Kamal Haasan నా హృదయం ఉప్పొంగింది.. షేర్షా సినిమాపై కమల్ ప్రశంసల వర్షం
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని దేశభక్తి ప్రధానంగా తెరకెక్కిన చిత్రాల్లో సూపర్ టాక్ సొంతం చేసుకొన్న షేర్షా చిత్రానికి దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతున్నది. కార్గిల్ పోరులో భారత సైనంలోని ఓ విభాగానికి నేతృత్వం వహించి పాక్ సేనలకు వ్యతిరేకంగా పోరాటం చేసి కెప్టెన్ విక్రమ్ బాత్రా అశువులు బాసిన విషయం తెలిసిందే. ఆయన జీవిత కథ నేపథ్యంగా తెరకెక్కిన చిత్రానికి దక్షిణాది దర్శకుడు విష్ణు వర్ధన్ దర్శకత్వం వహించి ఉత్తరాది ప్రేక్షకులను కూడా మెప్పించారు.
ఈ చిత్రానికి మంచి ఆదరణ దక్కుతున్న సమయంలో విలక్షణ నటుడు, భారత దేశం గర్వించదగిన యాక్టర్ కమల్ హాసన్ ప్రశంసల వర్షం కురిపించారు. షేర్షా సినిమా చూసిన తర్వాత కమల్ హాసన్ ట్విట్టర్లో స్పందించారు. ఇండియన్ ఆర్మీ ప్రతిష్టను పెంచే చిత్రంగా తెరకెక్కిందని ట్వీట్లో పేర్కొన్నారు.

షేర్షా సినిమా కథ ఏమిటంటే
షేర్షా సినిమా విషయానికి వస్తే... విక్రమ్ బాత్రా పాత్రలో సిద్దార్థ మల్హోత్రా నటించారు. కార్గిల్ వార్లో పాల్గొన్న విక్రమ్ బాత్రా సముద్ర తీరానికి 19962 అడుగుల ఎత్తులోని పాయింట్ 5140 ప్రాంతాన్ని పాక్ సైన్యం చెర నుంచి విముక్తి కలిగిస్తాడు. ఆ తర్వాత లెఫ్టినెంట్ హోదా నుంచి కెప్టెన్గా ప్రమోషన్ పొందుతాడు.
అనంతరం పాక్ చెరలో ఉన్న పాయింట్ 4875 ప్రాంతాన్ని విముక్తి కలిగించేందుకు యుద్ధ రంగంలో విక్రమ్ బాత్రా దూకడమే కాకుండా భారత్కు విజయం చేకూర్చి పోరాటంలో ప్రాణాలు కొల్పోతాడు. ఈ కథను కళ్లకు కట్టినట్టుగా యుద్ద సన్నివేశాలను సహజంగా చిత్రీకరించారు. విక్రమ్ బాత్రా ప్రేయసిగా డింపుల్ పాత్రలో కియారా అద్వానీ జీవించారు.

కంటతడి పెట్టించిన కియారా అద్వానీ
షేర్షా సినిమా రిలీజ్ సమయంలో ఈ చిత్రంలోని కీలక పాత్రలను పోషించిన సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ నటనను ఆకాశానికి ఎత్తేశారు. విక్రమ్ బాత్రా, అతని ప్రియురాలి పాత్రలో నటించిన కియారా, సిద్దార్థ్ తమను కంటతడి పెట్టించారు. భావోద్వేగానికి గురిచేశారు అంటూ బాలీవుడ్ సినీ ప్రముఖులు ట్వీట్ల వర్షం కురిపించారు. తాజాగా ఆ జాబితాలో కమల్ హాసన్ చేరారు.

నా ఛాతీ ఉప్పొంగిందంటూ
ఇలాంటి విలువలు ఉన్న షేర్షా సినిమా చూసిన కమల్ హాసన్ ప్రశంసల వర్షం కురిపించారు. చిన్నతనం నుంచి సినీ అభిమానిగా, ఓ దేశభక్తుడి కుమారుడిగా భారతీయ సైన్యాన్ని సినిమాగా తెరకెక్కించే విషయంలో కొంత అభిప్రాయబేధాలు ఉండేవి. కానీ షేర్షా సినిమా చూసిన తర్వాత నా దేశ సైనికులను తెర మీద చూపించిన విధానంతో నా హృదయం ఉప్పొంగింది అని కమల్ హాసన్ ట్వీట్ చేశారు. షేర్షా సినిమాపై కమల్ ప్రశంసల వర్షం కురిపించారు.

కమల్ హాసన్కు థ్యాంక్స్ చెప్పిన కరణ్, కియారా
ఇక కమల్ హాసన్ చేసిన ట్వీట్పై షేర్షా నిర్మాత కరణ్ జోహర్ స్పందించారు. థ్యాంక్యూ వెరీ మచ్ సార్. మీ ప్రశంసలతో షేర్షా సినిమాకు, చిత్ర యూనిట్కు గొప్ప గౌరవం దక్కింది అని కరణ్ తన ట్వీట్లో పేర్కొన్నారు. కమల్ హాసన్ ప్రశంసపై కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా కూడా స్పందిస్తూ.. థ్యాంక్యూ సార్ అంటూ ట్వీట్లు పెట్టారు.
Recommended Video

అమెజాన్ ఓటీటీలో షేర్షా
దేశవ్యాప్తంగా థియేటర్లలో సినిమాల రిలీజ్కు అనుకూలమైన వాతావరణం లేకపోవడం వల్ల షేర్షా చిత్రం ఆగస్టు 12వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ఫిల్మీబీట్ పూర్తి రివ్యూ మీ కోసం..


Click it and Unblock the Notifications











