నాపై ఆరోపణలు లేవు.. ఇదో సైడ్ఎఫెక్ట్.. విజయ్ దేవరకొండతో 12 గంటల ఈడీ విచారణ
లైగర్ సినిమాలో అక్రమ పెట్టుబడుల వ్యవహారంలో సినీ హీరో విజయ్ దేవరకొండను హైదరాబాద్లోని బషీర్ బాగ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) కార్యాలయంలో బుధవారం సుదీర్ఘంగా విచారించింది. ఈ కేసులో రెండు వారాల క్రితం దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత ఛార్మీ కౌర్ను 8 గంటలపాటు విచారించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో కొన్ని క్లారిఫికేషన్ కోసం విజయ్ దేవరకొండను విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేయడంతో ఆయన అధికారులు ముందుకు వచ్చారు. ఈ కేసు విచారణ తర్వాత విజయ్ దేవరకొండ మీడియాతో మాట్లాడారు. అలాగే ఈ కేసు వివరాల్లోకి వెళితే..

ఎవరి నుంచి అక్రమ పెట్టుబడులు?
ఆర్థిక చట్టాలను ఉల్లంఘించి లైగర్ సినిమా కోసం పెట్టుబడులు పెట్టారు. ది ఫారిన్ ఎక్చ్సేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) 1996 నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించారు. అయితే ఈ సినిమాకు అక్రమంగా పెట్టుబడులు ఎవరు పెట్టారనే విషయం విజయ్ దేవరకొండకు తెలుసు అనే కోణంలో ఈడీ అధికారులు విచారణకు సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే ఆయనకు నోటీసులు జారీ చేశారని సినీ వర్గాలు పేర్కొన్నారు.

తెర వెనుక వ్యక్తుల గురించి ప్రశ్నలు
ఫెమా చట్టం ఉల్లంఘన వ్యవహారంలో పూరీ, చార్మీని 8 గంటలకుపైగా విచారించిన ఈడీ అధికారులు.. విజయ్ దేవరకొండకు వచ్చే సరికి దాదాపు 12 గంటలపాటు విచారించారు. ఈ విచారణ సందర్భంగా లైగర్ సినిమాకు పెట్టుబడి పెట్టిన కంపెనీ ఎవరు? తెర వెనుక ఉండి పెట్టుబడి పెట్టిన వ్యక్తులు ఎవరు? విదేశాల నుంచి ఎంత మొత్తం పెట్టుబడి వచ్చింది? అనే కోణంలో విజయ్ దేవరకొండకు ప్రశ్నలు సంధించినట్టు సమాచారం.

12 గంటలపాటు విచారణ
ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ ఉదయం 10 గంటల ప్రాంతంలో హాజరయ్యారు. విచారణ సందర్భంగా అధికారులు పలు కోణాల్లో ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. అయితే విజయ్ దేవరకొండ తనకు తెలిసిన సమాధానాలను, విషయాలను ఎలాంటి బెరుకు లేకుండా అధికారులకు వివరించారు. విచారణ మధ్యలో కాస్త విరామం ఇచ్చి.. పలు దఫాలుగా ప్రశ్నలు వేసి జవాబులు స్వీకరించారు. విజయ్తో విచారణ దాదాపు 12 గంటలపాటు సాగింది అని తెలిసింది.

నా డ్యూటీ నేను చేశాను.. అంటూ
లైగర్ పెట్టుబడుల వ్యవహారంలో విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ.. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈడీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... నోటీసులు ఇవ్వడంతో విచారణకు హాజరై నా డ్యూటీ నేను చేశాను. ఉదయాన్నే నేను ఇక్కడికి వచ్చాను. నాపై ఎలాంటి ఆరోపణలు లేవు. క్లారిఫికేషన్స్ అడిగారు. వాళ్లు విచారణ చాలా బాగా చేస్తున్నారు. వారికి నేను సహకరించాను అని విజయ్ దేవరకొండ చెప్పారు.
జీవితంలో ఇదోక ఎక్స్పీరియెన్స్.
సినీ హీరో అంటే ప్రేక్షకులు కొండంత అభిమానం కురిపిస్తారు. నాపై కూడా చాలా ప్రేమను కురిపించారు. ప్రేమతో వచ్చే పాపులారిటి వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. జీవితంలో ఇదోక ఎక్స్పీరియెన్స్. ఇంతకంటే ఎక్కువ చెబితే.. ఈడీ అధికారులు ఫీల్ అవుతారు. మళ్లీ విచారణకు రమ్మని చెప్పలేదు. ఒకవేళ చెబితే.. విచారణకు హాజరుకావడానికి ఎలాంటి సందేహం అవసరం లేదు అని విజయ్ దేవరకొండ తెలిపారు.


Click it and Unblock the Notifications











