూస్ అందుకోవడం చాలా ఆనందంగా ఉంది.

ఈ పాటను రీమేక్ చేయాలనే మీ కల ఇంత ఘనత చేసి పెట్టింది థాంక్యూ సార్ అని చెప్పుకొచ్చింది. దీనికి స్పందించిన హరీష్ శంకర్ మీ హార్డ్ వర్క్ అలాగే డెడికేషన్ స్క్రీన్ మీద కనిపించిందని మిలియన్ సార్లు థాంక్స్ చెప్పినా తన ఆనందాన్ని తీర్చుకోలేను అని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాక తన శ్రీదేవిగా ఉన్నందుకు ధన్యవాదాలు అని హరీష్ శంకర్ కూడా ఆసక్తికరంగా ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











