ఛార్మీ ఇంటి ముందు లైగర్ బాధితుల ధర్నా, ఒక్కపైసా ఇవ్వను, చూసుకొందాం.. పూరీ జగన్నాథ్ సవాల్
లైగర్ డిస్టిబ్యూటర్లు, దర్శక, నిర్మాత పూరీ జగన్నాథ్, చార్మీ మధ్య వివాదం మీడియాలో చర్చనీయాంశంగా మారింది. విజయ్ దేవరకొండ, అనన్య పాండే కలిసి నటించిన ఈ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా కొట్టడం తెలిసిందే. అయితే భారీగా నష్టపోయిన డిస్టిబ్యూటర్లను పూరీ జగన్నాథ్ ఆదుకొంటానని హామీ ఇచ్చినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే పలుమార్లు విన్నవించుకొన్నప్పటికీ.. తమకు న్యాయం చేయలేదంటూ డిస్టిబ్యూటర్లు పూరీ జగన్నాథ్, ఛార్మీ ఇంటి ముందు ధర్నా దిగేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ఈ వార్త వివరాల్లోకి వెళితే..

భారీ నష్టాల్లో లైగర్ మూవీ..
లైగర్ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే.. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 62 కోట్ల మేర బిజినెస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 88.40 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు చేసింది. ఇక తెలుగులో దాదాపు 40 కోట్ల వరకు నష్టాలను, ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 60 కోట్ల మేర నష్టాలను చవిచూసింది. భారీ పరాజయం పొందడంతో నష్టాల బారిన పడిన డిస్టిబ్యూటర్లను నెల రోజుల లోపు ఆదుకొనేందుకు పూరీ జగన్నాథ్ సిద్దమయ్యారు.

వరంగల్ శ్రీనుతోపాటు 83 మంది..
అయితే డిస్టిబ్యూటర్లకు ఇచ్చిన హామీ నెరవేర్చడంలో పూరీకి కాస్త ఆలస్యమైంది. దాంతో డిస్టిబ్యూటర్లు అసహనంతో పూరీ, చార్మీ ఇంటి ముందు ధర్నా చేసేందుకు సిద్దమయ్యారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. వరంగల్ శ్రీను, ఇతర లైగర్ బాధితులంతా మొత్తం 83 మంది ఎగ్జిబ్యూటర్లు గురువారం పూరీ జగన్నాథ్, ఛార్మీ ఇంటి ముందు ధర్నా చేసేందుకు వెళ్తున్నాం. కాబట్టి మాకు సహకారం అందించాలి అని డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు కోరారు.

నాలుగు రోజులపాటు ధర్నా
పూరీ జగన్నాథ్ ఇంటి ముందు కనీసం నాలుగు రోజులపాటు ధర్నా చేపట్టడానికి సిద్దమై రావాలి. అందుకు అనుగుణంగా నాలుగు జతల దుస్తులు తీసుకురండి. ప్రతీ ఎగ్జిబిటర్ నలుగురు వ్యక్తులను తీసుకు రావాలి. ఎవరైనా రాకపోతే వారి పేరును లిస్ట్ నుంచి తీసివేస్తాం. ఎవరికి వ్యక్తిగతంగా ఫోన్ చేయం. తమంతట తాము వస్తే బాధ్యతగా భావిస్తాం. ఉదయరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి ఆఫీస్ వద్ద కలిసి.. పూరీ జగన్నాథ్ ఇంటికి బయలుదేరాలి అని తమకు సంబంధించిన గ్రూప్లో పోస్టు పెట్టారు.

ఎందుకు డబ్బు తిరిగి ఇవ్వాలి?
ఇదిలా ఉంటే.. డిస్టిబ్యూటర్ల ధర్నా గురించి మాట్లాడిన పూరీ జగన్నాథ్ ఆడియో ఫైల్ మీడియాలో లీక్ అయి వైరల్గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. ఏంటి.. బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? నేను ఎవరికీ డబ్బు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినా పాపం వాళ్లు నష్టపోయారని ఇస్తానని చెప్పాను. ఇదివరకే డిస్టిబ్యూటర్లతో మాట్లాడాను. నెలలో నేను ఒప్పుకొన్న అమౌంట్ ఇస్తానని హామీ ఇచ్చాను అని ఆడియో ఫైల్లో పూరీ జగన్నాథ్ అన్నట్టు వైరల్ అయింది.

ఇస్తానని చెప్పిన డబ్బులు కూడా..
అయితే తాను హామీ ఇచ్చినా డిస్టిబ్యూటర్లు ధర్నాకు సిద్దం కావడంతో పూరీ మండిపడుతూ.. ఇస్తానని చెప్పిన తర్వాత కూడా అతి చేస్తే ఇవ్వాలనుకొన్నది కూడా ఇవ్వను. వాళ్లకు ఎందుకు ఇవ్వాలి? పరువు పోతుందని ఇస్తానని చెప్పాను. ఇక పరువు తీయాలని చూస్తే మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని పూరీ జగన్నాథ్ ఎమోషనల్ అయ్యారు.
నాకు ఆ డబ్బులు ఇప్పిస్తారా?
సినిమా పరిశ్రమలో అందరం గ్యాంబ్లింగ్ చేస్తున్నాం. కొన్ని ఆడుతాయి. కొన్ని పోతాయి. పోకిరి సినిమా నుంచి ఇస్మార్ట్ శంకర్ వరకు బయర్స్ వద్ద నుంచి నాకు రావాల్సిన డబ్బు ఎంతో ఉంది. బయ్యర్స్ అసోసియేషన్ నాకు ఆ మొత్తం వసూలు చేసి పెడుతారా? ధర్నా చేయాలనుకొంటే చేయండి.. ధర్నా చేసిన వారి లిస్టు తీసుకొని.. వాళ్లకి తప్ప.. మిగితా వాళ్లకి ఇస్తా అని పూరి జగన్నాథ్ ఫోన్లో రివర్స్ షాక్ ఇచ్చినట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











